కోవిడ్ వ్యాక్సీన్: టీకా తీసుకున్నా వైరస్ సోకడం దేనికి సూచిక.. వ్యాక్సినేషన్కు ఇది సవాలుగా మారనుందా

ఫొటో సోర్స్, PALLAVA BAGLA
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
దిల్లీకి చెందిన ఒక సైన్సు జర్నలిస్ట్ పల్లవ బాగ్లాకు వ్యాక్సీన్ తీసుకున్న 3 వారాల తరువాత జ్వరం, గొంతు నొప్పి మొదలయ్యాయి. ఆయన వయసు 58 ఏళ్లు.
ఏప్రిల్ 22న ఆయనకు కోవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. నాలుగు రోజుల తర్వాత సీటీ స్కాన్ చేయించుకోగా ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలింది.
బాగ్లాకు జ్వరం తగ్గక పోవడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. కోవిడ్ లక్షణాలు కనిపించిన 8 రోజులకు ఆయన ఆసుపత్రిలో చేరారు.
రక్త పరీక్షలు చేసి స్టెరాయిడ్లు ఇచ్చారు. మధుమేహం కూడా ఉండటంతో షుగర్ లెవెల్స్ బాగా పెరిగి పోయాయి. ఆక్సిజన్ స్థాయి పడిపోలేదు.
ఎనిమిది రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత బాగ్లా కోలుకున్నారు. ఇంటికి వెళ్లే ముందు డాక్టర్లు.. మధుమేహం ఉన్న, వ్యాక్సీన్ తీసుకోని ఆయన వయసు మరో వ్యక్తి స్కానింగ్ రిపోర్టులను బాగ్లా రిపోర్టులతో పోల్చి చూపించారు.
"రెండు స్కానింగ్ రిపోర్టుల మధ్య తేడా స్పష్టంగా కనిపించింది. ఒక వేళ వ్యాక్సీన్ తీసుకోకుండా ఉండి ఉంటే నేను వెంటిలేటర్ పైకి వెళ్లాల్సి వచ్చి ఉండేదని డాక్టర్లు చెప్పారు. సరైన సమయానికి పూర్తి వ్యాక్సినేషన్ తీసుకోవడం నన్ను కాపాడింది" అని బాగ్లా చెప్పారు.
భారతదేశంలో 3 శాతం ప్రజలకు వ్యాక్సీన్ ఇచ్చినప్పటికీ వ్యాక్సీన్ తీసుకున్న 2 వారాల తర్వాత ఇన్ఫెక్షన్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితిని ఇప్పటివరకు ఎక్కువగా డాక్టర్లు, నర్సులు లాంటి వైద్య సిబ్బంది ఎదుర్కొన్నారు.
బాగ్లాకు సోకిన ఇన్ఫెక్షన్కు కారణమైన వైరస్ జెనెటిక్ కోడ్ ఛేదించేందుకు శాస్త్రవేత్తలు ఆయన ముక్కు, గొంతు నుంచి శాంపిళ్లు తీసుకున్నారు.

ఫొటో సోర్స్, REUTERS
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు కొత్తగా ఇన్ఫెక్షన్లు సోకకుండా నిరోధించగలుగుతున్నాయా అనేది తేల్చేందుకు ఆయన నుంచి శాంపిళ్లు తీసుకున్నారు.
కరోనా వైరస్ వ్యాక్సీన్లు ప్రభావవంతమైనవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవి ఇన్ఫెక్షన్ను పూర్తిగా నిరోధించలేనప్పటికీ అవి అనారోగ్యం తీవ్ర కాకుండా ఆపడంతో పాటు కోవిడ్ వల్ల చనిపోకుండా కూడా ఆపగలవు. ప్రమాదకరమైన వైరస్ వేరియంట్ల నుంచి అవి రక్షించగలవు.
కానీ, వ్యాక్సిన్లు 100 శాతం ప్రభావవంతమైనవని చెప్పలేం. "ఈ పరిస్థితుల్లో వ్యాక్సీన్ తర్వాత కలిగే ఇన్ఫెక్షన్లు" రావడం పూర్తిగా ఊహించిన పరిణామమే.

ఫొటో సోర్స్, EPA
అమెరికాలో పరిస్థితి ఎలా ఉంది?
అమెరికాలో ఏప్రిల్ 26 వరకు 9.5 కోట్ల మంది ప్రజలు పూర్తిగా వ్యాక్సీన్ తీసుకున్నారు. అందులో 9,045 మందికి వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ సోకినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది.
అందులో 835 (9 శాతం) మంది ఆసుపత్రిలో చేరగా 132 (1 %) మంది మరణించారు. ఆసుపత్రిలో చేరిన మూడింట ఒక వంతు మంది రోగులు, 15 శాతం మరణాలు కోవిడ్ లక్షణాలు కనిపించకుండా కానీ, కోవిడ్ సంబంధం లేనివి కానీ ఉన్నాయి.
భారతదేశంలో ఈ అంశానికి సంబంధించిన వివరాల విషయంలో స్పష్టత లేదు.
వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా కోవిడ్ బారిన పడిన డాక్టర్ల గురించి చాలా రిపోర్టులు బయటకు వస్తున్నాయి. కొన్ని మరణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ మరణాలకు కోవిడ్ ఇన్ఫెక్షన్కు సంబంధం ఉందా అనేది స్పష్టం కాలేదు.
భారతదేశంలో వ్యాక్సినేషన్ జరిగిన ప్రతి 10,000 మందిలో ఇద్దరు నుంచి నలుగురికి ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ, ఈ సమాచారం పూర్తిగా అందుబాటులో లేదు.
గత మూడు నెలలుగా పరీక్షలు జరుగుతున్న వారు వ్యాక్సీన్ తీసుకున్నారో లేదో వివరాలు సేకరించడం లేదు. ఆసుపత్రుల నుంచి లభిస్తున్న ఆధారాలు భిన్నంగా ఉన్నాయి.
తమిళనాడులో రెండు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సీన్ తీసుకున్న వైద్య సిబ్బందిలో చాలా కొంత మందికి మాత్రమే ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలిపినట్లు అమెరికాలోని మేయో క్లినిక్ ప్రొఫెసర్ విన్సెన్ట్ రాజ్ కుమార్ చెప్పారు. "వ్యాక్సీన్ తీసుకున్న వారు త్వరగా కోలుకున్నారు" అని ఆయన నాకు చెప్పారు.
మరో వైపు దిల్లీలోని అతి పెద్ద కోవిడ్ హాస్పిటల్ లోక్ నాయిక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 60 శాతం మంది డాక్టర్లు వ్యాక్సీన్ తీసుకున్నాక ఇన్ఫెక్షన్కి గురయ్యారు. కొంత మంది వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫెక్షన్ సోకి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది" అని క్రిటికల్ కేర్ నిపుణురాలు డాక్టర్ ఫరా హుస్సేన్ చెప్పారు.

ఫొటో సోర్స్, REUTERS
దిల్లీలో మరో ఆసుపత్రి ఫోర్టిస్ సి- డాక్ నిర్వహించిన ఒక అధ్యయనంలో.. 113 మంది వైద్య సిబ్బంది వ్యాక్సీన్ తీసుకోగా అందులో 15 మందికి రెండు వారాల తర్వాత ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలిసింది. అందులో 14 కేసుల్లో తేలికపాటి లక్షణాలే ఉన్నట్లు తెలిపింది. . అందులో ఒక్కరికి మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం వచ్చింది.
"ముఖ్యంగా వైద్య సిబ్బందిలో వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్లు సోకడాన్ని ఎక్కువగా చూస్తున్నాం. కానీ, అవి తేలికపాటి లక్షణాలతోనే ఉంటున్నాయి" అని ఈ రిపోర్టు సహ రచయత, డయాబెటాలజిస్ట్ డాక్టర్ అనూప్ మిశ్రా చెప్పారు.
ఇటీవల ఒక అధ్యయనం కోసం పూర్తిగా వ్యాక్సీన్ డోసులు తీసుకుని ఇన్ఫెక్షన్కు గురైన వైద్యరంగ సిబ్బంది నుంచి శాంపిళ్లను సేకరించారు. అందులో ఇద్దరికి శరీర రోగ నిరోధక శక్తిని తట్టుకోలేని వైరస్ మ్యుటేషన్లు ఇన్ఫెక్ట్ అవ్వగా, మిగిలిన ఎవరికీ తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకలేదని ప్రముఖ జెనెటిసిస్ట్ డాక్టర్ వినోద్ స్కారియా చెప్పారు.
అయితే, సాధారణ జనాభాలో తలెత్తుతున్న ఇన్ఫెక్షన్లు, వ్యాక్సిన్ల పని తీరు గురించి తెలుసుకోవడానికి, మరింత సమాచారం అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత చాలా మంది ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారనే ప్రశ్నను చాలా మంది అడుగుతున్నట్లు వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్ చెప్పారు.

వ్యాక్సీన్ తీసుకోకపోతే ఏమవుతుంది?
భారతదేశంలో రోజువారీ కేసులు తగ్గడం వల్ల హెర్డ్ ఇమ్మ్యూనిటీ స్థాయికి చేరడానికి చాలా సమయం పడుతుంది. వ్యాక్సీన్ తీసుకోవడానికి సుముఖత చూపించకపోవడం మరింత దారుణమైన పరిస్థితులకు దారి తీస్తుంది.
వ్యాక్సీన్ తీసుకోకపోవడం వల్ల భారతదేశంలో సెకండ్ వేవ్లో వచ్చిన వైరస్ మ్యుటేట్ కావడం సులభం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వైరస్ రకాలు వ్యాక్సీన్లు అందించే రోగ నిరోధక శక్తిని కూడా తప్పించుకోగలవు.
భవిష్యత్తులో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోవడానికి సిద్ధమవడానికి వైరల్ అయ్యే మ్యుటేషన్లను సీక్వెన్సింగ్ చేయడమే కీలకం.
అయితే, వ్యాక్సీన్లు మాత్రం ఇన్ఫెక్షన్ సోకినవారు తీవ్రంగా జబ్బు పడకుండా లేదా ఆసుపత్రి పాలు కాకుండా మాత్రం కాపాడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
టీకాలు తీసుకున్నవారికి ఇన్ఫెక్షన్ సోకి.. వారి నుంచి కూడా ఇతరులకు ఇన్ఫెక్షన్ వ్యాపించే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వీరు కూడా మాస్కులు ధరించడం మానకూడదు. అంతే కాకుండా, రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం, గాలి, వెలుతురు లేని ప్రదేశాలు, లేదా ఏసీ ప్రదేశాల్లో ఎక్కువ సేపు ఉండటం లాంటివి చేయకూడదు.
కేరళ రాష్ట్రంలో చేసినట్లు రెండు మాస్కులు ధరించడం తప్పనిసరి చేయాలి. ప్రభుత్వం నుంచి వస్తున్న వైద్య సందేశాలు అయోమయానికి గురి చేయకుండా స్పష్టంగా ఉండాలి. వ్యాక్సీన్ తీసుకున్న వారు ఇళ్లల్లో, పని స్థలాల్లో అందరితో కలవచ్చా లేదా అనే సందేశం సూటిగా ఉండాలి.
"వ్యాక్సీన్లు పని చేస్తాయి. కానీ, అవి తీసుకోవడం నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి జాగ్రత్తలు పాటించకపోవడానికి లైసెన్సు కాదు. వ్యాక్సీన్లు తీసుకున్నప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలి" అని బాగ్లా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: చైనాకు పాకిన ఇండియన్ వేరియంట్ B1617.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
- కోవిడ్: కలవరపెడుతున్న రంజాన్ షాపింగ్.. ఇసుకేస్తే రాలనట్లుగా పాతబస్తీ రోడ్లు
- కోవిడ్-19: DRDO కనిపెట్టిన '2-DG' ఔషధం కరోనావైరస్ను ఎదుర్కొనే బ్రహ్మాస్త్రం కాబోతోందా?
- భారత్లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ‘మా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది చనిపోయారు.. ఏమీ చేయలేకపోయాను’
- కరోనావైరస్: సెకండ్ వేవ్లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- కోవిడ్: ప్రోనింగ్ అంటే ఏమిటి.. కరోనా రోగులకు ఆక్సిజన్ అవసరమైనప్పుడు ఈ పద్ధతితో ప్రాణాలు కాపాడవచ్చా
- కోవిడ్ టెస్ట్లకు వాడిన కిట్లను శుభ్రం చేసి తిరిగి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








