గుజరాత్: కాన్పు సమయంలో చనిపోయిన భార్యాబిడ్డల కోసం ఈ భర్త ఏం చేశారో తెలుసా

ఫొటో సోర్స్, Srinath Solanki
- రచయిత, లక్ష్మి పటేల్
- హోదా, బీబీసీ గుజరాతీ
"నీ కంటే ముందు నేనే ప్రాణాలు వదిలేస్తాను. నా ప్రాణాలు పోతున్న సమయంలో నువ్వు కన్నీరు కార్చకు. బాజాభజంత్రీలతో పెళ్లికి వచ్చిన మాదిరిగానే నన్ను స్మశానానికి తీసుకుని వెళ్లు"..
ఈ మాటలను జునాగఢ్కు చెందిన మోనిక సోలంకి తన భర్తతో చెప్పారు. పెళ్లయిన 5 సంవత్సరాలకే ఆమె అకాల మరణం చెందారు.
దీంతో భార్య కోరిక మేరకు ఆమె అంతిమ సంస్కారాలను నిర్వహించేందుకు ఆ భర్త భాజాభజంత్రీలతో ఊరేగింపుగా స్మశానానికి వెళ్లారు.
జునాగఢ్కు చెందిన 30 ఏళ్ల శ్రీనాథ్ సోలంకి ఫోటోగ్రాఫర్. ఆయన భార్యకు, పుట్టిన వెంటనే మరణించిన పసికందుకు భాజా భజంత్రీలతో, సంగీతంతో తుది వీడ్కోలు పలికారు. ఆమె కళ్లను కూడా దానం చేశారు.

ఫొటో సోర్స్, Srinath Solanki
వీరి ఐదేళ్ల వైవాహిక జీవితం, పదేళ్ల ప్రేమ కథ, అకస్మాత్తుగా జరిగిన తుది ప్రయాణానికి వెనుక ఒక తెలియని విషయం దాగి ఉంది.
"ఒకసారి నేను నా భార్య సరదాగా మాట్లాడుకుంటూ, నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళాక నువ్వు ఏడుస్తావని అన్నాను. ఆ మాటలు విని, నీ కంటే ముందు నేను చనిపోతాను. నేను చనిపోయినప్పుడు మాత్రం నువ్వు కన్నీళ్లు కార్చకు. మన పెళ్ళికి బ్యాండు మేళంతో వచ్చిన మాదిరిగానే నన్ను సాగనంపు" అని మోనిక చెప్పారని శ్రీకాంత్ బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.
"మోనిక మరణం తర్వాత నాకు ఆమె మాటలు గుర్తొచ్చాయి. అందుకే, నా భార్యను బ్యాండు మేళంతో స్మశానానికి తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఆమెతో పాటు పురిట్లోనే చనిపోయిన పసికందును కూడా తీసుకుని వెళ్లాను. ఇలా చేయాలని నా కుటుంబంతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాను. మేమెవరి గురించి పట్టించుకోలేదు. కానీ, మోనిక అంతిమ యాత్రలో కొన్ని వేల మంది పాల్గొన్నారు" అని చెప్పారు.
"మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తాను. నేను మోనిక కజిన్ పెళ్ళికి ఫొటోగ్రఫీ అసైన్ మెంట్కు వెళ్లాను. అక్కడే మా ఇద్దరికీ పరిచయమైంది. ఆ తర్వాత నా ఫోన్ నంబర్ తీసుకుని మోనిక నాతో మాట్లాడింది" అని అని శ్రీనాథ్ చెప్పారు.
"కొన్ని రోజుల పాటు మాట్లాడిన తర్వాత వివాహ ప్రతిపాదన వచ్చింది. అప్పటికి నాకు 20, మోనికకు 19 ఏళ్ళు. అప్పటికి నాకు చట్టప్రకారం వివాహం చేసుకునే వయసు కూడా లేదు".
"మేమిద్దరం ఒకే కులానికి చెందిన వాళ్ళం. 2013 అక్టోబరులో పెళ్లి నిశ్చితార్ధం జరిగింది. జనవరి 01 2017లో మా పెళ్లి జరిగింది" అని శ్రీకాంత్ ఆయన ప్రేమ, పెళ్లి గురించి బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, Srinath Solanki
రక్తదాన శిబిరం
పెళ్ళైన ఐదేళ్ల తర్వాత మేము పిల్లల్ని కనాలని అనుకున్నాం. మేము కోరుకున్నట్లే మాకు అమ్మాయి పుట్టింది. కానీ, పుట్టిన కొన్ని క్షణాలకే కళ్ళు మూసింది" అని శ్రీకాంత్ చెప్పారు.
జులై 7న మోనికకు సీమంతం జరిగింది. సీమంతం జరిగిన రెండు రోజుల తర్వాత మోనిక తండ్రి వచ్చి తనతో పాటు పుట్టింటికి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత జరిగిన వైద్య పరీక్షల్లో అన్నీ సాధారణంగానే ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి.
"మోనికకు సినిమాలు చూడటమంటే చాలా ఇష్టం. మోనిక గత వారం నాకు కాల్ చేసి కొత్త గుజరాతీ సినిమా చూడాలని ఉన్నట్లు చెప్పింది. జులై 16న ఆమె వెరావల్లోని సినిమా చూసేందుకు థియేటర్ మొత్తాన్ని బుక్ చేసింది. మొత్తం థియేటర్లో మేమిద్దరం మాత్రమే సినిమా చూశాం.
"గత గురువారం సుమారు 12.30 నిమిషాలకు మా మామగారు ఫోన్ చేసి మోనిక ఆరోగ్యం బాలేదని ఫోన్ చేసి చెప్పారు. మేం వెంటనే వెరావల్ బయలుదేరి వెళ్లాం. దారిలోనే మోనిక ప్రాణాలతో లేదనే సమాచారం అందింది" అని చెప్పారు.
"మోనికకు రక్త పోటు పెరిగి బ్రెయిన్ స్ట్రోక్కు దారి తీసింది. కడుపులో బిడ్డను కాపాడాలని డాక్టర్ ప్రయత్నించారు, కానీ, పుట్టిన మూణ్నాలుగు నిమిషాలకు పసి కందు కూడా ఇన్ఫెక్షన్ సోకి చనిపోయింది" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Srinath Solanki
మోనిక కళ్ళను దానం చేశారు. బేసానలో రక్త దాన శిబిరం నిర్వహించారు.
"బేసానలో ఈ కార్యక్రమానికి వచ్చి రక్త దానం చేస్తారో చేయరోనని చాలా కంగారు పడ్డాం. కానీ, ఈ శిబిరంలో 37 మంది రక్త దానం చేశారు" అని శ్రీనాథ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మీర్ సుల్తాన్ ఖాన్: ఒక భారతీయ సేవకుడు బ్రిటన్ సామ్రాజ్య చెస్ ఛాంపియన్ ఎలా అయ్యాడు?
- మనీషా రూపేటా: పాకిస్తాన్లో డీఎస్పీ అయిన తొలి హిందూ మహిళ
- ఎలాన్ మస్క్: అఫైర్ వివాదంలో టెస్లా అధినేత
- పాకిస్తాన్ ఆదాయంలో 40 శాతం వడ్డీలకే... ఈ దేశం మరో శ్రీలంక అవుతుందా?
- మంకీపాక్స్: 'జననేంద్రియాలపై కురుపులు... దుస్తులు ధరిస్తే తట్టుకోలేనంత మంట'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












