సెన్సెక్స్ పతనం: ఒక్క రోజులో 6.5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోవడానికి కారణాలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
భారత స్టాక్ మార్కెట్లను బ్లాక్మండే అతలాకుతలం చేసింది. ఒక్క సోమవారం నాడే (మార్చి 9) బీఎస్ఈ సెన్సెక్స్ 1,941 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ కూడా 538 పాయింట్లు నష్టపోయింది.
సోమవారం మధ్యాహ్నం ఒకానొక సమయంలో సెన్సెక్స్ ఏకంగా 2450 పాయింట్లకు పైగా పతనమైనా... తర్వాత కొద్దిగా కొలుకుని 1941 పాయింట్ల నష్టంతో ముగిసింది.
శుక్రవారం సాయంత్రం 37,576 దగ్గర క్లోజ్ అయిన సెన్సెక్స్... రెండు రోజుల విరామం తర్వాత సోమవారం ఉదయం ప్రారంభం అవ్వడమే 36,950 పాయింట్ల దగ్గర మొదలైంది.
ప్రారంభం నుంచే వేగంగా సూచీలు పడిపోతూ వచ్చాయి. మధ్యాహ్నం ఒకానొక సమయంలో సెన్సెక్స్ 35,109 పాయింట్లకు పడిపోయింది. మధ్యాహ్నం కాస్త కోలుకుని 35,635 పాయింట్ల వద్ద ముగిసింది.
2008-09 ఆర్థిక మాంద్యం నాటి పరిస్థితుల్లో కూడా ఒక్క రోజులో ఇంత పతనం ఎప్పుడూ స్టాక్ మార్కెట్లు చవి చూడలేదు. ఈ పతనం వల్ల సోమవారం ఒక్క రోజులోనే 6.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయినట్లు ఎకనమిక్ టైమ్స్ తెలిపింది.
ఇంతలా మార్కెట్ల పతనానికి నాలుగు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. వాటిలో మొదటిది కరోనా వైరస్ (కోవిడ్ 19) ప్రభావం. రెండోది అంతర్జాతీయ చమురు ధరల పతనం, మూడోది దేశీయ ఆర్థిక వ్యవస్థపై యస్ బ్యాంక్ సంక్షోభం వంటి ఘటనల ప్రభావం. నాలుగోది విదేశీ సంస్థాగత పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోవడం.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ మార్కెట్లపై కరోనా ఎఫెక్ట్
కరోనా వైరస్ ప్రభావం ప్రపంచం వ్యాప్తంగా అన్ని మార్కెట్ల మీదా ప్రతికూలంగానే ఉంది. ఇప్పటికే చాలా దేశాల స్టాక్ మార్కెట్లు గణనీయంగా పడిపోయాయి.
ఆర్థిక వ్యవస్థ మీద కరోనా ప్రతికూల ప్రభావంతో మదుపరులు తమ పెట్టుబడులను బంగారం మీదకు మళ్లిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వ్యక్తుల సంఖ్య లక్ష దాటడంతో ఇన్వెస్టర్లలో మరింత భయాందోళనలు పెరిగాయి.
ఈ ఒక్క సోమవారమే బ్రిటన్ స్టాక్ మార్కెట్ పదేళ్ల కనిష్టానికి పడిపోయింది. ఒక్కరోజులో 8 శాతానికి పైగా షేర్లు పతనమయ్యాయి.
రెండు రోజుల విరామం తర్వాత మొదలైన అన్ని స్టాక్ మార్కెట్లూ ఇలాగే పతనమయ్యాయి.
భయాలు పెంచిన చమురు ధరల పతనం
తాజాగా ఒపెక్ దేశాలు, రష్యా మధ్య జరిగిన వివాదం కూడా ఈ పతనాలకు ఒక కారణంగా నిలుస్తోందని మార్కెట్ అనలిస్ట్ సతీశ్ మండవ బీబీసీతో అభిప్రాయపడ్డారు.
‘‘కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా టూరిజంతో పాటు అన్ని రంగాలూ నెమ్మదించాయి. ఫలితంగా చమురుకు కూడా డిమాండ్ తగ్గుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో క్రూడ్ సప్లై తగ్గించాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. కానీ, దీనికి రష్యా అంగీకరించలేదు. ఒపెక్లో ఎక్కువ భాగం వాటా ఉన్న సౌదీ అరేబియా చమురు సప్లై పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో చమురు ధరలు పదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఇది కూడా మార్కెట్ల పతనానికి కారణమైంది’’ అని సతీశ్ మండవ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశీయ సంక్షోభాలు, విదేశీ ఇన్వెస్టర్లు
‘‘కరోనా, క్రూడాయిల్ ఎఫెక్ట్లతో పాటు.. దేశీయంగా యస్ బ్యాంక్ వంటి సంక్షోభాలు భారత ఆర్థిక వ్యవస్థ మీద విదేశీ మదుపరులు నమ్మకాన్ని తగ్గిస్తున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని బంగారం మీదకు, బాండ్ల మీదకు మళ్లిస్తున్నారు. ఇది కూడా మార్కెట్ల పతనానికి ఒక కారణమైంది. ఇలా అన్ని కారణాలు కలసి ఇండియన్ మార్కెట్ల మీద ప్రతికూలంగా మారాయి’’ అని సతీశ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఒక మహిళ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేది ఎప్పుడు?
- కరోనావైరస్: చైనాలో రెండు రాష్ట్రాల మధ్య చిక్కుకుపోయిన క్యాన్సర్ పేషెంట్... ఆ తర్వాత ఏమైంది?
- మునిగిపోతున్న రాజధాని.. రూ.2.52 లక్షల కోట్లతో కొత్త రాజధాని నగరం నిర్మాణానికి ప్రణాళికలు
- పీటీ ఉష: ఎలాంటి సదుపాయాలూ లేని పరిస్థితుల్లోనే దేశానికి 103 అంతర్జాతీయ పతకాలు సాధించిన అథ్లెట్
- దిల్లీలో 'స్కామ్' కాల్సెంటర్ గుట్టు రట్టు చేసిన బీబీసీ... ఇద్దరు హైటెక్ మోసగాళ్ళ అనుభవాలు
- కరోనావైరస్ ప్రభావంతో ప్రపంచమంతటా కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు
- ప్రపంచ మార్కెట్లు ఎందుకిలా పతనమయ్యాయి?
- లబ్.. డబ్బు: షేర్ మార్కెట్లు ఎందుకిలా పడిపోతున్నాయి?
- బంగారం కొనాలా.. అమ్మాలా? ధర ఎందుకు పెరుగుతోంది?
- లబ్..డబ్బు: స్టాక్ మార్కెట్ పతనమౌతున్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
- ఇదోరకం మోసం.. కొన్ని సెకన్ల ముందు సమాచారం తెలుసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు
- యాపిల్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్... వీటి భవిష్యత్తు ఏమిటి?
- వారెన్ బఫెట్ భారతదేశంలో ఎందుకు పెట్టుబడులు పెట్టడం లేదు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









