ఆంధ్రప్రదేశ్: 'దిశ' బిల్లులకు శాసనసభ ఆమోదం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, FB/ANDHRAPRADESHCM

    • రచయిత, వి.శంకర్
    • హోదా, బీబీసీ కోసం

మహిళలు, బాలికలపై అత్యాచారం కేసుల్లో నేరస్థులకు మరణశిక్షతో పాటు, మహిళలపై క్రూరమైన దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా చేసే రెండు 'దిశ' బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఆమోదం తెలిపింది.

'ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్ లా (సవరణ) చట్టం-2019 ( ఏపీ 'దిశ' యాక్ట్‌), 'ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌- 2019' బిల్లులకు శాసనసభ ఆమోద ముద్ర వేసింది.

అత్యాచార కేసుల్లో కచ్చితమైన ఆధారాలుంటే 21 రోజుల్లోనే దోషులకు మరణ శిక్ష విధించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకొచ్చింది.

బాధితులకు తొందరగా న్యాయం చేసేందుకే ఈ చట్టాలను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మహిళలపై దారుణాలకు పాల్పడితే మరణ శిక్ష పడుతుందనే భయం రావాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని సీఎం అన్నారు. కఠిన శిక్షలు పడతాయనే భయం ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

దిశ యాక్ట్

ఫొటో సోర్స్, Getty Images

'దిశ' బిల్లులో ఏముంది?

ఈ చట్టాల ప్రకారం అత్యాచార కేసుల్లో నేరం జరిగినట్లు నిర్ధారించే కచ్చితమైన ఆధారాలు ఉంటే, దోషులకు 21 రోజుల్లోపే కోర్టులు మరణశిక్ష విధిస్తాయి.

వారం రోజుల్లో పోలీసుల దర్యాప్తు, ఆ తర్వాతి 14 రోజుల్లో ప్రత్యేక కోర్టు విచారణ ముగుస్తాయి. మొత్తంగా 21 రోజుల్లో తీర్పు వస్తుంది.

'దిశ యాక్ట్‌'తో పాటు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో అదనంగా 354(ఇ), 354 (ఎఫ్‌) సెక్షన్లను చేర్చే ముసాయిదా బిల్లులకు కూడా కేబినెట్‌ అనుమతి ఇచ్చింది.

చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడేవారికి పదేళ్ల నుంచి 14 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించాలని 354 (ఎఫ్‌)లో పేర్కొన్నారు. తీవ్ర నేరాలకు జీవిత ఖైదు వరకూ శిక్ష విధించాలని ఉంది.

ప్రస్తుతానికి ఇలాంటి నేరాలకు 'పోక్సో చట్టం' కింద మూడు నుంచి ఐదేళ్ల వరకూ శిక్ష విధిస్తున్నారు.

ఇక 354(ఇ) ప్రకారం మెయిల్, సోషల్‌మీడియా, డిజిటల్‌ మీడియాల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా పోస్ట్‌లు చేసేవారిపై కఠినమైన చర్యలు ఉంటాయి. మొదటిసారి తప్పు చేసినవారికి రెండేళ్లు, రెండో సారి తప్పుచేసినవారికి నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తారు.

దిశ యాక్ట్

ఫొటో సోర్స్, Getty Images

సత్వర న్యాయం దిశగా తొలి అడుగులు : చిరంజీవి

ఆంధ్రప్రదేశ్ 'దిశ' చట్టం-2019 పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్నారు.

‘‘మహిళా సోదరీమణులకు, లైంగిక వేధింపులకు గురవుతున్న చిన్నారులకు ఈ చట్టం భరోసా, భద్రత ఇస్తుందన్న ఆశ నాలో ఉంది. 'దిశ' సంఘటన మనందర్నీ కలిచివేసింది. ఆ భావోద్వేగాలు తక్షణ న్యాయాన్ని డిమాండ్ చేశాయి. తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత సత్ఫలితాలను ఇస్తుందన్న నమ్మకం అందరిలో ఉంది. అందుకోసం ఆంధ్రప్రదేశ్‌లో తొలి అడుగులు పడటం హర్షణీయం’’ అని ఓ ప్రకటనలో చెప్పారు.

‘‘4 నెలలు అంతకంటే ఎక్కువగా పట్టే విచారణా సమయాన్ని 21 రోజులకు కుదించడం, ప్రత్యేక కోర్టులు ఇతర మౌలిక సదుపాయాల్ని కల్పించడాన్ని ప్రశంసిస్తున్నా. నేరాలోచన ఉన్న వాళ్లలో భయం కల్పించే విధంగా చట్టాలు తేవడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ చర్యలతో మహిళా లోకం నిర్భయంగా, స్వేచ్ఛగా ఉండగలుగుతుందన్న నమ్మకం నాకు ఉంది" అని చిరంజీవి అన్నారు.

ముప్పాళ్ల సుబ్బారావు

ఫొటో సోర్స్, muppallasubbarao/facebook

ఫొటో క్యాప్షన్, ముప్పాళ్ల సుబ్బారావు

‘స‌మ‌స్య మూలాల్లోకి వెళ్లడం లేదు’

మ‌హిళ‌ల‌పై హింస అరిక‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోకుండా, భావోద్వేగాల ఆధారంగా చ‌ట్టాలు రూపొందించ‌డం శ్రేయ‌స్క‌రం కాద‌ని ఏపీ బార్ కౌన్సిల్ స‌భ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు వ్యాఖ్యానించారు.

స‌త్వ‌ర న్యాయం అందించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌పై ఇప్ప‌టికే అనేక క‌మిష‌న్‌ల, పార్ల‌మెంట్ క‌మిటీల సిఫార్సులు ఉన్నాయని ఆయన బీబీసీతో అన్నారు.

‘‘ప్ర‌తి 10ల‌క్ష‌ల మందికి 50 మందికి త‌గ్గ‌కుండా న్యాయ‌మూర్తులు అవ‌స‌రం అని జాతీయ లా క‌మిష‌న్ చెప్పింది. కానీ ప్ర‌స్తుతం 13 మంది ఉన్నారు. వాటిలోనూ అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏపీ హైకోర్టులో 24 మంది న్యాయ‌మూర్తులు ఉండాలి. 13 మంది మాత్ర‌మే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 21 రోజుల్లో తీర్పులు వెలువ‌రించ‌డం ఎలా సాధ్య‌ం?’’ అని సుబ్బారావు సందేహం వ్యక్తం చేశారు.

‘‘అత్యాచారం జ‌రిగితే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక వచ్చేందుకే చాలా సమయం ప‌డుతుంది. అలాంటిది ఏడు రోజుల్లో ఛార్జీషీట్ వేయాల‌ని బిల్లులో పేర్కొన్నారు. ఇది ఎలా సాధ్య‌ం. పునఃప‌రిశీల‌న చేయ‌డం మంచిది" అని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు.

అత్యాచారాలు
ఫొటో క్యాప్షన్, జాతీయ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం దేశంలో అత్యాచార ఘటనలు ఏటా పెరుగుతున్నాయి.

‘అనుగుణంగా చ‌ర్య‌లు లేవు’

నేరాల నియంత్రణకు, వాటికి తగ్గ‌ట్టుగా శిక్ష‌లు విధించ‌డం అవ‌స‌ర‌మేనని.. కానీ, అందుకు అనుగుణంగా యంత్రాంగం గురించి ప్ర‌స్తావ‌న క‌నిపించ‌డం లేద‌ని అఖిల భార‌త ప్ర‌జాతంత్ర మ‌హిళా సంఘం (ఐద్వా) జాతీయ కార్య‌ద‌ర్శి డి.ర‌మాదేవి వ్యాఖ్యానించారు.

‘‘రాష్ట్రంలో 100కి ఫోన్ చేస్తే స్పందించేందుకు తగినంత సిబ్బంది లేరు. మొదట అలాంటి వాటిపై దృష్టి పెట్టాలి. న్యాయ‌మూర్తుల ఖాళీల విష‌యం చెప్ప‌న‌వ‌స‌రం లేదు. దానికి త‌గ్గ‌ట్టుగా బ‌డ్జెట్ కేటాయించాలి. మ‌హిళ‌ల కిడ్నాప్‌ల్లో ఏపీ దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. వాటిని ఈ చ‌ట్టాల్లో ప్ర‌స్తావించ‌లేదు’’ అని ఆమె అన్నారు.

‘‘ప‌రువు హ‌త్య‌ల పేరుతో సాగుతున్న అరాచ‌కాల‌ను అరిక‌ట్టే చ‌ర్య‌లు ఈ బిల్లుల్లో లేవు. ప్ర‌భుత్వం వాటిని ఎందుకు విస్మ‌రించింది. మ‌హిళ‌లపై నేరాలు జ‌ర‌గ‌కుండా నిరోధించే చర్యలను ఈ కూడా ఈ బిల్లుల్లో పేర్కొనలేదు’’ అని రమాదేవి అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)