అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్, ఆరాధ్యలకు కోవిడ్-19 నిర్ధరణ

ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్‌, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది.

అమితాబ్ తనకు కోవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయిన విషయాన్ని స్వయంగా ట్వీట్ చేశారు. "నాకు కోవిడ్ పరీక్షలో పాజిటివ్ అని తేలింది. హాస్పిటల్లో చేరాను హాస్పిటల్ సిబ్బంది, నా కుటుంబ సభ్యులు, నా వద్ద పని చేసే వారికి కూడా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావలసి ఉంది" అని అమితాబ్ ట్వీట్ చేశారు.

ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా తనకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధరణ అయిందని ట్విటర్ ద్వారా తెలిపారు.

అమితాబ్, 44 ఏళ్ల అభిషేక్ ఇద్దరూ ప్రస్తుతం ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే.. అభిషేక్‌తో పాటు ఆయన భార్య, ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్‌, వారి కుమార్తె ఆరాధ్యలకు కూడా కోవిడ్ సోకినట్లు నిర్ధరణ అయిందని మహారాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రాజేష్ తోపే ట్వీట్ చేశారు. కాసేపటికి ఆ ట్వీట్‌ను తొలగించారు.

అమితాబ్ భార్య జయా బచ్చన్‌కు కూడా పరీక్ష చేయగా.. నెగెటివ్ వచ్చిందని ఆయన తొలగించిన ట్వీట్‌లో చెప్పారు.

అయిదు దశాబ్దాల నట జీవితంలో దాదాపు 200 చిత్రాలలో నటించిన అమితాబ్ వయసు 77 ఏళ్ళు. అభిషేక్ కూడా తండ్రి బాటలోనే సినీ నటుడిగా కొనసాగుతున్నారు.

తనకు, తన తండ్రికి కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని అభిషేక్ తెలిపారు. అభిషేక్ ఆరోగ్యం స్థిరంగా ఉందని హాస్పిటల్ వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు తెలిపాయి.

గత 10 రోజుల్లో తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ దయచేసి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అమితాబ్ కోరారు.

ఈ వార్త వెల్లడి కాగానే సోషల్ మీడియాలో అన్ని రంగాల ప్రముఖుల నుంచి స్పందనలు వెల్లువెత్తాయి. తండ్రీ కొడుకులు త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, వివిధ రంగాల ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు.

జంజీర్, షోలే వంటి సూపర్ హిట్ చిత్రాలతో అగ్రశ్రేణి నటుడిగా ఎదిగిన అమితాబ్ బచ్చన్ 1970ల నుంచి ఎన్నో అవ అవార్డులు అందుకున్నారు. ముఖ్యంగా, నాలుగు జాతీయ అవార్డులు, 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఆయన సొంతం చేసుకున్నారు.

సినిమా రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఫ్రాన్స్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన 'లీజియన్ ఆఫ్ హానర్'తో అమితాబ్‌ను సత్కరించింది.

ఆయన కొంతకాలం రాజకీయాల్లో కూడా కొనసాగారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో ఆయన 1984లో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే, ఆయన మూడేళ్లకే తన పదవికి రాజీనామా చేశారు.

వ్యాపారవేత్తగా బచ్చన్ 1995లో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ స్థాపించారు. సినిమాలు, వినోద కార్యక్రమాల నిర్వహణను చేపట్టిన ఈ వ్యాపార సంస్థ పూర్తిగా విఫలమైంది. ఆ తరువాత అమితాబ్ 'కౌన్ బనేగా క్రోర్‌పతి' కార్యక్రమంతో టీవీ హోస్ట్‌గా మారారు. బ్రిటన్ గేమ్ షో 'హూ వాంట్స్ టు బి ఎ మిలియనేర్' ఆధారంగా రూపొందిన ఈ కార్యక్రమం అమితాబ్ జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది.

టీవీ హోస్ట్‌గా ఉంటూనే మళ్లీ సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చిన అమితాబ్ తాజా చిత్రం గులాబో సితాబో. ఇది ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)