ఇండియాVsదక్షిణాఫ్రికా: రోహిత్ శర్మ సెంచరీ, దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో భారత్ విజయం

రోహిత్

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో టీమిండియా దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మొత్తం 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారత్ 230 పరుగులు చేసింది.

మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతూ జట్టును విజయానికి చేరువ చేస్తే, చివర్లో హార్దిక్ పాండ్య లాంచనం పూర్తి చేశాడు.

భారత్ బ్యాటింగ్...

228 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 6 ఓవర్ తొలి బంతికి శిఖర్ ధవన్ వికెట్ కోల్పోయింది.

8 పరుగులు చేసిన ఓపెనర్ ధావన్ రబడ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చాడు.

క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మ ఆచితూచి ఆడడంతో 10 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది.

15వ ఓవర్లో భారత్ 50 పరుగులు మార్కు చేరుకుంది.

తర్వాత మరో 4 పరుగులకు భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది. . ఫెహ్లుక్వాయో బౌలింగ్‌లో కోహ్లీ కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చాడు.

కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

20 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్‌తో కలిసి నిదానంగా స్కోరు బోర్టును ముందుకు నడిపించిన రోహిత్ శర్మ 76 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

రోహిత్, కేఎల్ రాహుల్ స్లో అండ్ స్టడీ బ్యాటింగ్‌తో టీమిండియా 26వ ఓవర్లో వంద పరుగుల మైలురాయిని చేరుకుంది.

139 పరుగులు దగ్గర మూడో వికెట్ పడింది. కేఎల్ రాహుల్(26) రబాడ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చాడు.

తర్వాత రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ మెల్లమెల్లగా స్కోరును ముందుకుతీసుకెళ్లారు.

41వ ఓవర్లో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. వన్డేల్లో 23వ సెంచరీ నమోదు చేశాడు.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

45వ ఓవర్లో భారత్ స్కోరు 200 పరుగులు దాటింది.

47వ ఓవర్లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన ధోనీ(34) అతడికే క్యాచ్ ఇచ్చాడు.

తర్వాత రోహిత్ శర్మతో కలిసిన హార్దిక్ పాండ్య కలిసి లాంచనం పూర్తి చేశాడు. చివర్లో ఫోర్ కొట్టి విజయం అందించాడు.

హార్దిక్ పాండ్య 15 పరుగులతో, వన్డేల్లో 23వ సెంచరీ చేసిన రోహిత్ శర్మ 144 బంతుల్లో 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడకు రెండు వికెట్లు, క్రిస్ మోరిస్, ఫెహ్లుక్వాయో చెరో వికెట్ తీశారు.

కట్టడి చేసిన బౌలర్లు...

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 24 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.

ఈ రెండు వికెట్లూ జస్‌ప్రీత్ బుమ్రా ఖాతాలో పడ్డాయి.

బుమ్రా, చాహల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బుమ్రా, చాహల్

బుమ్రా వేసిన 4వ ఓవర్లో హషీమ్ ఆమ్లా(6) స్లిప్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇవ్వగా, ఏడో ఓవర్‌లో క్వింటన్ డికాక్(10) విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు.

తర్వాత దక్షిణాఫ్రికా స్కోరును డుప్లెసిస్, వాన్‌డెర్ ముందుకు నడిపించారు. 50 పరుగుల భాగస్వామ్యం అందించారు.

20వ ఓవర్లో భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఈ ఇద్దరినీ పెలివియన్ పంపించాడు.

జట్టు స్కోరు 78 పరుగులు ఉన్నప్పుడు 20వ ఓవర్ వేసిన చాహల్ మొదటి బంతికి వాన్‌డెర్‌(22)ను, చివరి బంతికి డుప్లెసిస్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

భారత్

ఫొటో సోర్స్, Getty Images

22వ ఓవర్లో కులదీప్ యాదవ్ బౌలింగ్‌లో జేపీ డుమిని(3) ఎల్‌బిడబ్ల్యు కావడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది.

తర్వాత డేవిడ్ మిల్లర్, ఆండిలీ పెహ్లుక్వాయో ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును పెంచాలని ప్రయత్నించారు.

25 ఓవర్లకు వంద పరుగుల మార్కుకు చేరుకుంది. కానీ ఈ ఇద్దరినీ కూడా చాహల్ పెవిలియన్ చేర్చాడు.

36వ ఓవర్లో డేవిడ్ మిల్లర్(31) వికెట్ తీసిన చాహల్, 40వ ఓవర్లో ఆండిలీని అవుట్ చేశాడు.

159 పరుగుల దగ్గర ఏడో వికెట్ పడింది. చాహల్ బౌలింగ్‌లో ముందుకొచ్చిన ఆండిలే ఫెహ్లుక్వాయోను ధోనీ స్టంపింగ్ చేశాడు

చాహల్

ఫొటో సోర్స్, Getty Images

చాహల్‌కు నాలుగు వికెట్లు

ఇది ఈ మ్యాచ్‌లో చాహల్‌కు నాలుగో వికెట్.

40 ఓవర్లు పూర్తయ్యే సరికి సౌతాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

46 ఓవర్లో దక్షిణాఫ్రికా 200 పరుగుల మార్కుకు చేరింది.

భువనేశ్వర్ కుమార్ ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా మరో రెండు వికెట్లు కోల్పోయింది.

50వ ఓవర్ రెండో బంతికి క్రిస్ మోరిస్(42) విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇవ్వగా, అదే ఓవర్ చివరి బంతికి ఇమ్రాన్ తాహిర్(0) కేదార్ జాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు.

దీంతో నిర్ణీత 50 ఓవర్లకు దక్షిణాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత బౌలర్లలో యజువేంద్ర చాహల్ 4 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా చెరి రెండు వికెట్లు, కులదీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.

భువీ

ఫొటో సోర్స్, Getty Images

భారత యాత్ర మొదలు

క్రికెట్ ప్రపంచకప్ ప్రారంభమై వారం రోజులవుతున్న భారతీయ అభిమానుల్లో ఇంకా జోష్ కనిపించడం లేదు. అందుకు కారణం.. టీమిండియా ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడమే.

ఈ రోజు భారతీయ అభిమానుల్లో ఆ జోష్ మొదలైంది. టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడుతుండడంతో భారత అభిమానులు ఉరకలేస్తున్నారు.

భారత్ ఈరోజు బోణీ చేయాలని, అదే దూకుడు టోర్నీ మొత్తం కొనసాగిస్తూ కప్‌ను ఇండియాకు తేవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారు.

ఇరవై రోజుల కిందట వరకు ఐపీఎల్ మ్యాచ్‌లతో బిజీబిజీగా గడిపిన టీమిండియా ఆటగాళ్లకు తక్కువ సమయమే దొరికినప్పటికీ ప్రతిష్ఠాత్మక టోర్నీలో జోరు చూపడానికి రీచార్జయ్యారు.

తుది జట్టులో ఎవరెవరుంటారనేది పక్కన పెడితే రోహిత్ శర్మ, ధావన్, కేఎల్ రాహుల్, కోహ్లీ, ధోనీ, హార్దిక్ పాండ్యా, బుమ్రా, షమీ, భువనేశ్వర్, కులదీప్ జాదవ్, రవీంద్ర జడేజా, చాహల్‌లపై క్రికెట్ ప్రేమికులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

డికాక్‌, డుప్లెసిస్‌, వాండర్‌‌డసెన్‌, రబడా, ఆమ్లా వంటి ఆటగాళ్లతో దక్షిణాఫ్రికా జట్టు కూడా బలంగా ఉంది.

టీమిండియా ఆటగాళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుత ప్రపంచ కప్ ఆడుతున్న జట్లు

* భారత్

* ఇంగ్లండ్

* ఆస్ట్రేలియా

* దక్షిణాఫ్రికా

* పాకిస్తాన్

* శ్రీలంక

* న్యూజిలాండ్

* బంగ్లాదేశ్

* అఫ్ఘానిస్తాన్

* వెస్టిండీస్

భారత్ మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడున్నాయ్?

జూన్ 5: దక్షిణాఫ్రికాతో

జూన్ 9: ఆస్ట్రేలియాతో

జూన్ 13: న్యూజిలాండ్‌తో

జూన్ 16: పాకిస్తాన్‌తో

జూన్ 22: అఫ్గానిస్థాన్‌తో

జూన్ 27: వెస్టిండీస్‌తో

జూన్ 30: ఇంగ్లండ్‌తో

జులై 2: బంగ్లాదేశ్‌తో

జులై 6: శ్రీలంకతో

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)