పాకిస్తాన్లో ఏటా సగటున 20 లక్షల గర్భస్రావాలు... ఐక్యరాజ్యసమితి ఆందోళన
పాకిస్తాన్లో ఏటా 20 లక్షల గర్భస్రావాలు జరుగుతున్నాయి. ఆ దేశంలో కుటుంబ నియంత్రణ ఎంత అవసరమో ఈ గణాంకాలు చెబుతున్నాయని ఐక్యరాజ్య సమితి అంటోంది.
అప్పటికే పిల్లలు ఉండడంతో, ఇంకో బిడ్డ వద్దనుకొని గర్భస్రావం చేయించుకునే కేసులే ఎక్కువగా ఉంటున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల రేటు 3.2గా ఉండగా పట్టణాల్లో అది 2.8గా ఉంది.
15 ఏళ్లకే పెళ్లి చేసుకున్న అబ్దుల్ రషీద్కు ఇప్పుడు 17 మంది పిల్లలు.

ఆయనకు పక్కా ఇల్లు లేదు. పిల్లల అవసరాలను తీర్చే స్థోమతా లేదు. కుటుంబ నియంత్రణ గురించి ఏ ప్రభుత్వ ఉద్యోగీ తనకు చెప్పలేదని అన్నారు.
"మేం బట్టలు కొనేది ఏడాదికి ఒక్కసారి మాత్రమే. రోజులో రెండు పూటలా తిండి దొరికితే అదృష్టమనే చెప్పాలి. ఆస్పత్రులు, డాక్టర్లు, స్కూళ్లు, ఏవీ ఇక్కడ లేవు. మా తల్లిదండ్రులు పెళ్లి చేశారు, మేం పిల్లలను కంటున్నాం. కుటుంబ నియంత్రణ గురించి మాకు తెలీదు. డాక్టర్లు ఎవరైనా మాకు ఆ విషయం చెప్పి ఉంటే, మేం చిన్నకుటుంబంతో సంతోషంగా ఉండేవాళ్లం"
34శాతం మహిళలు మాత్రమే కుటుంబ నియంత్రణ కోసం వివిధ మార్గాలను అవలంబిస్తున్నట్లు పాకిస్తాన్ డెమోగ్రాఫిక్ సర్వే చెబుతోంది. 2020 నాటికి ఇది 50 శాతానికి పెరగాల్సి ఉంది.
బస్రా బరోహీకి ఒక కొడుకు. ఆమె భర్త కూలి పనులకు వెళ్తాడు. భర్త అనుమతితో ఆమె అయిదేళ్ల కోసం కుటుంబ నియంత్రణ పద్ధతిని ఎంచుకున్నారు.
కానీ రెండేళ్లకే ఆ పద్ధతిని విరమించుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

"కుటుంబ నియంత్రణ క్యాప్సుల్స్ ఆపేయమని మూడేళ్ల క్రితం మా అత్తయ్య చెప్పారు. అవి వేసుకుంటే ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. నెలసరి కూడా అయ్యేది కాదు. ఇప్పుడు వాటిని ఆపివేశాక ఇప్పుడు అంతా బాగుంది" అన్నారు బస్రా.
గత ఏడాది జనవరి, నవంబరు మధ్య... థట్టా, సుజావల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 13,441 మంది మహిళలు ప్రసవించారు.
ఆ సమయంలో కనీసం 10 శాతం మంది కూడా కుటుంబ నియంత్రణ పాటించలేదు. ఫ్యామిలీ ప్లానింగ్ వద్దని కోడళ్లపై అత్తలు ఒత్తిడి తెస్తున్నట్లు అక్కడి డాక్టర్లు చెబుతున్నారు.

థట్టా హెల్త్ సెంటర్లో ఇంఛార్జ్ డాక్టర్ అయిన షహీదా పర్వీన్ "కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తే వేరే వ్యాధులు వస్తాయనే అపోహలు ఇక్కడ ఉన్నాయి. కేన్సర్ వస్తుందని, మరో బిడ్డను కనలేరని, దీర్ఘకాలం పాటు వాడితే చేతులు పనిచేయవని, రుతుస్రావ సమస్యలు వస్తాయని ఎన్నో పుకార్లు ఉన్నాయి" అన్నారు.
ప్రతి అయిదుగురిలో ఒక మహిళ కుటుంబ నియంత్రణను పాటించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.
అయితే మెరుగైన కుటుంబ నియంత్రణ పద్ధతులు మహిళలకు ఇంకా అందుబాటులోకి రాలేదు.
ఇలా వెంటవెంటనే గర్భం దాల్చడం ద్వారా మాతాశిశు మరణాల రేటు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆసియా బీబీ: 'దైవదూషణ కేసులో ఆమె నిర్దోషి...' మళ్ళీ తీర్పు చెప్పిన పాక్ సుప్రీం కోర్టు
- గాంధీజీ మెచ్చిన పెన్ను రాజమండ్రిలో తయారైంది
- చంద్రుని మీద మొలకెత్తిన చైనా పత్తి విత్తనం
- వర్జినిటీని మూత తీయని సీసాతో పోల్చుతారా ? : అభిప్రాయం
- సరదాగా సెల్ఫీ తీసుకుంటున్న ‘సైతాను’ రేపిన వివాదం
- హరప్పా నాగరికతనాటి ‘దంపతుల’ సమాధి చెబుతున్న చరిత్ర
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









