విజయ్ మాల్యా: భారత్ ఇప్పటి వరకు ఎంత మంది దోషులను దేశానికి తీసుకొచ్చింది?

విజయ్ మాల్యా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విజయ్ మాల్యా

ఆర్థిక నేరాలకు పాల్పడిన కేసులో విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించడానికి ఇంగ్లండ్ హోం మినిస్టర్ సాజిద్ జావిద్ ఫిబ్రవరి 4న ఆమోదం తెలిపారు. ఇలా.. నేరారోపణలు ఎదుర్కొంటూ విదేశాల్లో స్థిరపడిన దోషులను భారత్ రప్పించడం ఇదే మొదటిసారా?

బీబీసీ కమ్యూనిటీ అఫైర్స్ స్పెషలిస్ట్ సాజిద్ ఇక్బాల్ కథనం..

నేరారోపణల కేసు విచారణ కోసం విజయ్ మాల్యాను భారత్‌కు పంపాలని లండన్ ప్రధాన న్యాయమూర్తి ఎమ్మా ఆర్బథ్నాట్ ఆదేశించారు. ఈ ఆదేశాలు వెలువడిన 2నెలలకు ఇంగ్లండ్ హోంశాఖ మంత్రి ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీలు చేసుకోవడానికి విజయ్ మాల్యాకు 14రోజుల సమయం ఉంది. ఇంగ్లండ్ హోం శాఖ నిర్ణయం వెలువడిన తర్వాత విజయ్ మాల్యా ట్విటర్‌లో స్పందించాడు. అందులో..

''వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు డిసెంబర్ 10, 2018న వెలువడ్డాయి. నేను అప్పీలు చేసుకుంటానని చెప్పాను. కానీ హోం శాఖ తన నిర్ణయాన్ని ప్రకటించేవరకు అప్పీలు ప్రక్రియను మొదలుపెట్టలేను. ఇప్పుడు హోంశాఖ కూడా స్పందించింది. ఇక నేను అప్పీలు ప్రక్రియను ప్రారంభిస్తాను'' అని మాల్యా ట్వీట్ పేర్కొంది.

కింగ్‌ఫిషర్ సంస్థల అధినేత విజయ్ మాల్యా.. వేల కోట్ల రూపాయలకుపైగా అప్పులు ఎగవేసి, డీఫాల్టర్‌గా 2016 మార్చిలో దేశం వదిలి వెళ్లారు.

కానీ దేశం వదిలి పారిపోయారన్న వాదనతో ఆయన ఏకీభవించడంలేదు. తాను అప్పులు తీరుస్తానని, అయితే అందుకోసం భారత ప్రభుత్వం.. తన షరతుల్లేని ఆఫర్‌ను అంగీకరించాలని గతేడాది జూలైలో భారత ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన అన్నారు.

విజయ్ మాల్యా

ఫొటో సోర్స్, AFP

ఇక్బాల్ మీనన్

నేరస్థుల అప్పగింతలో భాగంగా దోషులను తమకు అప్పగించాలంటూ భారత్ కోరిన వ్యక్తుల్లో విజయ్ మాల్యా మొదటివాడు కాదు. ఇలాంటి కేసులను ఎదుర్కొన్న పెద్దల జాబితాలో మరికొందరు భారతీయులు ఉన్నారు.

భారత్-యూకే దేశాలు 1992లో నేరస్థుల అప్పగింత ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం 1993 నుంచి అమల్లోకి వచ్చింది. ఒప్పందం తర్వాత ఇంగ్లండ్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించిన మొదటి వ్యక్తి ఇక్బాల్ మీనన్.

ఇతన్ని ఇక్బాల్ మిర్చి అని కూడా పిలుస్తారు. భారత్‌కు అప్పగించాక, ఆ కేసును కొట్టివేశారు. ఇక్బాల్ మీనన్ కోర్టు ఖర్చులను భారత ప్రభుత్వమే చెల్లించాల్సి వచ్చింది.

1993 పేలుళ్లకు సంబంధం ఉందంటూ ఇక్బాల్‌పై అభియోగాలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై, స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు 1995లో ఇక్బాల్ నివాసంపై దాడులు చేసి డ్రగ్స్, టెర్రరిజం కేసుల్లో అరెస్టు చేశారు.

ఈ కేసు కోర్టుకు వచ్చే సమయానికి, డ్రగ్స్, టెర్రరిజం అభియోగానికి బదులు, లండన్‌లోని తన రైస్ మిల్‌కు మేనేజర్‌గా పని చేసిన వ్యక్తిని హత్య చేశాడంటూ మరో అభియోగం తెరపైకి వచ్చింది.

ఇక్బాల్ వద్ద ఉద్యోగం మానేసిన కొంత కాలానికే, ముంబైలో ఆ మేనేజర్ హత్యకు గురయ్యాడు.

కానీ ఇక్బాల్ వ్యవహారంలో దోషుల అప్పగింత ముందుకు సాగలేదు. ఇక్బాల్‌ను తమకు అప్పగించాలని భారత్ కోరినపుడు, బోవ్ స్ట్రీట్ కోర్టు న్యాయమూర్తులు.. 'మేం స్పందించడానికి భారత్ ప్రస్తావించిన కేసు ఏదీ లేదు..' అని వ్యాఖ్యానించారు.

ఇక్బాల్ అప్పగింత కోసం భారత్ మళ్లీ అప్పీల్ చేయలేదు. ఇక్బాల్ కోర్టు ఖర్చులను కూడా భారత ప్రభుత్వమే చెల్లించింది.

విజయ్ మాల్యా

ఫొటో సోర్స్, AFP

ఉమర్జీ పటేల్

దోషుల అప్పగింత వ్యవహారంలో ఇంగ్లండ్ కోర్టులో వినిపించిన మరో ప్రముఖుడి పేరు ఉమర్జీ పటేల్. ఈయన్ను హనీఫ్ టైగర్ అని కూడా పిలుస్తారు.

1993 జనవరిలో సూరత్ నగరంలోని ఓ రద్దీ మర్కెట్లో గ్రెనేడ్ పేలింది. ఈ ఘటనలో ఒక స్కూల్ విద్యార్థిని చనిపోయింది. ఈ కేసుకు సంబంధించి హనీఫ్‌ను తమకు అప్పగించాలని భారత్ ఇంగ్లండ్‌ను కోరింది.

1993 ఏప్రిల్‌లో రద్దీగా ఉన్న రైల్వేస్టేషన్ పరిసరాల్లో మరో గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో 12మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు వ్యూహరచన చేశాడన్న ఆరోపణలు కూడా హనీఫ్‌పై ఉన్నాయి.

దోషుల అప్పగింత వ్యవహారం నుంచి తనను తప్పించాలంటూ 2013లో బ్రిటీష్ హోంశాఖ మంత్రికి హనీఫ్ చేసిన విజ్ఞాపన ఇంకా పరిశీలనలో ఉన్నట్లు.. 2017లో మీడియాలో వార్తలు వచ్చాయి.

కానీ హోంశాఖ అధికారిక ప్రతినిధి బీబీసీతో మాట్లాడుతూ, ఈ అంశంలో ఎలాంటి పురోగతి లేదని అన్నారు.

విజయ్ మాల్యా

ఫొటో సోర్స్, Getty Images

సమీర్‌భాయ్ వినుభాయ్ పటేల్

భారత్-ఇంగ్లండ్‌ దేశాల మధ్య జరిగిన దోషుల అప్పగింత ఒప్పందంలో భాగంగా ఇంగ్లండ్ నుంచి భారత్ రప్పించగలిగిన ఏకైక వ్యక్తి సమీర్‌భాయ్ వినుభాయ్ పటేల్.

సమీర్‌భాయ్ వినుభాయ్ పటేల్‌పై 2002 గుజరాత్ అల్లర్ల ఆరోపణలు ఉన్నాయి. నేరస్థుల అప్పగింత ఒప్పందం ప్రకారం తనను భారత్‌కు అప్పగించడాన్ని సమీర్‌భాయ్ వ్యతిరేకించలేదు. పైగా నేరాన్ని అంగీకరించాడు.

దీంతో అప్పగింత ప్రక్రియ వేగవంతమైంది. 2016 ఆగస్టు 9న వినుభాయ్‌ను అరెస్టు చేశారు. సెప్టెంబర్ 22న ఇంగ్లండ్ హోంశాఖ, వినుభాయ్‌ను భారత్‌కు అప్పగించే ఫైలుపై సంతకం చేసింది.

2016 అక్టోబర్ 18న వినుభాయ్‌ను భారత్‌కు అప్పగించారు. కానీ తనపై ఉన్న అభియోగాల్లో వినుభాయ్ దోషిగా తేలాడా లేదా అన్న విషయంపై సమాచారం లేదు.

1992 నేరస్థుల అప్పగింత ఒప్పందంలో భాగంగా ఇంతవరకూ భారత్ కేవలం ముగ్గుర్ని మాత్రమే ఇంగ్లండ్‌కు అప్పగించింది.

మనీందర్‌పాల్ సింగ్ కొహ్లీ (భారత పౌరుడు):

అభియోగం: హ్యాన్నా ఫోస్టర్ అనే వ్యక్తిని హత్య చేసినందుకు 2007, జూలై 29న భారత ప్రభుత్వం ఇంగ్లండ్‌కు అప్పగించింది.

సోమాయ కేతన్ సురేంద్ర (కెన్యా పౌరుడు):

అభియోగం: చీటింగ్ కేసు మీద, 2009, జూలై 8న భారత ప్రభుత్వం ఇంగ్లండ్‌కు అప్పగించింది.

కుల్విందర్ సింగ్ ఉప్పల్ (భారత పౌరుడు):

అభియోగం: కిడ్నాప్, అక్రమ నిర్బంధం కేసుల్లో నవంబర్ 24, 2013లో భారత ప్రభుత్వం ఇంగ్లండ్‌కు అప్పగించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)