వీగన్ డైట్‌తో కాలుష్యానికి చెక్ పెట్టొచ్చా?

కూరగాయలు

ఫొటో సోర్స్, Getty Images

పర్యావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా ప్రస్తుతం పాలు, మాంసం ఉత్పత్తుల వినియోగం మీద పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆ రెండు రకాల ఉత్పత్తుల వాడకాన్ని ఆపేస్తే వాతావరణ మార్పులకు చెక్ పెట్టొచ్చని వాతావరణ మార్పులకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి కమిటీ సభ్యులు అంటున్నారు.

జంతు సంబంధమైన ఉత్పత్తులకు మానవజాతి దూరంగా ఉండటమే కాలుష్యానికి సరైన పరిష్కారమని వారు చెబుతున్నారు.

జెన్నీ హాల్ అనే మహిళ.. గతంలో చికెన్, చేపలతో చేసే రకరకాల వంటకాలను బాగా ఆస్వాదించేవారు. కానీ మూడేళ్ల క్రితం ఆమె వీగన్‌గా మారి కుటుంబాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. పర్యావరణం పట్ల ఆమెకు ఉన్న శ్రద్ధే ఆమెను వీగన్‌గా మార్చింది.

జంతు ఉత్పత్తులను తినకుండా ఉండేవారిని వీగన్ అంటారు.

వీడియో క్యాప్షన్, వీడియో: మాంసాహారి అయిన జెన్నీ వీగన్‌గా ఎందుకు మారారు?

"పర్యావరణం కోసం నా వంతుగా నేను కూడా ఎంతో కొంత చేయాలనిపించింది. ప్రపంచంలో రైళ్లు, విమానాలు, కార్లు సహా వాహనాలన్నీ కలిపి ఎంత కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయో... మాంసం, పాల ఉత్పత్తులు కూడా అంతే కాలుష్యానికి కారణమవుతున్నాయని తెలిసినపుడు నాలో ఈ మార్పు వచ్చింది. నేనిలా మారడం వల్ల భవిష్యత్తు తరాలకోసం కూడా ఎంతో కొంత మేలు చేస్తున్నానని అనిపించింది" అని జెన్నీ అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 38,000 పశుశాలలపై ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ ఏడాది అధ్యయనం చేశారు.

పర్యావరణంపై ఆహారం ప్రభావం ఎంతగా ఉందో తెలుసుకునేందుకు 40 రకాల ఆహార పదార్థాలపై పరిశోధనలు జరిపారు. ప్రకృతి నుంచి లభించే ఆహారం కంటే పాలు, మాంసం ఉత్పత్తుల కారణంగా పర్యావరణంపై తీవ్రమైన ప్రభావం పడుతోందని వారి అధ్యయనంలో తేలింది.

గింజ ధాన్యాలు

ఫొటో సోర్స్, Getty Images

"భూగ్రహంపై కాలుష్య ప్రభావం తగ్గాలంటే మన దగ్గరున్న బలమైన ఆయుధం మన భోజనంలో మార్పులు చేసుకోవడమేనని మా పరిశోధనలో తేలింది. మాంసం, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఇది మన ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి ఖర్చవుతున్న 80 శాతం వనరులను తగ్గించడంతో సమానం" అని ఆ పరిశోధనకు నేతృత్వం వహించిన జోసెఫ్ పూరే వివరించారు.

క్యారెట్‌ చేతిలో పట్టుకున్న వ్యక్తి

ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి తీసుకుంటున్న సగటు మాంసాహారం పరిమాణం గడిచిన 50 సంవత్సరాల్లో దాదాపు రెట్టింపయ్యింది.

ప్రపంచవ్యాప్తంగా మాంసానికి పెరుగుతున్న డిమాండు కారణంగా రైతులు మాంసం ఉత్పత్తి కోసం అనేక రకాల కొత్త పద్ధతులును అవలంభిస్తున్నారు. అయితే, కాలుష్యాన్ని తగ్గించాలనే ఒత్తిడి వారిపై రోజురోజుకూ అధికమవుతోంది.

పర్యావరణ పరిరక్షణ కోసం రైతులతో పాటు, వినియోగదారులూ ఆలోచించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)