లోక్‌సభ ఎన్నికల ఫలితాలు: అమేఠీలో ఓడిపోయిన స్మృతి ఇరానీ

కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ అమేఠీలో ఓడిపోయారు.

సారాంశం

  • లోక్‌సభ ఎన్నికల ఫలితాలు: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
  • మొత్తం 542 పార్లమెంటు స్థానాలకు ఏడు దశలలో ఎన్నికలు జరిగాయి
  • ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో బీజేపీ 126 స్థానాల్లో గెలుపు, 114 స్థానాల్లో ఆధిక్యం
  • కాంగ్రెస్ పార్టీ 54 స్థానాలను గెలుచుకుని, 45 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నట్లు ఈసీ తన వెబ్‌సైట్‌లో వెల్లడి
  • సమాజ్‌వాదీ పార్టీ 18 స్థానాలను గెలుచుకుని, 19 స్థానాలలో ముందంజ

లైవ్ కవరేజీ

  1. నరేంద్ర మోదీ: ‘విపక్షాలన్నీ ఏకమైనా, బీజేపీ సొంతంగా సాధించినన్ని సీట్లను గెలుచుకోలేకపోయాయి’

    ప్రధాని మోదీ

    ఫొటో సోర్స్, ANI

    విపక్షాలన్నీ ఏకమైనా, బీజేపీ సొంతంగా సాధించినన్ని సీట్లను గెలుచుకోలేకపోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీ మాట్లాడారు.

    బీజేపీ కార్యకర్తలకు, నేతలకు, అభ్యర్థులందరికీ ధన్యవాదాలు చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత, రెండు పర్యాయాలు పూర్తి చేసుకున్న ప్రభుత్వమే మూడోసారి తిరిగి అధికారంలోకి రాబోతుందన్నారు.

    ఒడిశాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఒడిశాలో మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. జగన్నాథుడి భూమిపై తొలిసారి బీజేపీ అభ్యర్థి సీఎం కాబోతున్నారని అన్నారు.

    కేరళలో కూడా బీజేపీ గెలిచిందని, ఆ రాష్ట్రంలోని కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. ఎన్నో తరాలుగా సామాన్య ప్రజలకు సేవలందించేందుకు వారు పోరాటం చేస్తున్నారని తెలిపారు.

    ఎన్నికల సంఘానికి తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ఎంతో సమర్థవంతంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికను నిర్వహించిందని అన్నారు.

    ‘అమ్మ లేని లోటును తీర్చారు’

    ఈరోజు చాలా ఎమోషనల్ డే అని, అమ్మ చనిపోయిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

    అమ్మ లేని లోటును ఈ దేశ ప్రజలు తీర్చారని అన్నారు. ఈ దేశ తల్లులు, అక్కాచెల్లెళ్లు తనకు సరికొత్త ప్రేరణను కలిగించారని చెప్పారు.

  2. ‘రాజ్యాంగాన్ని కాపాడేందుకు మేం పోరాటం చేశాం’ – రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, INC

    లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమికి మంచి ఫలితాలు రావడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

    ‘మేం రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాటం చేశాం. భారత ప్రజలకు, కూటమి సభ్యులకు, కాంగ్రెస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

    ‘‘మీరు అదానీ స్టాక్స్‌ను తప్పక చూసి ఉంటారు. అదానీతో నేరుగా మోదీకి సంబంధాలున్నాయన్నది చూసుంటారు. నేరుగా సంబంధం ఉంది. అవినీతికి చెందిన బంధం ఉంది. నరేంద్ర మోదీ మీరు మాకు వద్దు, షా మీరొద్దు అని ఈ ఎన్నికలు చెప్పాయి’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

    యూపీ ప్రజలు అద్భుతాలు చేశారని, ముప్పును అర్థం చేసుకుని రాజ్యాంగాన్ని రక్షించాలని భారత ప్రజలు అనుకున్నారని చెప్పారు.

    థ్యాంక్యూ సో మచ్ అని రాహుల్ గాంధీ అన్నారు.

  3. అమేఠీలో ఓడిపోయిన స్మృతి ఇరానీ

    స్మృతి ఇరానీ

    ఫొటో సోర్స్, ANI

    నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ అమేఠీలో ఓడిపోయారు.

    ఈ సీటు నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన కిశోరి లాల్ శర్మ లక్షా 67 వేల 196 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం ఆయనకు 5,39,228 ఓట్లు వచ్చాయి.

    గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా ఈ పార్లమెంట్ స్థానాన్ని కంచుకోటగా భావిస్తారు.

    రాహుల్ గాంధీ 2004లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత నుంచి అమేఠీలో మూడు సార్లు గెలుపొందారు. కానీ, 2019లో జరిగిన ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ 55 వేల తేడాతో ఓడిపోయారు.

    ఈసారి గాంధీ కుటుంబానికి సన్నిహిత వ్యక్తి కేఎల్ శర్మను అమేఠీ నుంచి బరిలోకి దింపింది కాంగ్రెస్.

    అమేఠీలో ఓడిపోయిన స్మృతి ఇరానీ తన పార్టీ నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

    ‘‘ఇవాళ నేను నరేంద్రమోదీకి, యోగీకి నా కృతజ్ఞతను తెలియజేస్తున్నా. 30 ఏళ్ల పనిని ఐదేళ్లలోనే పూర్తి చేశాం. గెలుపొందిన వారికి నా అభినందనలు’’ అని స్మృతి ఇరానీ అన్నారు.

  4. వారణాసిలో గెలుపొందిన ప్రధాని మోదీ

    ప్రధాని మోదీ

    ఫొటో సోర్స్, ANI

    వారణాసిలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షా 52 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మోదీకి మొత్తంగా 6,12,970 ఓట్లు వచ్చాయి.

    ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌కు 4,60,457 ఓట్లు వచ్చినట్లు ఈసీ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

    నరేంద్ర మోదీ ఈ సీటు నుంచి ఎంపీగా గెలుపొందడం ఇది మూడోసారి.

    2014, 2019లో కూడా నరేంద్ర మోదీ ఈ సీటు నుంచి ఎంపీగా గెలిచారు.

    ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో బీజేపీ 11 సీట్లను గెలుపొందగా.. 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు ఈసీ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

    సమాజ్‌వాదీ పార్టీ 8 స్థానాలను గెలుచుకుందని, 30 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నట్లు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

    కాంగ్రెస్‌ 2 స్థానాలలో విజయం సాధించింది. 4 స్థానాలలో ఆధిక్యంలో ఉంది.

  5. కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల ఎన్ని ఓట్లు వచ్చాయి?

    వైఎస్ షర్మిల

    ఫొటో సోర్స్, YS SHARMILA REDDY/FB

    కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ షర్మిల ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

    ఆమెకు ఇప్పటి వరకు 1,35,826 ఓట్లు వచ్చాయి.

    ఈ స్థానంలో 65,914 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఆయనకు ఇప్పటి వరకు 5,97,809 ఓట్లు వచ్చాయి.

    ఇక రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థి భూపేష్ సుబ్బరామి రెడ్డి ఉన్నారు.

  6. మల్కాజిగిరి: దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంలో ఈటల రాజేందర్ ఆధిక్యం

    ఈటల రాజేందర్

    ఫొటో సోర్స్, @Eatala_Rajender

    మల్కాజిగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అభ్యర్థి ఈటల రాజేందర్ 3,81,380 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.

    మల్కాజిగిరి నియోజకవర్గం ఓటర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఇక్కడ అత్యధికంగా 37,28,417 మంది ఓటర్లున్నారు.

    ప్రపంచంలోని 64 దేశాల జనాభా కంటే ఇక్కడి ఓటర్లే ఎక్కువ. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం 2008లో ఏర్పాటైంది.

  7. ఈ నియోజకవర్గంలో నోటాకు ఎక్కువగా ఓటేసిన ప్రజలు

    నోటాకు ఓటేసిన ప్రజలు

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    మధ్యప్రదేశ్‌లోని ఇందోర్ నియోజకవర్గంలో నోటా బటన్‌కు ఎక్కువ మంది ప్రజలు ఓటేశారు.

    మధ్యాహ్నం 2.30 గంటల వరకు విడుదలైన డేటా ప్రకారం, ఈ నియోజకవర్గంలో రెండు లక్షలకు పైగా ఓటర్లు నోటా బటన్‌ను నొక్కారు. ఈ సీటులో నోటా రెండో స్థానాన్ని పొందింది.

    ఈ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీకి ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. శంకర్ లాల్వానీతో పోలిస్తే బీఎస్‌పీ అభ్యర్థి సంజయ్ వెనుకబడ్డారు. ఇప్పటి వరకు ఆయనకు 51,486 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

    ఇందోర్ సీటు నుంచి పోటీ చేయాలనుకున్న కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ తర్వాత అక్షయ్ బీజేపీలో చేరారు.

  8. అమేఠీ సీటులో వెనుకబడ్డ మంత్రి స్మృతి ఇరానీ, పినాకి చక్రవర్తి, దిల్లీ

    స్మృతి ఇరానీ

    నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ అమేఠీలో వెనుకబడ్డారు.

    గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా ఈ పార్లమెంట్ స్థానాన్ని కంచుకోటగా భావిస్తారు.

    ఈ సీటు నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన కిశోరి లాల్ శర్మ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన 87,315 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    రాహుల్ గాంధీ 2004లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత నుంచి అమేఠీలో మూడు సార్లు గెలుపొందారు.

    కానీ, 2019లో జరిగిన ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ 55 వేల తేడాతో ఓడిపోయారు.

    ఈసారి గాంధీ కుటుంబానికి సన్నిహిత వ్యక్తి అయిన కేఎల్ శర్మను అమేఠీ నుంచి బరిలోకి దింపింది కాంగ్రెస్.

    ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్ ప్రకారం, కేఎల్ శర్మ చేతిలో స్మృతి ఇరానీ వెనుకబడ్డట్లు తెలిసింది.

  9. లోక్‌సభ ఎన్నికలు: రేసు గుర్రం నటుడు రవి కిషన్ ముందంజ, ఇతర సినీ నటుల పరిస్థితి ఏంటి?

    రవి కిషన్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, రవి కిషన్ (ఎడమ), దినేశ్ లాల్ (కుడి)

    ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన భోజ్‌పురి సినీ నటుడు దినేష్ లాల్ వెనుకంజలో ఉన్నారు.

    భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో మధ్యాహ్నం 2 గంటల వరకు అప్‌డేట్ చేసిన వివరాల ప్రకారం, ఆజంగఢ్‌లో సమాజ్‌వాద్ పార్టీ నేత ధర్మేంద్ర యాదవ్ 90 వేల ఆధిక్యంలో ఉన్నారు. దినేష్ లాల్‌కు లక్షకు పైగా ఓట్లు పోలయ్యాయి.

    ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, నటుడు రవికిషన్ 41 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    సినీ నటి కంగనా రనౌత్, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఆమె 72 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య రెండో స్థానంలో ఉన్నారు.

    పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌ సోల్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన టీఎంసీ అభ్యర్థి శత్రుఘ్న సిన్హా 47 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ సీటులో బీజేపీ అభ్యర్థి సురేంద్రజిత్ సింగ్ రెండో స్థానంలో ఉన్నారు.

  10. హైదరాబాద్‌లో మాధవీ లతపై అసదుద్దీన్ ఒవైసీ లక్షకు పైగా ఓట్ల ఆధిక్యం

    అసదుద్దీన్ ఓవైసీ

    ఫొటో సోర్స్, ANI

    హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం.. మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒవైసీకి 3,21,969 ఓట్లు వచ్చాయి.

    భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవీ లతకు 2,08,286 ఓట్లు పోలయ్యాయి.

    ఒవైసీ దాదాపు లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    తెలంగాణలో 17 స్థానాలకు గాను బీజేపీ 8 స్థానాల్లో, కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఏఐఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యంలో ఉండగా. బీఆర్‌ఎస్ ఒక్క సీటులో కూడా ఆధిక్యం సాధించలేదు.

  11. ఎన్నికల ఫలితాల సరళితో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, 5,000 పాయింట్లు పతనం

    స్టాక్ మార్కెట్లు

    ఫొటో సోర్స్, ANI

    లోక్‌సభ ఎన్నికల-2024 ఓట్ల లెక్కింపు ట్రెండ్స్ బయటకు వచ్చిన తర్వాత మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్ పతనం ప్రారంభమైంది.

    బీఎస్‌సీ సెన్సెక్స్ సోమవారం భారీ లాభాలలో 76,400 వద్ద ముగిసింది. కానీ, మంగళవారం ఉదయం మార్కెట్ ప్రారంభానికి ముందే ఎన్నికల కౌంటింగ్ మొదలు కావడంతో రెండు వేల పాయింట్లకు పైగా పడిపోయింది.

    ఆ తర్వాత నష్టాలు మరింత కొనసాగి ఇది దాదాపు 4 వేల పాయింట్లకు పైగా కుప్పకూలాయి. దీనితో సెన్సెక్స్ 72,204 వద్దకు చేరింది.

    23,179.50తో ప్రారంభమైన నిఫ్టీ, ప్రారంభ దశలోనే 654 పాయింట్లు పడిపోయి 22,609 వద్ద ట్రేడైంది.

    మార్కెట్ల పతనంతో ఇన్వెస్టర్లకు 36 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.

    అదానీ గ్రూపుకు చెందిన 10 కంపెనీల షేర్లు ఈరోజు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    ఈ కంపెనీల షేర్లు 20 శాతం వరకు క్రాష్ అయ్యాయి.

  12. వాయనాడ్, రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి?

    సోనియా గాంధీ, రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, Reuters

    ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రెండు సీట్ల నుంచి పోటీ చేశారు.

    ఎన్నికల సంఘం డేటా ప్రకారం, కేరళలోని వాయనాడ్‌లో రాహుల్ గాంధీ, సమీప ప్రత్యర్థి ఆనీ రాజా (సీపీఐ)పై లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    ఇక ఆయన పోటీ చేసిన మరో స్థానం యూపీలోని రాయ్‌బరేలీ.

    రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ, బీజేపీ అభ్యర్థి దినేశ్ ప్రతాప్ సింగ్ మీద 76 వేలకు పైగా ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.

  13. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, ఎస్పీల మధ్య పోటాపోటీ.. వారణాసిలో లీడింగ్‌లో నరేంద్ర మోదీ

    లోక్‌సభ

    ఫొటో సోర్స్, Getty Images

    ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్నట్లు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోని డేటా చూపిస్తోంది.

    ఇప్పటివరకు (ఉదయం గం. 10:30) జరిగిన కౌంటింగ్ ప్రకారం చూస్తే బీజేపీ 36 స్థానాల్లో, సమాజ్‌వాద్ పార్టీ 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

    కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది.

    ప్రస్తుతం నరేంద్ర మోదీ 21 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.

  14. లోక్‌సభ ఫలితాలు: ప్రారంభ రౌండ్లలో ఎన్డీయే 277, ఇండియా కూటమి 205 స్థానాల్లో ఆధిక్యం

    లోక్ సభ ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    18వ లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఆధిక్యంలో ఉన్నట్లు డేటా నెట్ గణాంకాలు చెబుతున్నాయి.

    ఎన్డీయే 277 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండియా కూటమి 205 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

    18వ లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 19న జరగగా, చివరి దశ ఓటింగ్‌ జూన్‌ 1న జరిగింది.

    ఈరోజు 543 స్థానాలకు గానూ 542 ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

    సూరత్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకపక్షంగా విజయం సాధించారు.

  15. ఓట్ల లెక్కింపు ముందు బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీ లత ఏమన్నారంటే?

    బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత

    ఫొటో సోర్స్, ANI

    లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని బీజేపీ హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి మాధవీ లత వ్యాఖ్యానించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    "నాకు చాలా ఉత్సాహంగా ఉంది. దేశంలో చాలా సీట్లతో పాటు హైదరాబాద్‌లోనూ బీజేపీ గెలుస్తుంది. రెండు పర్యాయాలు ప్రధాని మోదీ అద్భుతంగా పని చేశారు. ఈసారి 400 సీట్లు దాటుతాయని ఆశిస్తున్నాం’’ అని ఆమె అన్నారు.

    హైదరాబాద్‌ స్థానానికి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, బీజేపీ నుంచి మాధవి లత పోటీ పడ్డారు.

    2004 నుంచి హైదరాబాద్‌లో ఒవైసీ గెలుస్తూ వస్తున్నారు.

  16. బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానెల్‌లో చేరండి

    వాట్సాప్

    బీబీసీ న్యూస్ తెలుగు కథనాలను మీరిప్పుడు వాట్సాప్ ద్వారా చదవచ్చు.

  17. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు: ఓట్ల లెక్కింపు మొదలు

    లోక్ సభ ఎన్నికల ఫలితాలు

    ఫొటో సోర్స్, ANI

    లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొద్ది సేపట్లో మొదలు కానుంది.

    మొత్తం 542 పార్లమెంటు స్థానాలకు ఏడు దశలలో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వరకుఏడు దశలలో ఎన్నికలు సాగాయి.

    ఇప్పటికే బీజేపీ సూరత్ పార్లమెంటు స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకున్న సంగతి తెలిసిందే.

    తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించడం మొదలుపెట్టిన అరగంట తరువాత ఈవీఎంలను తెరుస్తారు.

    పోస్టల్ బ్యాలెట్లు లేని చోట నేరుగా ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.

    దేశవ్యాప్తంగా మొత్తం 64.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు.

    ఈ ఎన్నికల ప్రక్రియలో 1.5 కోట్ల మంది ఎన్నికల, భద్రతా సిబ్బంది పాలుపంచుకున్నారని ఆయన చెప్పారు. ఎన్నికల పరిశీలకు 68వేల బృందాలు పనిచేశాయి.

    మొత్తం ఏడుదశల ఎన్నికలను ఎదుర్కొన్న రాష్ట్రాలుగా ఉత్తరప్రదేశ్, బిహర్, పశ్చిమబెంగాల్ నిలిచాయి.

    ఈ సారి ఎన్నికలలో మహిళలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదు, ఆరో దశల పోలింగ్ పురుషుల కన్నా మహిళా ఓట్ల శాతమే ఎక్కువగా నమోదైంది.

    అలాగే మొదటిసారిగా 80 ఏళ్ళకు పైబడి వృద్ధులు, 40 శాతానికి పైగా శారీరక వికలత్వం ఉన్నవారు ఇంటినుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించారు.

    జమ్ము కశ్మీర్‌లో ఈసారి 58.55శాతం మంది ప్రజలు ఓటు వేశారు. గడిచిన 35 సంవత్సరాలలో ఇదే అత్యధికం.

    ఇప్పటికే విడుదలైన అనేక ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ తాము నమ్మడం లేదని ఇండియా కూటమి ప్రకటించింది.

    బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం తిరిగి చేజిక్కించుకుంటుందనేఅంచనాల నడుమ సోమవారంనాడు స్లాక్ మార్కెట్లు దూసుకుపోయాయి.

  18. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    లోక్ సభ ఎన్నికల ఫలితాల వివరాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.