‘ఆంధ్రప్రదేశ్‌లో క్లారిటీ ఉన్న నాయకుడు వైఎస్ జగనే’ - మంత్రి కన్నబాబు

వీడియో క్యాప్షన్, ‘ఏపీలో క్లారిటీ ఉన్న నాయకుడు వైఎస్ జగనే’ - మంత్రి కన్నబాబు

శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం క్లారిటీ ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, ఆయన తీసుకునే నిర్ణయాల్లో ఎలాంటి గందరగోళం లేదని, ముందు ఒక మాట, తర్వాత ఒక మాట ఏమీ లేవని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.

అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, కానీ.. తాము, తమవాళ్లు మాత్రమే బాగుండాలని చంద్రబాబు నాయుడు ఒక ఉద్యమాన్ని ప్రారంభించారని ఆరోపించారు.

ప్రతిపక్షంలో ఉండగా అమరావతి రాజధాని నగరానికి కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని జగన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యను ప్రస్తావించగా.. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కాగితాలపై డిజైన్లు గీసి, ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చేశారని ఆరోపించారు.

‘అమరావతిలో రాజధాని లేదని ఎవరు చెప్పారు? అమరావతి నుంచి రాజధానిని ఎవరు ఎత్తేశారు?’ అని ప్రశ్నిస్తూ.. తాము అమరావతిని రాజధానిగా తొలగించలేదని, శాసన వ్యవహారాలన్నీ అమరావతి నుంచే జరుగుతాయని వెల్లడించారు.

కానీ, మొత్తం అమరావతిలోనే ఉండాలని ప్రతిపక్షం కోరుతోందని.. ‘కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి నిర్ణయం తీసుకునే అధికారం ఉండదా.. వాళ్లు ఏం చెబితే అది వినాలా? వాళ్ల ఇష్టమా?’’ అని కన్నబాబు ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు గ్రాఫిక్స్‌లోనే గడిపేసిందని ఆరోపిస్తున్న జగన్ ప్రభుత్వం వచ్చి కూడా రెండున్నరేళ్లు గడిచింది కదా, ఏం చేశారు? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. తాము తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయకుండా న్యాయస్థానాల్లో అడ్డుకున్నారని కన్నబాబు చెప్పారు. ఒక్క అడుగు కూడా ముందుకు పడకుండా చేసింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు.

చట్టంలో సాంకేతికంగా లోపం ఉందని ప్రభుత్వం అంగీకరించింది కదా.. అని అడగ్గా.. చట్టంలో లోపం ఉందని తాము చెప్పలేదని, ఇంకా సమగ్రంగా తమారు చేయాల్సి ఉందని మాత్రమే చెప్పామన్నారు.

కొత్త చట్టం ఎప్పటికి వస్తుంది? మండలి రద్దును ఎందుకు ఉపసంహరించుకున్నారు? మాట తప్పడం.. మొదలైన ప్రశ్నలకు కన్నబాబు ఏమని సమాధానాలు ఇచ్చారో వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)