రోహింజ్యా సంక్షోభంతో పర్యావరణానికి ముప్పు
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
దక్షిణాసియాలో అతిపెద్ద శరణార్థి సంక్షోభాల్లో రోహింజ్యా శరణార్థుల సంక్షోభం ఒకటి. బంగ్లాదేశ్లో ఈ సంక్షోభం పర్యావరణానికి ముప్పు కలిగిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇటీవల దాదాపు నెల వ్యవధిలో నాలుగున్నర లక్షల మందికి పైగా రోహింజ్యా ముస్లింలు ప్రాణాలు అరచేత పట్టుకొని ఆశ్రయం కోసం మయన్మార్ నుంచి బంగ్లాదేశ్లోకి ప్రవేశించారు. వీరి కోసం ఐక్యరాజ్యసమితి, వివిధ అంతర్జాతీయ సంస్థలు, బంగ్లాదేశ్ ప్రభుత్వం సహాయ చర్యలు చేపడుతున్నాయి.

అయితే శరణార్థులు తమ ఆవాసం కోసం అడవులను నరికివేస్తుండటం లాంటి పరిణామాలతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందని అధికార యంత్రాంగంతోపాటు స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
సరిహద్దుల్లోని కాక్స్ బజార్ ప్రాంతంలో భారీ సంఖ్యలో శరణార్థులు ఉన్నారు. స్వదేశ్, జల్పతయిలి, బలుచాలి, హకీంపడా, పుతీబునియా తదితర ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటయ్యాయి.

పెద్ద సంఖ్యలో శరణార్థులు వచ్చినప్పడు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని బంగ్లాదేశ్ న్యాయశాఖ మంత్రి అనీసుల్ హఖ్ చెప్పారు. అయితే అన్నింటికన్నా మానవతావాదమే ముఖ్యమని ఆయన ఢాకాలో వ్యాఖ్యానించారు.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)





