లోన్ రికవరీ ఏజెంట్స్: అప్పు తీర్చాలంటూ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తే ఏం చేయవచ్చు, మీకున్న హక్కులేంటి

యాప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇటీవల విజయవాడలో 17 ఏళ్ల జాస్తి హరిత వర్షిణి ఆత్మహత్యతో లోన్ రికవరీ ఏజెంట్ల ప్రస్తావన వార్తల్లోకొచ్చింది. తన తండ్రి చేసిన అప్పుల వసూలు కోసం వచ్చిన బ్యాంకు రికవరీ ఏజెంట్ల తీరుతో కలత చెంది తన కూతురు ఆత్మహత్య చేసుకున్నారని మృతురాలి తల్లి ఆరోపించారు.

తన బిడ్డ మృతికి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు రికవరీ ఏజెంట్ల వేధింపులే కారణమని, వారే హరితను చంపేశారంటూ ఆమె ఆరోపిస్తూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

నెల్లూరు శాసన సభ్యులు, మాజీ మంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్‌కు ఒక లోన్ రికవరీ ఏజెంట్ నుంచి వచ్చిన ఫోన్‌కాల్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇటీవల వైరల్ అయింది. అశోక్ అనే వ్యక్తి తమ బ్యాంకు నుంచి రుణం తీసుకుని అనిల్ కుమార్ ఫోన్ నంబర్ ఇవ్వడంతో లోన్ రికవరీ ఏజెంట్లు ఆయనను 8 లక్షలు అప్పు తిరిగి చెల్లించాలని అడుగుతున్నారు. అయితే, ఈ ఆడియో కాల్ ను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

ఏపీ వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి లోన్ యాప్ నిర్వాహకులు అదే పనిగా ఫోన్లు చేయడం సంచలనంగా మారింది.

వివిధ బ్యాంకుల్లో అప్పుల రికవరీ కోసం ప్రైవేటు సంస్థలకు రికవరీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయా సంస్థల సిబ్బంది అప్పులు చెల్లించాల్సిన వారి పట్ల హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

కోవిడ్ సమయంలో చాలా చిన్న మధ్య తరహా వ్యాపారులు, ఉద్యోగస్తులు జీవితాన్ని గడిపేందుకు రుణాలు తీసుకున్నారు. అయితే, ఇందులో చాలా వరకు వ్యక్తిగత లోన్లు తీసుకున్నవారే ఎక్కువగా ఉన్నారు.

యాప్ ద్వారా లోన్లు ఇచ్చేవారు కూడా చాలా మంది మార్కెట్‌లోకి ప్రవేశించారు. అయితే, రుణాలు ఇచ్చిన తర్వాత వాటి వసూలు కోసం వారు అవలంబించే విధానాలతో చాలా మంది ప్రాణాలు తీసుకున్నట్లు కూడా వార్తలొచ్చాయి.

కానీ, ఇటీవలి కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందని లోన్ యాప్స్ పెరిగిపోయాయని హైదరాబాద్ కు చెందిన బిజినెస్ విశ్లేషకులు నాగేంద్ర సాయి అన్నారు.

వ్యక్తిగత, క్రెడిట్ కార్డు రుణాల మంజూరు, వాటి వసూలు గురించి నాగేంద్ర సాయి బీబీసీకి వివరించారు.

డబ్బు

ఫొటో సోర్స్, Getty Images

వ్యక్తిగత లోన్లను మంజూరు చేసేటప్పుడు సాధారణంగా సదరు వ్యక్తి సిబిల్ స్కోర్ లేదా ఆధార్ లాంటి వివరాలను తీసుకుని ఇస్తారు. ఇందుకు తెలిసిన వ్యక్తులు లేదా ఆ రుణం చెల్లించేందుకు హామీ ఇచ్చిన వ్యక్తుల వివరాలను కూడా తీసుకుంటారు.

బ్యాంకు నుంచి అప్పు తీసుకున్న వ్యక్తి ఆ రుణాన్ని చెల్లించలేని పక్షంలో బ్యాంకు వినియోగదారులకు నోటీసు పంపిస్తుంది.

నిబంధనలను అనుసరించి నోటీసులను పంపిన తర్వాత కూడా రుణ గ్రహీత స్పందించని పక్షంలో బ్యాంకు ఈ రుణాన్ని వసూలు చేసే బాధ్యతను లోన్ రికవరీ ఏజెంట్లకు లేదా సంస్థకు అప్పగిస్తుంది.

అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం లేకుండా రుణాలను మంజూరు చేసే యాప్స్ పై ఎవరి పర్యవేక్షణ ఉండదని సాయి అన్నారు.

"ఈ లోన్ యాప్స్ నిర్వాహకులు వినియోగదారుల ఫోన్ యాక్సెస్ తీసుకుంటారు. రుణాన్ని చెల్లించనప్పుడు కాంటాక్ట్స్ అందరికీ సమాచారం ఇవ్వడం లాంటి చవకబారు పనులకు పాల్పడుతున్న వార్తలను వింటున్నాం. ఇది వినియోగదారుల ప్రతిష్టను దెబ్బ తీయడమే కాకుండా, వారిని మానసిక వేదనకు గురి చేస్తోంది" అని సాయి అన్నారు.

"ఒక్కొక్కసారి ఎటువంటి ఆధారాలు లేకుండా అప్పులు దొరుకుతున్నాయి. అయితే, ఇలా మంజూరు చేసే రుణాలకు వడ్డీ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో, రెట్టింపు సొమ్ము చెల్లించే పరిస్థితి వస్తోంది. తిరిగి అప్పు చెల్లించడం ఇబ్బంది అయినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి" అని చెప్పారు.

రుణాల మంజూరు, ఆమోదం, వసూలు చేసే విధానం గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమావళిని రూపొందించింది.

  • రుణాలను మంజూరు చేసేటప్పుడు రుణానికి సంబంధించిన రుసుము, లోన్ దరఖాస్తు రుసుము, చెల్లింపు విధానం లాంటి వివరాలను
  • రుణాన్ని సక్రమ కాలంలో చెల్లించలేనప్పుడు, జాప్యం జరిగినప్పుడు పడే అదనపు వడ్డీ
  • ఋణం పై వసూలు చేసే వడ్డీ, వడ్డీ రేట్లలో వచ్చే మార్పులను తెలియచేయాలి.

లోన్ యాప్‌లు లేదా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నప్పుడు, రుణ గ్రహీతలు రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత రుణ గ్రహీత పై ఉంటుందని సాయి అన్నారు.

ఈ సమాచారాన్ని బ్యాంకు వెబ్ సైట్లలో పొందుపరచాలి.

డబ్బు

ఫొటో సోర్స్, Getty Images

లోన్ రికవరీ ఏజెంట్లు ఎవరు?

బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలను నిర్ణీత సమయంలో చెల్లించలేనప్పుడు బ్యాంకులు రుణాల వసూలు బాధ్యతను లోన్ రికవరీ ఏజెంట్లకు అప్పగిస్తాయి.

రుణ గ్రహీతలు సకాలంలో చెల్లించలేని రుణాలను వసూలు చేసేందుకు లోన్ రికవరీ ఏజెంట్లు బ్యాంకు తరఫున పని చేస్తారు.

ఇందుకోసం బ్యాంకులు వీరికి కొంత మొత్తం చెల్లిస్తాయి. అయితే, వీరు బ్యాంకు ఉద్యోగులు కాదు. థర్డ్ పార్టీ సిబ్బంది.

రుణాలను వసూలు చేసేందుకు బ్యాంకులు ఇలాంటి థర్డ్ పార్టీ సిబ్బందికి బాధ్యతను అప్పగిస్తాయి.

రిజర్వ్ బ్యాంకు

ఫొటో సోర్స్, Reuters

రికవరీ ఏజెంట్లు నియామకం చట్టబద్ధమేనా?

బ్యాంకులు రికవరీ ఏజెంట్లను నియమించుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్స్, అడ్వాన్సుల గురించి రూపొందించిన సర్క్యులర్‌లోని సెక్షన్ 2.5.2(i) ప్రకారం రుణాల వసూలు కోసం రికవరీ ఏజెంట్లు లేదా ఏజెన్సీలు నియమించిన సిబ్బంది ఉంటారు.

అయితే, వీరిని నియమించుకునే ముందు బ్యాంకులు సదరు వ్యక్తుల గురించి సమగ్ర విచారణ నిర్వహించాలి. పోలీసు వెరిఫికేషన్, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించాలి.

రికవరీ ఏజెంట్లు రుణాలను ఎప్పుడు వసూలు చేయవచ్చు?

రుణాలు తీసుకున్న వ్యక్తులు బ్యాంకు నోటీసులు పంపిన తర్వాత కూడా స్పందించనప్పుడు, రుణాన్ని వసూలు చేసేందుకు వివరాలను లోన్ రికవరీ సంస్థలకు ఇస్తారని కిరణ్ యశ్వంత్ చెప్పారు.

వీరికి రుణాల వసూలుకు సంబంధించి పాటించాల్సిన నిబంధనల గురించి శిక్షణ ఇస్తారు.

రుణాలు వసూలు చేసే సిబ్బందికి కూడా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ ఇచ్చే సర్టిఫికేట్ ఉండాలని హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్ లోన్ రికవరీ విభాగం ఉద్యోగి కిరణ్ యశ్వంత్ చెప్పారు.

ఆర్‌బిఐ

ఫొటో సోర్స్, Getty Images

రికవరీ ఏజెంట్లు పాటించాల్సిన నిబంధనలు ఏమిటి?

లోన్ రికవరీ ఏజెంట్లు ఋణం వసూలు చేసేందుకు వేధింపులకు పాల్పడకూడదని నిబంధనలు చెబుతున్నాయి.

ఆర్‌బీఐ జారీ చేసిన సర్క్యులర్‌ను అనుసరించి..

ఏ సమయంలో పడితే ఆ సమయంలో వినియోగదారులకు ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టకూడదు.

వీరు పొద్దున్న 7 నుంచి రాత్రి 7.30 నిమిషాల మధ్యలోనే రుణం చెల్లింపుల కోసం ఫోన్ చేయడంగానీ, ఇళ్లకు వెళ్లడంగానీ చేయాలని యశ్వంత్ చెప్పారు.

బ్యాంకులు రికవరీ ఏజెంట్ల వివరాలను రుణ గ్రహీతకు తెలియచేయాలి. లేదా, రికవరీ ఏజెంట్లు రుణం వసూలు చేసేందుకు వెళ్ళినప్పుడు బ్యాంకులు తమకు అధికారికంగా ఇచ్చిన బాధ్యతకు సంబంధించిన పత్రాలను చూపించాలి.

రికవరీ ఏజెంట్లను మార్చినప్పుడు కూడా ఆ విషయాన్ని బ్యాంకులు రుణ దాతలకు తెలియచేయాలి.

రికవరీ ఏజెంట్లు చేసే కాల్స్, సందేశాలకు సంబంధించిన వివరాలను రికార్డ్ చేయాలి.

ఈ సంభాషణను రికార్డ్ చేస్తున్నట్లు ముందుగానే రుణగ్రహీతలకు తెలియచేయాలి.

అప్పు చెల్లించాల్సిన విషయం గురించి ఫోన్ లో మెసేజీలు పంపవచ్చు. ఇది వేధింపుల కిందకి రాదు.

అప్పులు వసూలు చేసేందుకు లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరింపు చర్యలకు పాల్పడకూడదని కోర్టులు కూడా పేర్కొన్నాయి. కానీ, ఏజెంట్లు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారని చాలా ఫిర్యాదులు వినిపిస్తూ ఉంటాయి.

రుణాలను వసూలు చేసేందుకు బల ప్రయోగం చేయకూడదు.

బ్యాంకులు వీరికి కూడా లక్ష్యాలను నిర్దేశిస్తాయి.

రుణాల వసూలు చట్టబద్ధంగా మాత్రమే చేయాలని సుప్రీం కోర్టు పేర్కొంది.

ఈ నిబంధనలతో పాటు బ్యాంకింగ్ నిబంధనలు ( బీసీఎస్‌బీఐ కోడ్) పాటించాలి.

వీడియో క్యాప్షన్, లోన్ యాప్స్: అప్పు తీర్చడం ఆలస్యమైతే బూతులు తిడుతున్నారు

లోన్ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తించినప్పుడు రుణ గ్రహీతలకుండే హక్కులేంటి?

లోన్ రికవరీ ఏజెంట్లు వేధింపులకు పాల్పడినప్పుడు బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు.

పోలీసులు చర్యలు తీసుకోకపోయినా, ఫిర్యాదు నమోదు చేయకపోయినా రుణ గ్రహీతలు నేరుగా సివిల్ కోర్టులో కేసు వేయవచ్చు.

కోర్టులు లోన్ రికవరీ ఏజెంట్లను చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని ఆదేశించి ఇరు పార్టీలకు లాభదాయకంగా ఉండే విధంగా మధ్యే మార్గాన్ని సూచించే అవకాశం ఉంది.

రుణ గ్రహీతలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేయవచ్చు.

లోన్ రికవరీ ఏజెంట్లు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసే అవకాశముంది.

ఆర్‌బీఐ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సర్క్యులర్ 2.5.4 ప్రకారం ఈ నియమాలను ఉల్లంఘించి ప్రవర్తించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఆ సంస్థ పేర్కొంది.

ఇలా జరిగిన ఫిర్యాదులు వచ్చినప్పుడు బ్యాంకులు ఆ ప్రాంతాల్లో రికవరీ ఏజెంట్లను నియమించుకోవడాన్ని కొంతకాలం పాటు నిషేధించవచ్చు. ఈ నిషేధాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది.

ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు హైకోర్టులు, లేదా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా, జరీమానా విధించినా కూడా ఆర్‌బీఐ పర్యవేక్షించే అధికారాలను కలిగి ఉంటుంది.

ఈ నిబంధనలను బ్యాంకులు తరచుగా సమీక్ష చేస్తూ ఉండాలి.

వీడియో క్యాప్షన్, ఏపీ: మంత్రికి, మాజీ మంత్రికి తప్పని లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు

బ్యాంకులు రుణ గ్రహీతల ఫిర్యాదులు స్వీకరించినప్పుడు ఆ కేసులను పరిష్కరించే వరకూ లోన్ రికవరీ ఏజెంట్లను పంపకూడదు.

రుణ గ్రహీతలు అనవసర ఫిర్యాదులు చేస్తున్నట్లు బ్యాంకు భావించినప్పుడు రుణాన్ని వసూలు చేసే ప్రక్రియను కొనసాగించవచ్చు.

వ్యక్తిగత లోన్లు, క్రెడిట్ కార్డు లోన్స్ రూ.10 లక్షల లోపు ఉన్నప్పుడు ఆ కేసులను లోక్ అదాలత్‌కు రిఫర్ చేయవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది.

బ్యాంకులు వ్యక్తిగత లోన్‌లను రికవరీ చేసేందుకు లోక్ అదాలత్ సహాయం తీసుకోవచ్చని సూచించింది.

అవసరమైనప్పుడు బ్యాంకులు రుణ గ్రహీతలకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు క్రెడిట్ కౌన్సిలర్లను కూడా నియమించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)