ఆంధ్రప్రదేశ్: రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక... అమరావతిలో తీవ్ర నిరసనలు

ఫొటో సోర్స్, Andhra Pradesh I & PR Dept.
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలపై సత్వర సమీక్ష జరిపి, రాజధాని సహా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సమగ్ర వ్యూహాన్ని సూచించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తన నివేదికను అందజేసింది.
వికేంద్రీకృత అభివృద్ధి కోసం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవహారాలకు మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. పర్యావరణాన్ని, సమతుల ప్రాంతీయ అభివృద్ధి సాధనను దృష్టిలో ఉంచుకొంటూ, అందుబాటులో ఉన్న వనరులను అత్యుత్తమంగా ఉపయోగించుకోవాలని చెప్పిందని పేర్కొంది.
కమిటీ కన్వీనర్ జీఎన్ రావు, సభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ- విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా ఉండాలని, అక్కడే సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని సూచించామని చెప్పారు. వేసవిలో అసెంబ్లీ సమావేశాలకు తగ్గట్టుగా విశాఖలో ఏర్పాట్లు చేయాలని సూచించామన్నారు. విశాఖలో మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెద్ద మొత్తంలో భూములు అందుబాటులో ఉన్నాయని, అందుకే ఈ సూచన చేశామని పేర్కొన్నారు.
ప్రస్తుత రాజధాని అమరావతి శాసన వ్యవహారాల రాజధానిగా ఉండాలని సూచించామని వారు చెప్పారు. కర్నూలులో హైకోర్టును, అమరావతి, విశాఖపట్నంలలో హైకోర్టు ధర్మాసనాలు ఏర్పాటు చేయాలని సూచించామని తెలిపారు.
మూడు రాజధానులపై సీఎం చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే ఆందోళన బాట పట్టిన అమరావతి రైతులు తాజాగా జీఎన్ రావు కమిటీ వివరాలు వెల్లడించగానే భగ్గుమన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అమరావతిలో, శీతాకాల సమావేశాలు విశాఖపట్నంలో నిర్వహించాలని కమిటీ సూచించింది. మంగళగిరి, నాగార్జున విశ్వవిద్యాలయం మధ్య ప్రాంతానికి వరద ముప్పు లేదని, రాజ్ భవన్, అసెంబ్లీ అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పింది.
కర్నాటకను నమూనాను తీసుకొని, ఏపీని సమగ్రాభివృద్ధి కోసం నాలుగు ప్రాంతాలుగా వర్గీకరించాలని కమిటీ చెప్పింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను ఉత్తర కోస్తా ప్రాంతంగా; తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలను మధ్య కోస్తా ప్రాంతంగా; గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను దక్షిణ కోస్తా దక్షిణ కోస్తా ప్రాంతాలుగా; నాలుగు నైరుతి జిల్లాలు కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలను రాయలసీమగా వర్గకరించాలని సూచించింది.
ఈ నాలుగు ప్రాంతాల్లో కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని, ఆయా ప్రాంతాలు అంశాలన్నింటినీ పరిష్కరించాలని కమిటీ ప్రతిపాదించింది.
అమరావతిలోని తుళ్లూరు ప్రాంతంలో ముంపు ప్రమాదమున్న పలు చోట్ల నిర్మాణాలు నిలిపివేయాలని చెప్పింది. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు భూములను అభివృద్ధి చేసి అప్పగించాలని పేర్కొంది.
తాము రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొన్నామని కమిటీ సభ్యులు తెలిపారు. 30 వేల వినతులను స్వీకరించామని, రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో విస్తృతంగా పర్యటించామని, అవసరమైన చోట భూమిని తిరిగి రైతులకు ఇచ్చేయాలని సూచించామని చెప్పారు.
భౌగోళిక పరిస్థితులను దృష్టిలో మూడు రాజధానుల గురించి సూచనలు చేశామని వారు పేర్కొన్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
సెప్టెంబరు 13న ఏర్పాటైన ఈ కమిటీకి మాజీ ఐఏఎస్ అధికారి (1988 బ్యాచ్) జీఎన్ రావు కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. కేటీ రవీంద్రన్, విజయ్ మోహన్, ఆర్.అంజలీ మోహన్, మహావీర్, సుబ్బారావు, అరుణాచలం తదితరులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
శుక్రవారం అమరావతిలో ఈ కమిటీతో సీఎం గంటకు పైగా చర్చించారు. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.
కమిటీ గతంలో మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఇప్పుడు 200 పేజీలతో కూడిన తుది నివేదికను అందించింది.
నివేదికపై ఈ నెల 27న శుక్రవారం జరిగే మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

ఫొటో సోర్స్, goir.ap.gov.in
దక్షిణాఫ్రికా దేశం తరహాలో రాష్ట్రానికి మూడు రాజధానులు రావాల్సిన అవసరముందంటూ సీఎం ఈ నెల 17న అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిపుణుల కమిటీ నివేదికపై ఆసక్తి పెరిగింది.
"దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులుంటాయి. ఆ నమూనాలో బహుశా అమరావతిలో శాసన కార్యకలాపాల రాజధాని పెట్టొచ్చు. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని పెట్టొచ్చు. యంత్రాంగమంతా అక్కడి నుంచే పనిచేసేలా ఏర్పాట్లు చెయ్యవచ్చు. కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. ఈ విధంగా న్యాయ రాజధాని ఓవైపు, కార్యనిర్వాహక రాజధాని మరోవైపు, శాసన రాజధాని ఇక్కడ (అమరావతిలో) ఉండొచ్చు" అని సీఎం మంగళవారం వ్యాఖ్యానించారు.
ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
మూడు రాజధానులపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో రాజధానికి భూములిచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
రాజధాని తరలింపు వద్దని, ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఆర్డీఏను ఆదేశించాలని కోరుతూ రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కేసు విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వం, సీఆర్డీఏ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. జీఎన్ రావు కమిటీ చట్టబద్ధత, హైకోర్టు తరలింపుపై గతంలో పిటిషన్ దాఖలైంది.
విపక్ష టీడీపీ, బీజేపీ నాయకులు రైతులకు మద్దతుగా వారి ఆందోళనల్లో పాల్గొంటున్నారు. రాజధాని రైతులకు అండగా ఉంటామని జనసేన ప్రకటించింది.

ఫొటో సోర్స్, AMARAVATI.GOV.IN
సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు నిరసనకారుల యత్నం
మూడు రాజధానులపై సీఎం చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే ఆందోళనలు నిర్వహిస్తున్న అమరావతి రైతులు, శుక్రవారం జీఎన్ రావు కమిటీ వివరాలు వెలువడగానే అగ్గి మీద గుగ్గిలమయ్యారు. వెలగపూడిలోని సచివాలయం వద్ద నిరసనలకు దిగారు. సచివాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసిన కొందరిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులు రోడ్డుపై టైర్లు వేసి తగులబెట్టారు. బ్యారికేడ్లను దూరంగా విసిరేశారు. పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వెలగపూడితోపాటు మందడం వై జంక్షన్లోనూ ఆందోళనకారులు బైఠాయించారు. జీఎన్ రావు కమిటీ బూటకమంటూ నినాదాలు చేస్తున్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇస్తూ, అమరావతిని కొనసాగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

కేబినెట్ భేటీ అనంతరం నిర్ణయం: మంత్రి బొత్స
జీఎన్ రావు కమిటీ నివేదికపై ఈ నెల 27న కేబినెట్ భేటీలో చర్చించి, ప్రభుత్వ నిర్ణయం వెలువరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
అసెంబ్లీ, సీఎం క్యాంప్ ఆఫీస్, రాజ్ భవన్తోపాటు విద్యాకేంద్రంగా అమరావతి ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
అసైన్డ్ భూములను తీసుకోవడం చట్టవిరుద్ధం కాబట్టి, ఆ భూములను వెనక్కి ఇచ్చేస్తామని మాత్రమే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారని బొత్స చెప్పారు. రాజధాని ప్రాంత భూములు అభివృద్ధి చేసి వారి ఫ్లాట్లు వారికి అప్పగిస్తామన్నారు.

ఫొటో సోర్స్, UGC
ఈ నివేదికను ప్రజలు అంగీకరించరు: టీడీపీ
జీఎన్ రావు కమిటీ నివేదిక పూర్తిగా సీఎం జగన్ మాటలనే పునరుద్ఘాటించిందని టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.
"ఈ కమిటీ నుంచి అంతకుమించి ఆశించలేం .ప్రజాభిప్రాయానికి భిన్నంగా దీని నివేదిక ఉంది. రైతుల గోడును పరిగణనలోకి తీసుకోలేదు. ఇలాంటి నివేదికను ప్రజలు అంగీకరించరు. ఇప్పటికే హైకోర్టులో ఈ కమిటీని సవాలు చేశారు. విషయాన్ని కోర్ట్ తేలుస్తుంది" అని ఆయన బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
- అమెరికా అధ్యక్ష పదవి నుంచి డోనల్డ్ ట్రంప్కు అభిశంసన.. ప్రతినిధుల సభ ఆమోదం
- విద్యార్థుల ఆందోళనలు భారతీయుల నాడి గురించి ఏం చెబుతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్లో క్రిమినల్ కేసులున్న మంత్రులెందరు.. వారిలో అత్యంత సంపన్నులెవరు
- 'హైదరాబాద్ ఎన్కౌంటర్' బూటకం, పోలీసులపై చర్యలు తీసుకోవాలి.. సుప్రీం కోర్టులో నిందితుల కుటుంబ సభ్యుల పిటిషన్
- ర్యాలీలో పాల్గొనకుండా హెచ్సీయూ విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు
- నుదిటిపై గాటు సీరియల్ కిల్లర్ను పట్టిచ్చింది
- సనా గంగూలీ ‘The End of India’పై చర్చ.. ‘ఆ పోస్ట్ వాస్తవం కాదు’ - సౌరవ్ గంగూలీ
- ఆన్లైన్ మార్కెట్లలో కొనుగోలు చేసే క్రిస్టమస్ లైట్లతో 'ప్రమాదం'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









