నిర్మలా సీతారామన్ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగులకేనా, ప్రైవేటు రంగాల్లో వారికి కూడా ప్రయోజనం ఉంటుందా

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP via Getty Images
- రచయిత, ఆలోక్ జోషి
- హోదా, మాజీ ఎడిటర్, సీఎన్బీసీ ఆవాజ్
నిన్న, అంటే 12.10.2020 సోమవారం అర్థశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం ప్రకటించిన రోజునే భారత ఆర్థికమంత్రి ఒక ప్రకటన చేశారు.
అది గత ఏడాది ఇదే అవార్డు అందుకున్న భారత సంతతి ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, ఆయన సహచరి, జీవిత భాగస్వామి ఎస్తర్ డుఫ్లో చెప్పిన దానిని గుర్తు చేయడం యాదృచ్చికమే కావచ్చు.
నిర్మలా సీతారామన్ సోమవారం చేసిన ప్రకటనతో లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులు, షాపుల వారు, పారిశ్రామికవేత్తలు, పెద్ద వ్యాపారులు అందరూ సంతోషించి ఉంటారు.
ప్రభుత్వం డబ్బులు నేరుగా ప్రజల జేబుల్లోకి చేరేలా ఏర్పాట్లు చేయాలని కోరిన ఆ ఆర్థికవేత్తలు కూడా ఆనందించే ఉంటారు.
ఆర్థిక మంత్రి ప్రభుత్వ ఉద్యోగులకు రెండు సౌకర్యాలు అందిస్తున్నట్లు చెప్పారు.
ఒకటి-ఉద్యోగులకు పది వేల రూపాయల వరకూ వడ్డీ లేని రుణం ఇవ్వడం.
రెండు-సెలవు తీసుకుని ఎక్కడికైనా వెళ్లడానికి ఇచ్చే లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) చెల్లింపులను ఈసారీ ఎక్కడికీ వెళ్లకపోయినా ఇస్తామనడం.
ఈ రెండు ప్రయోజనాలు పొందాలంటే ఒక షరతు ఉంది. వారు ఆ మొత్తం 2021 మార్చి 31 లోపు ఖర్చు చేయాలి. అది కూడా జీఎస్టీ రేటు 12 శాతం లేదా అంతకు మించిన వాటిపైనే మొత్తం ఖర్చు చేయాలి.

ఫొటో సోర్స్, Robert Nickelsberg/Getty Images
కరోనా సమయంలో మిడిల్ క్లాస్కు ఉపశమనం
ఈ కొనుగోళ్లకు కేవలం డిజిటల్ చెల్లింపులే ఉపయోగించాలి. నగదు కొనుగోళ్లపై ఈ ప్రయోజనం లభించదు. 10 వేల రూపాయల అడ్వాన్స్ లేదా వడ్డీ లేని రుణాన్ని ప్రభుత్వం ఒక ప్రీపెయిడ్ రూపే కార్డు రూపంలో ఇస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఈ కార్డు నుంచి 10 వేల రూపాయలతో మార్చి 31 లోపు కొనుగోలు చేయాలి. కార్డులో ఖర్చు అయిన మొత్తాన్ని తర్వాత ఆర్థిక సంవత్సరంలో పది నెలలు సమాన వాయిదాలుగా జీతం నుంచి కోత పెడతారు.
కరోనా సంక్షోభం, లాక్డౌన్ తర్వాత మిడిల్ క్లాస్కు ఊరటనివ్వడంతోపాటూ, వారిని సంతోషపెట్టిన మొదటి వార్త ఇదే. ఎల్టీసీకి బదులు క్యాష్ ఓచర్ స్కీం కూడా ఉంది. ప్రతి ఉద్యోగి లేదా అధికారి ఎంత ఎల్టీసీకి అర్హులో దానికి తగినక్యాష్ ఓచర్లు ఇస్తారు.
ఆ మొత్తం ఎల్టీసీ అర్హత లేదా ఛార్జీల మొత్తానికి మూడు రెట్లు సమానంగా ఉంటుంది. అంటే, ఎంత మొత్తానికి ఓచర్ లభిస్తే, దానికి మూడు రెట్లు మొత్తం ఖర్చు చేసినట్లు రసీదులు జత చేయాలి. అప్పుడే దానిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇక్కడ కూడా ప్రీపెయిడ్ కార్డు లాంటి షరతులు అమలవుతాయి.

ఫొటో సోర్స్, Manish Rajput/SOPA Images/LightRocket via Getty
లాభం- నష్టం
ఈ స్కీమ్ వల్ల ప్రయోజనం ఏంటి, నష్టం ఏంటి అనే ప్రశ్న కూడా వస్తోంది.
దీనివల్ల మొదటి పెద్ద ప్రయోజనం ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎల్టీసీ స్కీమ్ ప్రయోజనం పొందాలని అనుకుంటే, ప్రభుత్వ ఖజానా నుంచి 5,675 కోట్ల రూపాయల మొత్తం ఉద్యోగుల ఖాతాల్లోకి వెళ్తుంది.
ప్రభుత్వ కంపెనీలు, బ్యాంకులను కూడా కలిపితే దానికి మరో 1900 కోట్ల మొత్తం కలుస్తుంది.
ఈ పథకం కోణం లోంచి దీనిని చూస్తే, ఈ మొత్తం డబ్బును మార్చిలోపు మార్కెట్లో ఖర్చు చేయాలి. ఇక్కడ షరతులను నిశితంగా గమనిస్తే మార్కెట్లో ఖర్చయ్యే మొత్తం ఇంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందనే విషయం అర్థమవుతుంది.
ఎల్టీసీ ప్లాన్ ప్రయోజనం పొందేవారికి దాని ద్వారా అందే మొత్తం రెండు రకాలుగా ఉంటుందని తెలుసుకోవాలి. ఒకటి సెలవులకు బదులు లభించే మొత్తం, అంటే లీవ్ ఎన్కాష్మెంట్. దీనిపై టాక్స్ చెల్లించాల్సుంటుంది.
ఇక రెండోది సెలవులకు వెళ్లడం వల్ల లభించే చార్జీలు, ఇది ఉచితం. దీనిపై పన్ను మినహాయింపు పొందాలంటే, చార్జీల మొత్తంకంటే మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేయాలి. అప్పుడే అతడికి మొత్తం డబ్బు, పన్ను మినహాయింపు లభిస్తుందని ప్రభుత్వం ఇప్పుడు షరతు పెట్టింది.
ఎల్టీసీ క్లెయిమ్ చేసే సమయంలో టిక్కెట్లు కూడా జత చేయాలి. ప్రస్తుత సమయంలో ఉద్యోగులు ఎక్కడకూ తిరగడానికి వెళ్లలేరు. అందుకే, ప్రభుత్వం వారికి ఎక్కడకూ వెళ్లకుండానే టిక్కెట్లకు అయ్యే మొత్తం కూడా ఇస్తామని చెప్పింది. కానీ, అలాంటప్పుడు ఎక్కడనుంచి ఎక్కడకు వెళ్లే టికెట్ చార్జీలు లభిస్తాయి అనే ప్రశ్న కూడా వస్తుంది.
దీనికి సమాధానం కూడా ప్రభుత్వమే ఇచ్చింది. వేరు వేరు వేతనాలు ఉన్న వారికి రకరకాల చార్జీలను నిర్ణయించింది. బిజినెస్ క్లాస్ విమాన చార్జీలు లభించేవారికి ఒక వ్యక్తికి 36 వేల రూపాయలు, ఎకానమీ క్లాస్ వారికి 20 వేల రూపాయలు. రైళ్లలో ఏ తరగతిలో ప్రయాణించే అర్హత ఉన్నా ఆరు వేల చొప్పున చార్జీలు చెల్లిస్తామని చెప్పింది.
కానీ, ఈ పథకం నుంచి పూర్తి ప్రయోజం పొందాలంటే వారు తప్పనిసరిగా ఓచర్ విలువకు మూడు రెట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
దీనికి ప్రభుత్వ సర్కులర్లోనే ఒక ఉదాహరణ ఇచ్చారు. అందులో లెక్కలు చూపించారు. 1,38,500 రూపాయల వేతనం వచ్చే ఒక అధికారి కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే, ఆయన సెలవుల చెల్లింపులు 54015 రూపాయలు అవుతుంది. 20 వేల చొప్పున చార్జీలు 80 వేలు అంటే మొత్తం ఆయనకు 1,34,015 ఎల్టీసీ లభిస్తుంది. కానీ, పన్ను మినహాయింపు పొందాలంటే ఆయన చార్జీలకు మూడు రెట్లు అంటే 2,40,000 రూపాయలు, సెలవుల మొత్తం చెల్లింపులు 54,105 రూపాయలు ఖర్చు చేయాలి. అంటే వారు చేయాల్సిన మొత్తం ఖర్చు 2,94,015 రూపాయలు.

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP via Getty Images
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
ఇక్కడ ప్రభుత్వం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇది విని ఉద్యోగులు, అధికారులు అందరూ సంతోషపడిపోతున్నారు. ఇదే లెక్కలో మీరు కూడా చెల్లింపులు జరిపితే మీ సిబ్బందికి కూడా మినహాయింపు లభిస్తుందని ప్రైవేట్ రంగాలను కూడా చెప్పారు.
ఎల్టీసీ కోసం నాలుగేళ్లు బ్లాక్ వచ్చే ఏడాదికి ముగుస్తుండడంతో చాలామంది తమ ఎల్టీసీ తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు వారు మినహాయింపు ప్రయోజనం పొందాలనుకుంటే ఎంత లభిస్తుందో దానికి రెట్టింపు ఖర్చు చేయాల్సి వస్తుంది.
వడ్డీ లేకుండా తీసుకునే లోన్లు అందరూ వచ్చే ఏడాది తిరిగి చెల్లించాల్సిందే. ముఖ్యంగా ఎంత ఇచ్చారో దానికంటే ఎక్కువ మీ జేబు నుంచి బయటికి లాగడానికి కూడా ఏర్పాట్లు చేశారు.
వీటితోపాటూ మరో షరతుపై దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది.
ఆ షరతు మీ మొత్తం ఖర్చు డిజిటల్ ఉండాలి. అది కూడా కనీసం 12 శాతం జీఎస్టీ కచ్చితంగా ఉండాలి. అంటే మీరు చాలా అవసరమైన వస్తువులపై ఖర్చు చేస్తే ఎలాంటి ప్రయోజనం లభించదు. ప్రభుత్వం ఈ డబ్బును నిత్యావసరం కానివి, మరో మాటలో చెప్పాలంటే విలాస వస్తువులపై ఖర్చు చేయించాలని లేదా డిస్క్రిషనరీ స్పెండింగ్ పెంచాలని కోరుకుంటోంది.
అంటే, మీరు దానిని నిజానికి మీకు అవసరం లేని వస్తువులపైన ఖర్చు చేస్తారు. అది కూడా అందరూ ఒక్కో పైసా కూడబెడుతూ, నిత్యావసరాలకు ఖర్చు చేయడానికి వందసార్లు ఆలోచిస్తున్నసమయంలో మీరు ఆ డబ్బంతా ఖర్చు చేయాలి.

ఫొటో సోర్స్, Saumya Khandelwal/Hindustan Times via Getty Images
ఆర్థికవేత్తలు ముందే సూచించారు
లాక్డౌన్ మొదలైన తర్వాత ప్రభుత్వం నేరుగా ప్రజల జేబుల్లోకి డబ్బులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, వాళ్లతో బాగా ఖర్చుచేయించాలని అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డుఫ్లో, ఇంకా చాలామంది ఆర్థిక విశ్లేషకులు, విపక్ష నేతలు కూడా చెప్పారు.
ఒక్క క్షణం గమనిస్తే ప్రభుత్వం ఇప్పుడు అదే పని చేసినట్లు అనిపిస్తోంది. ఎంత ఖర్చు చేస్తే అంత ఎక్కువ ప్రయోజనం అని తెలివిగా చెప్పింది. సాధారణంగా ఉద్యోగం పోతుందనే ముప్పు కూడా లేని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల ఈ స్కీమ్ ప్రకటించింది.
అందుకే, జనం భారీగా దీని ప్రయోజం పొందుతారనే అనుకోవాలి. వాళ్లు దైర్యం చేస్తే, కొంత డబ్బు ప్రభుత్వం నుంచి తీసుకుంటారు, కొంత తమ జేబు నుంచి ఖర్చు చేస్తారు. దీపావళి నుంచి హోలీ వరకూ కొనుగోళ్లకు తెగింపు చూపిస్తారు.
ప్రభుత్వ మధ్య తరగతికి మాత్రమే లబ్ధి
ఈ స్కీంతో మధ్య తరగతిని అసలు పట్టించుకోలేదనే ఫిర్యాదులను కూడా ప్రభుత్వం పటాపంచలు చేసింది.
ఈ స్కీమ్ గరిష్టంగా మధ్య తరగతి వారికే పనికొస్తుంది. కానీ, అది వారికోసమే. ప్రైవేట్ రంగంలో ఉద్యోగులు, వ్యాపారుల చేసుకునేవారు, రిటైరైన మధ్య తరగతి వారి కోసం ఎలాంటి పథకాలూ లేవు. అంటే, ప్రభుత్వం వారికోసం ఏదీ చేయడం లేదనే అనుకోవాలా.
రుణాల మారటోరియం పథకంలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద చేసిన వడ్డీ మాఫీ వల్ల ఇప్పుడు అందరికీ ప్రయోజనం లభిస్తుందనే అనుకోవాలి.
కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు చేయనివారికి, ఎలాంటి రుణాలు తీసుకోనివారికి, నిజాయితీగా పన్నులు చెల్లించేవారికి ప్రభుత్వం ఏదైనా ఉపశమనం అందిస్తుందా, లేదా అనే ప్రశ్న కూడా వస్తోంది.
దీనికి సమాధానం అంత సులభం కాదు. లేదంటే ప్రభుత్వం ఏదైనా పెద్ద స్కీమ్ తీసుకురావాలి. అందులో ఎలాంటి తేడాలు లేకుండా అందరూ ఖర్చు చేయగలిగేలా, ప్రతి పౌరుడి ఖాతాలో కొంత డబ్బు వేసే ఏర్పాట్లు చేయాలి.
కానీ, ఎల్టీసీకి పెట్టిన షరతుల్లాంటివే, ప్రైవేట్ రంగంలో ఉద్యోగులకు కూడా పెడితే, తమ ఉద్యోగాలపై కత్తి వేలాడుతున్న సమయంలో, చాలామంది దీన్నుంచి ప్రయోజనం పొందే అవకాశాలు తక్కువే ఉంటాయని భావించాలి.
ఇప్పుడు, ఆర్థిక మంత్రి కొంత కాలం వేచిచూస్తారని మనం ఆశలు పెట్టుకోవచ్చు. ఈ చర్యలతో ఏదైనా ప్రభావం కనిపిస్తే, మార్కెట్కు తిరిగి ఊపిరి వస్తే, పన్ను వసూళ్లు పెరిగితే, అప్పుడు, ప్రభుత్వం తమ కోసం ఏదో చేస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్న వారి ముఖాల్లో కూడా చిరునవ్వు వచ్చేలా ఆర్థిక మంత్రి ఏదైనా పెద్ద చర్యలు తీసుకోడం గురించి ఆలోచించవచ్చు.
ఇక, బహుశా వచ్చే బడ్జెట్ కోసం కూడా ఎదురుచూపులు మొదలవుతాయి. ఎందుకంటే, గత బడ్జెట్ గణాంకాలు మొత్తం కరోనా వల్ల తల్లకిందులయ్యాయి. కానీ, పరిస్థితి వేగంగా మెరుగు పడాలంటే, వచ్చే బడ్జెట్లో మిగిలిన మధ్య తరగతి కోసం కూడా పన్నుల విషయంలో ఏదైనా శుభవార్త వినిపించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర కొరియా: ప్రజలందరి ముందు కిమ్ కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఏంటి? అమెరికాకు ముప్పు తప్పదా?
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









