కరోనావైరస్ లాక్ డౌన్ నిబంధనలను సడలించేందుకు సిద్ధమైన ఇటలీ

మార్చి రెండో వారం తర్వాత నుంచి రోజువారీ మరణాల సంఖ్య అతి తక్కువగా నమోదు అవుతుండటంతో ఏడు వారాలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ నిబంధనలను సడలించేందుకు ఇటలీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

మే 4 నుంచి లాక్ డౌన్ నిబంధనల సడలింపు మొదలు పెడతామని ఇటలీ ప్రధాని గిసెప్పీ కాంటే వెల్లడించారు. ఆరోజు నుంచి పరిమిత సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చేందుకు అనుమతిస్తామని, కానీ మాస్కులు తప్పక ధరించాలని ఆయన తెలిపారు.

పార్కులను తెరిచినా స్కూళ్లను మాత్రం సెప్టెంబర్ నుంచే తిరిగి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

యూరప్‌లోని స్విట్జర్లాండ్, స్పెయిన్ కూడా లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తున్నాయి.

ఆదివారంనాడు ఇటలీలో 260మంది వైరస్ కారణంగా చనిపోయారు. మార్చి 14 తర్వాత ఒకరోజులో సంభవించిన అతి తక్కువ మరణాలు ఇవే. ఇప్పటి వరకు యూరప్‌లోనే అత్యధికంగా ఇటలీలో 26,644 మంది వైరస్ కారణంగా మరణించారు.

ప్రపంచవ్యాప్తంగా వైరస్ గణాంకాలను సేకరిస్తున్న జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ చెప్పినదాని ప్రకారం ఇటలీలో మొత్తం 1,97,675 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య తగ్గుతుండటం, వ్యాధి వ్యాప్తి కూడా తగ్గుముఖం పడుతుండటంతో ఇకపై నిబంధనలు క్రమక్రమంగా సడలించాలని ఇటలీ నిర్ణయించింది.

ఇటలీ ప్రధాని ఏం ప్రకటించారు?

కరోనావైరస్ లాక్ డౌన్ నిబంధనల సడలింపులో రెండో దశ గురించి ఇటలీ ప్రధాని కాంటే టెలివిజన్ ద్వారా ప్రజలకు సూచనలు చేశారు. అవేంటంటే...

ప్రజలు తమ ప్రాంతాల్లో సంచరించవచ్చు. కానీ ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదు.

అంత్యక్రియల కార్యక్రమాలు మళ్లీ మొదలవుతాయి. బహిరంగ ప్రదేశాల్లోనే ఖననం చేయాలి. ఈ సమయంలో 15 కన్నా ఎక్కువమంది ఉండకూడదు.

అథ్లెట్లు వ్యక్తిగత శిక్షణను ప్రారంభించవచ్చు. ఆటగాళ్లు ఇళ్ల దగ్గర కాకుండా విశాలమైన బహిరంగ ప్రదేశాల్లో ఆటలు ఆడుకోవచ్చు.

టేక్ అవే సర్వీసుల కోసం బార్లు, రెస్టారెంట్లు మే 4 నుంచి తెరుస్తారు. అయితే ఈ ఫుడ్‌ను ఇళ్లల్లో లేదా ఆఫీసుల్లో మాత్రమే తీసుకోవాలి.

హెయిర్ డ్రెస్సర్స్, బ్యూటీ సెలూన్లు, బార్లు, రెస్టారెంట్లు డైన్ ఇన్ సర్వీసుల కోసం జూన్ 1 వరకు ఆగాల్సిందే.

మొదటి దశ సడలింపుల్లో రిటెయిల్ షాపులు ఓపెన్ చేసుకోడానికి అనుమతించారు. రెండో దశలో మే 18 నుంచి మ్యూజియమ్‌లు, లైబ్రరీలు కూడా తెరవచ్చు.

క్రీడాకారుల గ్రూప్ ట్రైనింగుకు మే 18 నుంచి అనుమతి ఇస్తారు.

ఇక ఇటలీ ప్రీమియర్ ఫుట్ బాల్ లీగ్ సైరీ ఏ కొనసాగింపుపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ప్రేక్షకులు లేకుండా నిర్వహణపై కూడా ఎలాంటి ప్రకటన లేదు.

అయితే రాబోయే రోజుల్లో కూడా సామాజిక దూరం నియమాలను కఠినంగా కొనసాగించాలని ప్రధాని కాంటే స్పష్టం చేశారు. చర్చి కార్యక్రమాలు కూడా పూర్తిగా బంద్ చేశారు. ప్రజలంతా మూడు మీటర్ల దూరాన్ని పాటించాలని ప్రధాని సూచించారు.

"మనం నిబంధనలను పాటించకపోతే మళ్లీ మరణాల రేటు పెరగడం మొదలవుతుంది. మనం ఆర్ధికంగా చాలా సమస్యల్లో కూరుకుపోతాం. మీరు ఇటలీని ప్రేమిస్తున్నట్లయితే సామాజిక దూరాన్ని పాటించండి'' అని ప్రధాని సూచించారు.

ఇటలీలో ఏం జరిగింది?

మార్చి 9 నుంచి ఇటాలియన్లు ఇళ్లలోనే లాక్ డౌన్ అయ్యారు. వాళ్లు వారి ఇంటికి సమీపంలోని వీధుల్లోకి వెళ్లడానికి మాత్రమే ప్రభుత్వం అనుమతించింది.

ఇటలీ ఏప్రిల్ 14 నుంచి లాక్ డౌన్ నిబంధనల సడలింపులో మొదటి దశను ప్రారంభించింది. కొన్నిషాపులు, బుక్ స్టోర్స్, డ్రై క్లీనింగ్ సెంటర్లు, స్టేషనరీ స్టోర్లు ఓపెన్ అయ్యాయి. తక్కువమంది జనం పోగయ్యే అవకాశాలున్న వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు.

"ప్రస్తుతం నరకంలో ఉన్నట్లున్న ఈ లాక్ డౌన్‌కు సడలింపులు ఇస్తుండటంతో ప్రజలు ఊరిపి పీల్చుకుంటున్నారు. కానీ జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది" అని రోమ్‌లో ఉన్న బీబీసీ ప్రతినిధి మార్క్ లావెన్ అంటున్నారు.

ఒకవేళ ఇన్ ఫెక్షన్ మళ్లీ విజృంభిస్తే ఈ నిబంధనలను తిరిగి అమలు చేసేందుకు ప్రభుత్వానికి అన్ని అధికారాలున్నాయని మార్క్ లావెన్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)