కశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవల రద్దు వంటి ఆంక్షలను ప్రభుత్వం వారంలోగా సమీక్షించాలి :సుప్రీం కోర్టు

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

జమ్ము-కశ్మీర్‌లో అమలులో ఉన్న ఆంక్షలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పు వినిపించిన సుప్రీంకోర్టు అన్ని ఆంక్షలనూ సమీక్షించాలని ప్రభుత్వానికి సూచించింది.

జమ్ము-కశ్మీర్ ప్రభుత్వం ఒక వారంలోపు అన్ని ఆంక్షల ఆదేశాలనూ సమీక్షించాలని సుప్రీంకోర్టు చెప్పింది.

"బాధిత ప్రజలు కోర్టులో సవాలు చేయగలిగేలా, జమ్ము-కశ్మీర్ పాలనా యంత్రాంగం సెక్షన్ 144 కింద జారీ చేసిన అన్ని ఆంక్షలకు సంబంధించిన ఆదేశాలను ప్రచురించాలి" అని జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు.

"కశ్మీర్‌ లోయలో ఒక నిర్ధారిత వ్యవధి లేకుండా, లేదా నిరవధికంగా ఇంటర్‌నెట్ నిలిపివేయడం టెలికామ్ నిబంధనలను ఉల్లంఘించినట్లే" అని సుప్రీంకోర్టు చెప్పింది.

కశ్మీర్‌లో నిర్బంధాన్ని రాజ్యాంగపరంగా సవాలు చేస్తూ ఒక బృందం వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, జస్టిస్ బీఆర్ గవైల ముగ్గురు జడ్జిల ధర్మాసనం తీర్పును నవంబర్ 27కు రిజర్వ్ చేసింది.

కేంద్రం గత ఏడాది ఆగస్టు 5న జమ్ము-కశ్మీర్ రాష్ట్రానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం లభించే ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసింది. దానితోపాటూ రాష్ట్రంలో చాలా రకాల ఆంక్షలు విధించింది.

జమ్ము-కశ్మీర్‌లో సమాచార మాధ్యమాలపై, ఇంటర్‌నెట్‌పై, ఇంకా చాలా రకాల ఆంక్షలు విధించారు.

కశ్మీర్‌లోని సీనియర్ జర్నలిస్ట్ అనురాధా భసీన్, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, మరికొందరు ఈ ఆంక్షలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారు.

పిటిషనర్ల తరఫున కోర్టుకు హాజరైన వకీల్ బృందా గ్రోవర్ కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత మాట్లాడుతూ "ఒక రాష్ట్రంలో భద్రత, స్వేచ్ఛ సమతుల్యం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు, మనం రాజ్యాంగంలోని కొన్ని సిద్ధాంతాల ప్రకారం స్వేచ్ఛను అడ్డుకోవచ్చు. కశ్మీర్లో కూడా మనం భద్రత, స్వేచ్ఛ సమతుల్యం చేసినప్పుడు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాల్సుంటుంది. కానీ రాష్ట్రంలో ఇంటర్‌నెట్, సమాచార మాధ్యమాలపై ఆంక్షలు విధించడం, సెక్షన్ 144 అమలు చేయడానికి సంబంధించిన ఆదేశాలను ప్రచురించడంగానీ, కోర్టు ముందు ఉంచడం గానీ జరగలేదు" అన్నారు.

"సుప్రీంకోర్టు సెక్షన్ 144 కింద ఆంక్షలు అమలు చేయాలనే ఆదేశాలను ప్రచురించామని, వాటిని ప్రచురించమని రాష్ట్రానికి సూచించామని తప్పు చెప్పింది. ఇక ముందు కూడా ఆదేశాలన్నీ ఎప్పుడూ ప్రచురిస్తుండాలి. బాధితులు వాటిని కోర్టులో సవాలు చేయవచ్చు. ఆ ఆదేశాల్లో తాము స్వేచ్ఛను ఎందుకు అడ్డుకుంటున్నారో కారణం చూపించాలి" అని చెప్పారు.

"ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ అనేది ఆర్టికల్ 19(1) ప్రకారం వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగం అని కూడా కోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఈరోజు చాలా ముఖ్యమైన విషయం చెప్పింది. అందుకే ప్రభుత్వం ఎప్పుడైనా ఇంటర్నెట్‌పై నిషేధం విధిస్తే, అది పరిమితులను పూర్తిగా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది" అని బృందా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)