జుగాడ్ జీప్ను ఇచ్చి బొలెరో తీసుకున్న దత్తాత్రేయ.. హామీ నెరవేర్చుకున్న ఆనంద్ మహీంద్ర

ఫొటో సోర్స్, Sarfaraj sanadi
ఎట్టకేలకు దత్తాత్రేయ లోహర్ తన జుగాడ్ జీపును ఆనంద్ మహీంద్రాకు ఇవ్వడానికి అంగీకరించారు.
ఆ జీపును తమ కంపెనీకి ఇస్తే, బదులుగా కొత్త బొలేరో కారును ఇస్తామని ఆనంద్ మహీంద్రా ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కానీ, కొత్త కారు నడిపే స్థోమత తనకు లేదని, ఆ భారాన్ని మోయలేనని మొదట్లో దత్తాత్రేయ ఆ ఆఫర్కు ఒప్పుకోలేదు.
అయితే, జుగాడ్ జీపును రిసెర్చ్ కోసం తమ కంపెనీలో ఉంచుతామని ఆనంద్ మహీంద్ర చెప్పడంతో, తన కుటుంబ సభ్యులతో చర్చించి దత్తాత్రేయ జీపును వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
సోమవారం సాంగ్లీలోని మహీంద్రా షోరూమ్లో కేంద్ర మాజీ మంత్రి ప్రతీక్ పాటిల్, కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశాల్ పాటిల్ సమక్షంలో వాహనాల ఎక్స్ఛేంజ్ కార్యక్రమం జరిగింది.
దత్తాత్రేయ లోహర్ తన జుగాడ్ జీపును మహీంద్ర కంపెనీకి ఇచ్చి, బదులుగా కొత్త బొలేరో కారును పొందారు.
దత్తాత్రయ లోహర్ కొన్ని నెలల క్రితం ఈ జీపును నిర్మించినప్పుడు, దీనిపై దేశమంతా చర్చ జరుగుతుందని బహుశా అతను కూడా ఊహించలేదు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన జుగాడ్ జీప్ను ఎంతో మంది చూశారు.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే, కొత్త సాంకేతికతలను ప్రోత్సహించే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను ట్వీట్ చేసి, దత్తాత్రేయకు ఆఫర్ ఇచ్చారు.
అప్పటి నుండి, దత్తాత్రయ 'జుగాడ్ జీప్' చూడటానికి చాలా మంది దేవరాష్ట్రే గ్రామాన్ని సందర్శించారు. బీబీసీ మరాఠీ ఆ గ్రామానికి వెళ్లి ఈ 'జుగాడ్ మాన్'ని కలిసింది.
'ఈ జుగాడ్ జీపు స్ఫూర్తినిస్తుంది'
''నిజం చెప్పాలంటే, వాహనం తయారీలో పాటించే ఎలాంటి నియమాలు కూడా ఈ జీపులో లేవు. కానీ పట్టుదల, సృజనాత్మకత, తక్కువ వనరులతో ఎక్కువ ప్రయోజనాన్ని రాబట్టే వ్యక్తుల తెలివిని నేను ప్రశంసించకుండా ఉండలేను. ఇక జీపుకున్న ఫ్రంట్ గ్రిల్ గురించి అయితే చెప్పక్కర్లేదు'' అని మహీంద్రా ట్వీట్ చేశారు.
వీడియోలో కనిపిస్తోన్న జీపు ఫ్రంట్ గ్రిల్ సరిగ్గా 'మహీంద్రా అండ్ మహీంద్రా' కంపెనీ జీప్ మోడల్ను పోలి ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మరుసటి రోజు, డిసెంబర్ 22న ఆనంద్ మహీంద్రా మరో ట్వీట్ చేశారు. ''నిబంధనలకు లోబడి లేనందుకు స్థానిక అధికారులు, ఆ జీపును ఉపయోగించకుండా వారిని అడ్డుకుంటారు. కాబట్టి దాన్ని నాకు ఇస్తే, ప్రతిగా బొలెరో వాహనాన్ని వారికి ఇస్తాను. 'రీసోర్స్ఫుల్నెస్'.. అంటే తక్కువ వనరులను ఉపయోగించి ఎక్కువ సృష్టించడం. దీన్నుంచి స్ఫూర్తి పొందేందుకు, ఆ జీపును మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో భద్రంగా ఉంచుతాం'' అని ఆయన ట్వీట్ చేశారు.
తొలుత తిరస్కరించిన దత్తాత్రేయ
దేవ్రాష్ట్రే గ్రామం సంగ్లీ జిల్లా కడెగావ్ తాలూకాలో ఉంది. మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్రావు చౌహాన్ కూడా ఇదే గ్రామానికి చెందినవారు. యశ్వంత్రావు చౌహాన్ తమ గ్రామానికి చెందిన వారు కావడం దత్తాత్రేయ గర్వంగా భావిస్తారు.
మహీంద్రా ఇచ్చిన బొలెరో వాహనం ఆఫర్ గురించి దత్తాత్రేయను గతేడాది డిసెంబర్లో బీబీసీ అడిగింది.
ఆయన ఇచ్చిన ఆఫర్ను ఒప్పుకోవాలో లేక తిరస్కరించాలో అనే విషయంలో వారి కుటుంబం సందిగ్ధంలో పడింది.
''వారికి నా వాహనం నచ్చడం సంతోషంగా ఉంది. కానీ కొత్త కారును ఉపయోగించే పరిస్థితుల్లో నేను లేను. దానికి పన్నులు చెల్లించే స్థోమత నాకు లేదు'' అని దత్తాత్రేయ అప్పట్లో అన్నారు.

ఫొటో సోర్స్, Sarfaraj
బైక్ ఇంజిన్, ఆటోరిక్షా టైర్లు
ఈ జుగాడ్ జీపు కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
కమ్మరి పని చేసే కుటుంబంలో దత్తాత్రేయ జన్మించారు. వారి కుటుంబంలో వస్తువులు తయారు చేసే నైపుణ్యం ఉంది. అయితే దత్తాత్రేయ మాత్రం వారసత్వంగా వచ్చిన పనిని స్వీకరించలేదు. ఆయన ఫ్యాబ్రికేషన్ వర్క్షాప్ను ఏర్పాటు చేసుకున్నారు. గతంలో కూడా ఆయన విండ్మిల్ మెషీన్ను తయారు చేశారు.
వర్క్షాప్లో పోగైన తుక్కు పదార్థాలు, విడి భాగాలతో మూడేళ్లలో ఆయన ఈ జీపును తయారు చేశారు. ఇందులో బైక్ ఇంజిన్తో పాటు ఆటోరిక్షా టైర్లు, జీపు బానెట్ను ఉపయోగించినట్లు ఆయన చెప్పారు.
జీపుకు మొత్తం 50 నుంచి 60 వేల వరకు ఖర్చు అయిందని దత్తాత్రేయ చెప్పారు.
''నేను సంపాదించే దానిలో కొంత మొత్తాన్ని పొదుపు చేసి ఈ జీపును తయారు చేశాను. మా గ్రామంలోనే నాకు ఒక చిన్న వర్క్షాప్ ఉంది. నేను కలుపు తీయడం, సానబెట్టడం లాంటి పనులతో పాటు వెల్డింగ్ వర్క్ కూడా చేస్తాను. ఆ జీపుపైన ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నావని అందరూ అడిగేవారు'' అని దత్తాత్రేయ చెప్పుకొచ్చారు.
దత్తాత్రేయకు భార్యతో పాటు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ''మనందరం కూర్చొని వెళ్లడానికి ఒక వాహనం కావాలని నా కూతుర్లు అడిగారు. కానీ వాహనం కొనే స్థోమత లేదని నాకు తెలుసు. అందుకే నేనే జీపును తయారు చేస్తానని వారికి చెప్పాను'' అని దత్తాత్రేయ తెలిపారు. అందుకే తమ కుటుంబానికి సరిపోయే స్థాయిలో నానో జీపును తయారు చేశానని అన్నారు.
తన పిల్లల కోరికే అయినప్పటికీ, దాన్ని పూర్తి చేయడానికి దత్తాత్రేయ పట్టుదలను ప్రదర్శించారు.

ఫొటో సోర్స్, SARFARAJ MUSASNADI
జుగాడ్ జీప్ ఫీచర్లు
జీపుకు స్టార్టర్ లేదు కాబట్టి కిక్ కొడుతూ దాన్ని స్టార్ట్ చేయాలి. మరో విశేషమేంటంటే... దాని స్టీరింగ్ను వారి ఫ్యాబ్రికేషన్ వర్క్షాప్లోనే అమర్చారు.
సాధారణంగా భారత్లో వాహనాలన్నింటికీ స్టీరింగ్ కుడివైపు ఉంటుంది. కానీ దత్తాత్రేయ తయారు చేసిన జీపులో మాత్రం దాన్ని ఎడమ వైపుకు అమర్చారు. ఎందుకంటే దత్తాత్రేయ ఎడమ చేయి బలహీనంగా ఉండటంతో సులువుగా నడిపేందుకు వీలుగా తనకు అనువుగా జీపును డిజైన్ చేసుకున్నారు.
మహీంద్రా జీపుతో పోల్చితే జుగాడ్ జీపు పరిమాణం చిన్నగా, ఆర్డినరీ రిక్షాలా ఉంటుంది. అందులో ఒకేసారి ఐదుగురు కూర్చోవచ్చు. అది జుగాడ్ జీపే అయినప్పటికీ, దాని వేగం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పెట్రోల్ కోసం 5 లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేశారు. లీటర్ పెట్రోల్కు 40 నుంచి 50 కి.మీ వరకు మైలేజ్ ఇస్తోంది. గంటకు 40 కి.మీ వేగంతో ఈ జీపు ప్రయాణిస్తుంది.
జీపుకు ఇంకా రంగులు వేయాల్సి ఉందని దత్తాత్రేయ చెప్పారు. గత మూడు నెలలుగా ఇంటి పనులు, కుటుంబం కోసం జీపును వాడుతున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)













