కరోనావైరస్: కుక్కలు, పిల్లుల మాంసం తినడంపై నిషేధం విధించిన చైనాలోని షెన్‌జెన్ నగరం

చైనాలోని షెన్‌జెన్ నగరంలో కుక్కలు, పిల్లుల మాంసం అమ్మడాన్ని, తినడాన్ని నిషేధించారు. చైనాలో ఈ నిషేధం విధించిన తొలి నగరం ఇదే.

వన్యప్రాణుల ద్వారానే కరోనావైరస్ వ్యాప్తి మొదలైందని నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలోనే అడవి జంతువుల మాంసం వ్యాపారాలను, వినియోగాన్ని నిషేధించాలని ఇక్కడి అధికారులు నిర్ణయించారు. మరో అడుగు ముందుకు వేసిన షెన్‌జెన్ నగరం అధికారులు... పెంపుడు జంతువులైన పిల్లులు, కుక్కల మాంసంపై కూడా నిషేధం విధించారు. మే ఒకటో తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది.

ఆసియాలో ఏటా దాదాపు మూడు కోట్ల కుక్కలను మాంసం కోసం చంపుతున్నారని హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ (హెచ్ఎస్ఐ) చెబుతోంది.

అయితే, చైనీయుల్లో అందరూ కుక్క మాంసం తినరు. తాము ఎన్నడూ కుక్క మాంసాన్ని ముట్టలేదని చాలామంది చెబుతున్నారు.

"కుక్కలు, పిల్లులు మనుషులతో అత్యంత సన్నిహితంగా మెలిగే పెంపుడు జంతువులు. కుక్కలు, పిల్లులతో పాటు, ఇతర పెంపుడు జంతువుల మాంసం తినడంపై అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, హాంకాంగ్, తైవాన్‌లోనూ నిషేధం ఉంది. ఇప్పుడు మేము కూడా అదే నిర్ణయం తీసుకున్నాం" అని షెన్‌జెన్ నగర ప్రభుత్వం తెలిపిందని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

ఈ నిర్ణయం పట్ల జంతు పరిరక్షణ సంస్థ హెచ్‌ఎస్‌ఐ హర్షం వ్యక్తం చేసింది. షెన్‌జెన్ అధికారులను అభినందించింది.

"చైనాలో ఏటా కోటి కుక్కలను, 40 లక్షల పిల్లులను చంపేస్తున్నారు. ఈ క్రూరమైన వ్యాపారానికి ముగింపు పలికే ప్రయత్నాలలో షెన్‌జెన్ నగర అధికారులు గొప్ప ముందడుగు వేశారు" అని చైనాలోని హెచ్ఎస్ఐ ప్రతినిధి డాక్టర్ పీటర్ లీ అన్నారు

అయితే, ఒకవైపు వన్యప్రాణుల మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తూనే, మరోవైపు కరోనావైరస్ సోకిన రోగులకు చికిత్స చేసేందుకు ఎలుగుబంటి పైత్యరసం వినియోగించడాన్ని చైనా ప్రభుత్వం ఆమోదించింది.

ప్రాణంతో ఉన్న ఎలుగుబంట్లను బంధించి వాటి నుంచి పైత్య రసాన్ని సేకరిస్తారు. చాలా కాలంగా సంప్రదాయ చైనా ఔషధాలలో దానిని వాడుతున్నారు.

ఆ రసాన్ని ఉర్సోడీఆక్సీకోలిక్ ఆమ్లం అంటారు. దానిని పిత్తాశయంలో ఏర్పడే రాళ్లను కరిగించేందుకు, కాలేయ వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తారు. కానీ, కరోనావైరస్‌ రోగులకు ఇది పనిచేస్తున్నట్లు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

వన్యప్రాణులను హింసిస్తూ, వాటి నుంచి పైత్య రసాన్ని తీయడం క్రూరమైన చర్య అని యానిమల్స్ ఏషియా ఫౌండేషన్ అంటోంది.

"వన్యప్రాణుల నుంచి కోవిడ్-19 వైరస్ మొదలైందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఎలుగుబంటి పైత్య రసం లాంటి వన్యప్రాణి ఉత్పత్తులపై మనం ఆధారపడటం మంచిది కాదు’’ అని యానిమల్స్ ఆసియా ఫౌండేషన్ ప్రతినిధి బ్రియాన్ డాలీ ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో చెప్పారు.

వన్యప్రాణుల మార్కెట్

కరోనావైరస్ విజృంభించిన తర్వాత, ఈ ఏడాది ఫిబ్రవరిలో అడవి జంతువుల మాంసం విక్రయాలను, వినియోగాన్ని చైనా ప్రభుత్వం నిషేధించింది.

వుహాన్‌ నగరంలో వన్యప్రాణులను, మాంసాన్ని అమ్మే మార్కెట్‌ కోవిడ్-19 వైరస్‌ వ్యాప్తికి కేంద్ర బిందువు అని, అక్కడి నుంచి ఆ వైరస్ మనుషులకు సంక్రమించి ఉంటుందని అధికారులు భావించారు.

దాంతో, వన్యప్రాణులను, వాటి మాంసాన్ని విక్రయించే మార్కెట్లపై చైనా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మందికి పైగా కరోనావైరస్ పాజిటివ్ నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి 47,000 మందికి పైగా మరణించారు.

చైనాలో 81,589 మందికి ఈ వైరస్ సోకగా, 3,318 మంది చనిపోయారని ఆ దేశ జాతీయ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఈ వైరస్ ఎక్కడ పుట్టింది? అది మానవులకు ఎలా వ్యాపించింది? అన్న విషయాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు, నిపుణులు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)