You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన ఐన్స్టీన్ ‘థియరీ ఆఫ్ హ్యాపీనెస్’
సంతోషం మీద ఐన్స్టీన్ చెప్పిన ‘సిద్ధాంతం’ ఒక వేలంలో 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.
1922లో ఐన్స్టీన్ టోక్యో పర్యటనలో ఉండగా ఆయనకు ఒక పార్సెల్ వచ్చింది.
అప్పుడే తనకు ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చిందన్న సమాచారం ఆయనకు తెలిసింది.
ఆ పార్సిల్ ఇవ్వడానికి వార్తాహరుడు ఆయన గదికి వచ్చినపుడు, అతనికి ఇవ్వడానికి ఆయన వద్ద ఏమీ లేకపోయింది.
దీంతో ఆయన టిప్కు బదులుగా 'థియరీ ఆఫ్ హ్యాపీనెస్' పేరిట ఒక రెండు నోట్లు రాసిచ్చారు.
'నీకు అదృష్టం ఉంటే వీటి విలువ చాలా పెరుగుతుంది' అని అతనితో అన్నారు.
‘సంతోష సిద్ధాంతం’ ఏమిటి?
ఐన్స్టీన్ తన జీవితాన్ని మొత్తం సైన్స్కు అంకితం చేశారు. కానీ జీవిత లక్ష్యం నెరవేరితే దాని వల్ల ఖచ్చితంగా సంతోషం వస్తుందన్న హామీ లేదని ఐన్స్టీన్ ఆ నోట్లో పేర్కొన్నారు.
''విజయం కోసం అన్వేషణ, దాంతో పాటు వచ్చే నిరంతర అశాంతికన్నా.. ప్రశాంతమైన, వినయంతో కూడిన జీవితం ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది'' అని ఐన్స్టీన్ ఆ నోట్లో రాశారు.
రెండో నోట్లో '' మనసుంటే మార్గం ఉంటుంది'' అని క్లుప్తంగా రాశారు. అది రూ.1.6 కోట్లకు అమ్ముడుపోయిందని జెరూసలేంలో వాటిని వేలం వేసిన సంస్థ తెలిపింది.
నోట్లు రాయడానికి ఆయన టోక్యోలోని ఇంపీరియల్ హోటల్కు చెందిన పేపర్ను ఉపయోగించుకున్నారు. ఆ నోట్లు రెండూ జర్మన్ భాషలో ఉన్నాయి.
ఈ రెండు నోట్లను కొన్న వారిలో ఒకరు యూరోపియన్ కాగా, మరొకరు తన పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)