ట్రంప్: మాకు ఓటేయకపోతే 'అన్నీ కోల్పోవాల్సి వస్తుంది'

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్‌కు ప్రజల్లో ఇంకా ఏ మాత్రం ప్రజాదరణ ఉందో తెలుసుకోవడానికి ఈ మధ్యంతర ఎన్నికలను ఒక అవకాశంగా భావిస్తున్నారు

నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు కనుక విజయం సాధిస్తే 'హింసాత్మక' పద్ధతుల్లో పాత విధానాలను తీసుకువస్తారని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

సంప్రదాయ క్రైస్తవ మత పెద్దలతో సమావేశమైన ట్రంప్, తాను నేతృత్వం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీకి ఓటు వేయకుంటే 'అన్నీ కోల్పోవాల్సి వస్తుంది' అన్నారు.

మీడియాను అనుమతించకుండా క్రైస్తవ మతపెద్దలతో ట్రంప్ జరిపిన ఈ సమావేశం ఆడియో టేప్‌లు లీక్ కావడం కలకలం సృష్టిస్తోంది.

ఈ సమావేశం సందర్భంగా ట్రంప్.. మధ్యంతర ఎన్నికలు కేవలం తనకు మాత్రమే రెఫరెండం కాదని... అవి భావప్రకటనా స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులకు కూడా రెఫరెండమే అన్నారు.

మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయం సాధిస్తే తాను తీసుకున్న నిర్ణయాలన్నీ రద్దు చేసే అవకాశం ఉందని, అదీ హింసాత్మక విధానాలలో జరుగుతుందని ట్రంప్ అన్నారు. అతి వామపక్షవాదులు హింసాత్మక ప్రవృత్తి కలిగిన వారని ట్రంప్ అన్నారు.

ట్రంప్ గతంలోనూ వామపక్ష బృందాలను తీవ్రంగా విమర్శించారు.

ట్రంప్‌కు ప్రజల్లో ఇంకా ఏ మాత్రం ప్రజాదరణ ఉందో తెలుసుకోవడానికి ఈ మధ్యంతర ఎన్నికలను ఒక అవకాశంగా భావిస్తున్నారు.

ఇటీవల ట్రంప్‌కు వ్యతిరేకంగా తీవ్రమైన ప్రచారం జరుగుతోంది. ఆయన మాజీ న్యాయవాది, మాజీ ప్రచారాధికారిని ఇటీవల దోషులుగా తేల్చారు.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఈ సమావేశంలో.. క్రైస్తవ మతపెద్దలకు చాలా శక్తి ఉందని కొనియాడిన ట్రంప్, ఓటర్లను ప్రభావితం చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు.

''మీరంతా కలిసి సుమారు 20 కోట్ల మందికి బోధించగలరు'' అని ట్రంప్ వారితో అన్నారు.

మధ్యంతర ఎన్నికల్లో ఫలితాల వల్ల ఏం వెల్లడవుతుంది?

రాబోయే రెండేళ్లలో ట్రంప్ ఏ విధంగా పరిపాలన చక్కబెడతారన్నది మధ్యంతర ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి ఉంది.

మొత్తం 435 హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ సభ్యులు, 100 మంది సభ్యుల సెనేట్‌లోని 35 సీట్లు, 36 గవర్నర్ సీట్లకు మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి.

వాటిలో తమ పార్టీ విజయం సాధిస్తామని డెమోక్రాట్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)