తెలంగాణ ఆర్టీసీ సమ్మె: మహిళా కండక్టర్‌పై తాత్కాలిక డ్రైవర్ అత్యాచారయత్నం

ఆర్టీసీ బస్సులు

తెలంగాణలో ఆర్టీసీ అద్దె బస్సు తాత్కాలిక డ్రైవర్ ఒకరు కండక్టరుగా తాత్కాలిక విధుల్లో ఉన్న యువతిపై బస్సులోనే అత్యాచారానికి యత్నించాడు.

మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి డ్రైవర్ బస్సులో ప్రయాణికులను ఎక్కించుకోకుండా ఒంటరిగా ఉన్న తనపై అత్యాచారానికి యత్నించాడని మహిళా కండక్టరు ఆరోపించారు.

చెన్నూరు నుంచి గురువారం రాత్రి 7.30 గంటలకు మంచిర్యాల వస్తుండగా అటవీ ప్రాంతంలో బస్సు ఆపి డ్రైవర్ శ్రీనివాస్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ఆమె ఆరోపించారు.

కండక్టర్ పెద్దగా అరవడం, దగ్గర్లో ఉన్న వాళ్లు బస్సు వద్దకు వచ్చే ప్రయత్నం చేయడంతో బస్సును డ్రైవర్ ముందుకు తీసుకెళ్లాడని స్థానికులు చెప్పారు.

విషయం తెలిసిన పోలీసులు జైపూర్‌లో బస్సును ఆపి కండక్టర్‌ను రక్షించారు. శ్రీనివాస్‌ మహిళా కండక్టరుతో అసభ్యంగా ప్రవర్తించినట్టు కేసు నమోదు చేశారు పోలీసులు. మహిళా కండక్టర్‌ను ఆమె సొంత ఊరికి పంపించారు.

ఈ విషయం బైటికి పొక్కకుండా రవాణా శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికి విషయం దాగలేదు.

నిందితుడు శ్రీనివాస్
ఫొటో క్యాప్షన్, నిందితుడు శ్రీనివాస్

‘డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం’

ఈ ఘటనపై పోలీసులను సంప్రదించగా, జైపూర్ ఎస్సై విజేందర్ బీబీసీతో మాట్లాడుతూ, ఫిర్యాదు అందిందని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

"అక్టోబర్ 17న రాత్రి 8:30కి మాకు ఫోన్ వచ్చింది. చెన్నూర్ నుంచి మంచిర్యాల మార్గంలో ఆర్టీసీ బస్సులో తాత్కాలిక కండక్టరుగా విధులు నిర్వర్తిస్తున్న తనపై తాత్కాలిక డ్రైవర్ అత్యాచారానికి ప్రయత్నించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. గౌడ్ కాలేజీ దగ్గరకు వచ్చాక లైట్లు పని చెయ్యట్లేదు అంటూ బస్సు ఆపి మహిళా కండక్టరుపై అత్యాచారం చేసేందుకు యత్నం చేశాడని బాధితురాలు తెలిపారు. బాధితురాలికి 21 ఏళ్లు ఉంటాయి. ఆమె విద్యార్థిని. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆ అమ్మాయి ఉపాధి కోసం ప్రైవేట్ కండక్టరుగా పని చేస్తోంది. డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నాం" అని ఎస్సై తెలిపారు.

ఎఫ్ఐఆర్

‘ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి’

ఈ ఘటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని ఆర్టీసీ యూనియన్ జేఏసీ కో కన్వీనర్ రాజి రెడ్డి అన్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, "శిక్షణ లేని వారిని తీసుకొచ్చి పనుల్లో పెడుతున్నారు. ప్రజల భద్రత గురించి ఆలోచన లేకుండా చేస్తున్నారు. ఇవే కాకుండా అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయి. వీటన్నింటికీ ముఖ్యమంత్రి కెసిఆర్ బాధ్యత వహించాలి. ఇలా ఇబ్బందులకు గురిచేయడంపై సీఎం ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?" అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)