కరోనావైరస్ లాక్ డౌన్‌: ‘పరిస్థితి సురక్షితం అనుకోగానే స్కూళ్లు తెరవడం అవసరం లేదంటే పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రభావం’

టీనేజ్‌లో ఉన్న పిల్లలు కరోనావైరస్ సమయంలో స్నేహితులను కలవకపోవడం వలన దీర్ఘకాలంలో ప్రతికూల పరిణామాలు ఉంటాయని న్యూరో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

లాక్ డౌన్ లో సాంఘిక జీవనం కరువవ్వడం వలన వారి మానసిక ఎదుగుదల, ప్రవర్తన, మెదడు పని చేసే తీరు పై ప్రభావం చూపవచ్చని లాన్సెట్ చైల్డ్ అండ్ అడాలసెంట్ పత్రికలో ప్రచురించిన వ్యాసం పేర్కొంది.

భౌతిక దూరం పాటిస్తున్న సమయంలో సోషల్ మీడియాని ఎక్కువగా వాడటం వలన ప్రతికూల ప్రభావాలు చాలా ఉండవచ్చని ఈ వ్యాసంలో రాసారు.

పరిస్థితి సురక్షితం అనుకోగానే పిల్లలకు స్కూళ్ళు తెరవడం అవసరమని సూచించారు.

10 - 24 సంవత్సరాల మధ్య వయస్సుని యుక్త వయస్సుగా పరిగణిస్తారని, ఈ వయస్సులో పిల్లలు సాధారణంగా స్నేహితులతోను, కుటుంబంతోనూ గడపాలని అనుకుంటారని అన్నారు. పిల్లల్లో శారీరకంగా, మానసికంగా ఎదుగుదల జరగడానికి ఇది కీలకమైన వయస్సని పేర్కొన్నారు.

ఇదే వయస్సులో చాలా రకాలైన మానసిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.

కానీ, కరోనావైరస్ మహమ్మారితో పరిస్థితులన్నీ తారుమారయ్యాయని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో మానసిక నిపుణులు ప్రొఫెసర్ సారా జేన్ బ్లేక్మోర్ అన్నారు.

"కోవిడ్-19 వలన చాలా మంది యుక్త వయస్సులో ఉన్న వారు తమ తోటి వారితో కలవడం అవ్వటం లేదని, ఇది వారి మానసిక ఎదుగుదలకు చాలా ప్రతికూలంగా పని చేస్తుందని అన్నారు.

యువత మానసిక సంక్షేమం కోసం విధాన కర్తలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

యువత సాంఘిక జీవనానికి దూరం కావడం వలన కలిగే ప్రభావం గురించి మరింత పరిశోధన జరగాల్సి ఉందని కేంబ్రిడ్జిలో పరిశోధన చేస్తున్న ఎమీ ఆర్బెన్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన లివియా టొమోవ చేసిన అధ్యయనం పేర్కొంది.

సాంఘిక జీవనానికి దూరంగా ఉన్న జంతువుల పై జరుగుతున్న పరిశోధన అవి ఆందోళనకరమైన ప్రవర్తనను కనబరుస్తున్నట్లు, వాటి జ్ఞాపక శక్తి పై ప్రభావం చూపిస్తున్నట్లు ఫలితాలు వస్తున్నట్లు తెలిపారు. సంఘ జీవనంలో ఎలా గడపాలో అనుభవం లేకపోవడం వలన ఇలాంటి ఫలితాలు వస్తూ ఉండటానికి ఒక కారణం కావచ్చని ఈ అధ్యయనం పేర్కొంది.

సోషల్ మీడియా ప్రభావం

యూకేలో 69 శాతం మంది 12-15 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకి సోషల్ మీడియా ప్రొఫైల్ ఉండటం వలన స్నేహితులతో సోషల్ మీడియాలో సంభాషించడానికి అవకాశాలు ఉన్నాయి.

భౌతిక దూరం పాటించడం వలన కలిగే ప్రభావాల నుంచి డిజిటల్ మాధ్యమాలు ఎలా సహాయపడతాయో కూడా చూడాల్సిన అవసరం ఉందని, డాక్టర్ ఆర్బెన్ అన్నారు.

సోషల్ మీడియా వాడటం వలన , పోస్ట్‌లు రాయడం వలన , ఒకరితో ఒకరు సంభాషించుకోవడం వలన పరస్పర సంబంధాలు మెరుగుపడతాయని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి.

అయితే, సోషల్ మీడియాలో తరచుగా న్యూస్ ఫీడ్ ని చూడటం వలన మానసిక ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాలు కూడా ఉండే అవకాశం ఉంది.

లాక్ డౌన్ కారణంగా చాలా దేశాలలో స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు. భారతదేశంలో కొన్ని స్కూళ్లలో ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించారు. ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)