కరోనావైరస్ ప్రభావం పిల్లలపై అంతంత మాత్రమే - తాజా సర్వేలో వెల్లడి

కోవిడ్‌ -19 వల్ల పిల్లల్లో మరణాలు అత్యంత అరుదుగా ఉంటాయని యూరప్‌లో నిర్వహించిన ఓ సర్వే తేల్చింది. 582మంది పిల్లలను పరిశీలించగా అందులో ఇద్దరు మాత్రమే మరణించారని, మరో ఇద్దరు తీవ్రమైన ఆరోగ్యసమస్యలు ఎదుర్కొన్నారని ఆ పరిశోధన వెల్లడించింది.

పిల్లల్లో వైరస్ లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయని, కొందరు పాజిటివ్‌ చిన్నారుల్లో అసలు లక్షణాలే కనిపించని సందర్భాలున్నాయని, 10మందిలో ఒకరికి ఇంటెన్సివ్‌ కేర్‌ అవసరమౌతుందని ఈ పరిశోధన వెల్లడించింది.

అయితే ఈ రీసెర్చ్‌ ను పూర్తిగా విశ్వసించలేమన్న వైద్య నిపుణులు, పిల్లల్లో ఈ వైరస్‌ చికిత్సకు మెరుగైన పద్దతులను కనుక్కోవాల్సి ఉందంటున్నారు.

ఈ పరిశోధనలో ఇంకా ఏముంది?

25 యూరోపియన్‌ దేశాల్లో 3 రోజుల నుంచి 18 సంవత్సరాల వయసున్న 582 మంది చిన్నారులను లండన్‌లోని గ్రేట్‌ ఆర్మండ్‌ స్ట్రీట్ హాస్పిటల్‌కు చెందిన వైద్యబృందం పరిశీలించింది.

ఏప్రిల్‌ నెలలో కోవిడ్‌-19 ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లో వీరందరూ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలారు. వీరిలో నాలుగింట మూడువంతులమందికి కనిపించని ఆరోగ్య సమస్యలున్నాయి. సగంమందిని ఆసుపత్రిలో చేర్చాల్సి రాగా వారిలో 8శాతం మందికి ఇంటెన్సివ్‌ కేర్‌ చికిత్స అవసరమైంది.

పిల్లల్లో కనిపించిన లక్షణాలేంటి?

పరిశోధకులు గమనించిన చిన్నారుల్లో 65శాతంమంది జ్వరంతో బాధపడ్డారు.

54శాతం మంది శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. వారిలో 25శాతంమందికి న్యుమోనియా ఉన్నట్లు తేలింది.

వీరిలో ఎక్కువమంది క్లోజ్‌ కాంటాక్ట్‌ వల్ల వైరస్‌ గురైనా, మెజారిటీ పిల్లల్లో అసలు వైరస్‌ లక్షణాలే కనిపించలేదు.

పరిశోధన ఏం తేల్చింది?

కరోనావైరస్‌ సోకిన చిన్నారుల్లో మరణాల రేటు చాలా తక్కువ ఉండొచ్చని వెల్లడించింది. అప్పటికే స్వల్ప లక్షణాలతో ఉన్న చిన్నారులకు టెస్టులు నిర్వహించలేదని పరిశోధన చేసిన టీమ్‌ తెలిపింది.

ఈ డేటా చిన్నారులకు ఎలాంటి చికిత్స చేయాలో అర్ధం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని పరిశోధక బృందం అభిప్రాయపడింది.

మొత్తంగా చూస్తే వైరస్‌ సోకిన చిన్నారుల్లో ఎక్కువమందికి చాలా తక్కువ లక్షణాలు కనిపించాయని ఈ టీమ్‌కు నాయకత్వం వహించిన ఆర్మండ్‌ స్ట్రీట్‌ ఇనిస్టిట్యూట్‌ డాక్టర్‌ మార్క్‌ టెబ్రుగీ అన్నారు.

''చాలా కొద్దిమంది చిన్నారులకు మాత్రమే ఇంటెన్సివ్‌ కేర్‌లో చికిత్స అవసరమైంది. మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతుందన్నందున ఈ డేటా ఆధారంగా చికిత్స ప్రణాళికల్లో ప్రాధామ్యాలు నిర్ధరించుకోవడం మంచిది'' అని డాక్టర్‌ టెబ్రుగీ సూచించారు.

కోవిడ్‌-19తోపాటు ఇతర జబ్బులతో శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొన్న చిన్నారులలో చాలా తక్కువమందికి ఇంటెన్సివ్‌ కేర్‌ చికిత్స అవసరమైంది.

''రాబోయే శీతాకాలంలో ఇన్ఫెక్షన్లు, జ్వరాలు ఎటూ దాడి చేస్తాయి కాబట్టి, దీని పరిణామాలు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది'' అని స్పెయిన్‌లోని గ్రెగోరియో మారనాన్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్‌ బెగోనా శాంటియాగో గార్సియా అభిప్రాయపడ్డారు.

ఈ పరిశోధనా పత్రం ''ది లాన్సెట్ చైల్‌ అండ్‌ అడాలసెంట్‌ హెల్త్‌ జర్నల్‌''లో ప్రచురితమైంది.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)