రాజమండ్రి రత్నం పెన్నులు: రాష్ట్రపతులు, ప్రధానులూ ఈ పెన్నే ఉపయోగిస్తారు

- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
"మహాత్మా గాంధీ తన పర్యటనల్లో భాగంగా ఓసారి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వస్తున్న సమయంలో రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్లో ఆగారు. ఆ సమయంలో రాజమండ్రిలోని రత్నంపెన్నుల సంస్థ యజమాని కేవీ రత్నం.. స్వదేశీ తయారీ, విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా తాను తయారు చేసిన పెన్నును గాంధీని కలిసి బహూకరించారు.
స్వదేశీ వస్తువు ఏదైనా చేయమని 1921లో మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి అని గాంధీజీతో రత్నం అన్నారు. కానీ గాంధీజీ ఆ పెన్నును చూసి విదేశీ దిగుమతి కావచ్చేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయన సహాయకుడు కుమారప్ప స్వయంగా పరిశీలించి, పూర్తి స్వదేశీ తయారీ అని నిర్థరించిన తర్వాత గాంధీ దాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత "మీరు పంపిన పెన్ను వాడుతున్నాను, ఆనందంగా ఉంది" అంటూ 1935లో కేవీ రత్నానికి గాంధీ స్వయంగా లేఖ రాయడం విశేషంగా మారింది."
అంటూ కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన ఈ సంఘటనను గుర్తు చేసుకున్నారు కేవీ రత్నం సోదరుడు రమణమూర్తి. 1932లోనే పెన్నుల తయారీని ప్రారంభించినా, గాంధీజీ లేఖ రాసిన నాటి నుంచి రత్నం పెన్ను అంటే స్వదేశీ పెన్నుగా పేరు ప్రఖ్యాతులు గడించింది. ఇప్పటికీ గాంధీజీ రాసిన లేఖను అక్కడ చూడవచ్చు.

పెన్నుల తయారీకి వెండి, బంగారం
పెన్నుల తయారీ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన రబ్బరు వాడుతుంటారు. కానీ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వెండి, బంగారం పెన్నులు కూడా తయారు చేస్తున్నారు. 14 క్యారెట్, 24 క్యారెట్ బంగారం పెన్నులు కూడా సిద్ధం చేస్తున్నారు. అప్పట్లో గాంధీకి అందించిన పెన్ను కూడా 14 క్యారెట్ల బంగారం పాళీతో చేసిందేనని రమణమూర్తి తెలిపారు.
పాళీ తయారీలో 24 క్యారెట్ బంగారం కన్నా 14 క్యారెట్ల బంగారమే సౌకర్యవంతంగా ఉంటుందని, అందుకే ఎక్కువ మంది 14 క్యారెట్ల బంగారంతో తయారయిన వాటికే ప్రాధాన్యమిస్తారని వివరించారు.

పెన్నుల తయారీలో రికార్డులు
వీరు తయారు చేసిన 1.5 గ్రాముల బరువుండే అతి చిన్న పెన్, అతి చిన్న బంగారం పెన్నులు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ చేతుల మీదుగా చిన్న పెన్నులను అవిష్కరించినప్పుడు ఆయన వీటిని బొమ్మలుగా భావించారని, కానీ వాటితో స్వయంగా రాసి చూసి మెచ్చుకున్నారని రత్నం పెన్స్ తయారీలో తండ్రితో పాటు భాగస్వామిగా ఉన్న గోపాల రత్నం తెలిపారు.

రాష్ట్రపతి, ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఈ పెన్నులే
రత్నం పెన్నుల్లో ఎన్నో రకాలున్నాయి. ఖరీదు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. 300 రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయల ఖరీదు చేసే పెన్నులను వీరు తయారు చేస్తున్నారు. అందులో 'సుప్రీం' అనే మోడల్ కేవలం రాష్ట్రపతి, ప్రధాన మంత్రి వంటి వారి కోసం తయారుచేస్తున్నామని కేవీ రమణమూర్తి తెలిపారు.
భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ నుంచి ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వరకూ ప్రమాణస్వీకార పత్రాలపై తమ పెన్నులతోనే సంతకాలు చేసినట్టు వీరు చెబుతున్నారు. అలాగే నెహ్రూ నుంచి మోదీ వరకూ ప్రధాన మంత్రులందరూ రత్నం పెన్నులను వాడినట్టు చెప్పారు. ఈ మోడల్ కేవలం వారికోసమే సిద్ధం చేస్తామన్నారు.

ఈ నాణ్యత ఎక్కడా రాదు..
రత్నం పెన్నులతో రాయడం అలవాటైతే వేరే పెన్నులు వాడాలని అనిపించదని నరసింహం అనే వినియోగదారుడు అంటున్నారు. గడిచిన 15 ఏళ్లుగా తాను ఇవే పెన్నులు వాడుతున్నట్టు వివరించారు. కృపావతి అనే మరో మహిళ కూడా రత్నం పెన్స్ కోసం దూరదూరాల నుంచి వస్తుంటారని తెలిపారు. రాజమహేంద్రవరంలో ఓ చిన్న సందులో ఉండే ఈ షాపుని వెదుక్కుంటూ ఎక్కడెక్కడి నుంచో ఎందరో రావడాన్ని చూస్తేనే ఆ పెన్నుల నాణ్యతను అర్థం చేసుకోవచ్చని వారు అంటున్నారు.

తరాలు మారినా పెన్నుల ప్రత్యేకత కొనసాగుతూనే ఉంది. రత్నం సోదరులు, వారి కుమారులు కూడా ఇదే వృత్తిగా మలచుకున్నారు. అమెరికా, రష్యా దేశాల అధ్యక్షులకు సైతం రత్నం పెన్నులు అందించారు.
స్వాతంత్ర్య సమరయోధుల నుంచి నేటి తరం నేతల వరకూ పలువురు ఈ పెన్నుల పట్ల ప్రత్యేక ఆసక్తి ప్రదర్శిస్తూనే ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ స్వయంగా రాజమండ్రిలోని కేవీ రత్నం పెన్స్ తయారీకేంద్రాన్ని సందర్శించారని తెలిపారు. అప్పట్లో నెహ్రూ వాడిన రత్నం పెన్ నేటికీ అలహాబాద్లోని ఆయన స్వగృహంలో దాచి ఉంచినట్టు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి.
- రాయలసీమ కరవు: అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- వీవీఎస్ లక్ష్మణ్: నంబర్ త్రీగా ఆడడం వెనుక అసలు చరిత్ర
- #UnseenLives: బాలింతలైతే 3 నెలలు ఊరి బయటే: ఇదేం ఆచారం?
- రాయలసీమలో ‘రత్నాల’ వేట
- భారతదేశంలో సైనిక తిరుగుబాటు ఎందుకు సాధ్యం కాదు?
- పోలవరం: ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు ఎక్కడుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








