CET - కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్: ఏమిటీ పరీక్ష, ఎలా నిర్వహిస్తారు, కొత్తగా వచ్చే మార్పులేమిటి...

పరీక్ష రాస్తున్న అభ్యర్థులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అనంత్ ప్రకాశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రభుత్వ రంగ ఉద్యోగాలు అన్నిటికీ కలిపి ఇకపై ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ - సీఏటీ) నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది.

ఈ పరీక్ష నిర్వహణకు జాతీయ నియామక సంస్థ (నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ)ను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది.

ఈ ప్రక్రియ ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో మార్పు తీసుకొస్తుందని, పారదర్శకతను ప్రోత్సహిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఇది రైల్వే, బ్యాంకింగ్ ఉద్యోగాలకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే తొలి దశ ప్రవేశ పరీక్ష మాత్రమే.

ప్రస్తుతం వివిధ ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు విడిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులపై ఆర్థికభారం ఎక్కువగా ఉండడమేకాక, ఇతరత్రా ఇబ్బందులు కూడా వస్తున్నాయి. వీటన్నిటినీ తొలగించేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష దోహదపడుతుందని ఆశిస్తున్నారు.

కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు.

"ఈ జాతీయ నియామక సంస్థ కోట్లమంది యువత పాలిట వరమని కచ్చితంగా రుజువు అవుతుంది. ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షతో అనేక పరీక్షలు తొలగిపోతాయి. దానివల్ల విలువైన సమయం, వనరులు ఆదా అవుతాయి. ఎంపికలో పారదర్శకత కూడా పెరుగుతుంది" అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అసలు ఈ సీఏటీ ఏంటి?

భారతదేశంలో ప్రతి సంవత్సరం రెండు నుంచి మూడు కోట్ల మంది యువత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం, బ్యాంక్ ఉద్యోగాల కోసం వివిధ పోటీ పరీక్షల్లో పాల్గొంటారు.

వీటన్నిటికోసం విడిగా దరఖాస్తు పెట్టుకోవాలి. మూడు, నాలుగు వందలనుంచీ ఎనిమిది, తొమ్మిది వందలవరకూ ప్రవేశ పరీక్ష రుసుము చెల్లించాలి.

ఇప్పుడు జాతీయ నియామక సంస్థ ఆ పరీక్షలన్నిటినీ రద్దు చేసి ఒకే ఒక్క పరీక్ష నిర్వహించనున్నది.

ఎస్ఎస్‌సీ, ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్ మొదలైన వాటన్నిటికీ ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా తొలిదశ స్క్రీనింగ్ చేస్తారు.

ఈ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. పదవ తరగతి, ఇంటర్ (11+12), డిగ్రీ పాసయిన వాళ్లందరూ ఈ పరీక్షకు అర్హులే.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకోసం విద్యార్థులు వివిధ పరీక్షలకు వివిధ రకాలుగా ప్రిపేర్ అవ్వాల్సిన పని లేకుండా ఈ ఒక్క పరీక్ష మీద దృష్టి పెడితే చాలు.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ఈ పరీక్ష ఎలా నిర్వహిస్తారు?

ప్రతీ జిల్లాలోనూ రెండు పరీక్షా కేంద్రాలను నిర్వహిచనున్నారు. ఇది విద్యార్థులకు ప్రయాణ భారాన్ని తగ్గిస్తుందని కేంద్రం తెలిపింది.

ఇందులో వచ్చిన మార్కులు మూడేళ్లవరకూ చెల్లుతాయని, అంతేకాకుండా ఈ ప్రవేశ పరీక్షకు వయసు పరిమితి ఉండబోదని కేబినెట్ తెలిపింది.

ఈ కొత్త పరీక్షా విధానం వలన ఎలాంటి మార్పులొస్తాయి?

ఇది పరీక్షా విధానంలో ఎంతోకాలంగా వేచి చూస్తున్న సంస్కరణలు తీసుకు వస్తుందని విద్యారంగానికి చెందిన ప్రముఖులు భావిస్తున్నారు.

ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ పరీక్షా విధానం మంచిదేనని, విద్యా వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలు చూపిస్తుందని కెరీర్ కౌన్సిలర్ అనిల్ సేఠీ అభిప్రాయం వ్యక్తం చేసారు. అయితే ఇది సంస్కరణల దిశగా మొదటి అడుగు మాత్రమేనన్న సంగతి మర్చిపోకూడదని ఆయన అన్నారు.

"వివిధ పరీక్షలకు వివిధ పద్ధతుల్లో హాజరు కావలసి వస్తుంది. అనేక దరఖాస్తులు నింపాలి, దూరాలు ప్రయాణించాల్సి వస్తుంది. విద్యార్థులు కొంత ఇబ్బంది పడతారు. కానీ ఇప్పుడు అవన్నీ లేకుండా ఒకే ఒక్క పరీక్ష ఉండడం ఆహ్వానించదగ్గ విషయం. నన్నడిగితే ఈ పద్ధతి చాలా యేళ్ల క్రితమే వచ్చి ఉండాల్సింది."

"ప్రస్తుతం ఎస్ఎస్సీ పరీక్ష రాస్తే ఎస్ఎస్సీ ఉద్యోగానికి మాత్రమే అర్హులు. అలాగే ఆర్ఆర్బీ రాస్తే రైల్వే ఉద్యోగాలకు మాత్రమే అర్హత సంపాదిస్తారు. ఈ పరీక్షల స్కోరు మూడేళ్లు చెల్లుతుంది కాబట్టి ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాస్తే ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, బ్యాంక్ ఉద్యోగాలు..వేటికైనా సరే తొలిదశ అర్హత సంపాదించొచ్చు. నా ఉద్దేశంలో ఇది చాలా మంచి పరిణామం" అని సేఠీ అన్నారు.

పరీక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఈ పరీక్ష గురించి యువత ఏం అనుకుంటున్నారు?

ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశిస్తున్న అభ్యర్థి పూర్వేష్ శర్మ బీబీసీతో మాట్లాడుతూ ఈ పరీక్షా విధానం తనలాంటి విద్యార్థులందరికీ లాభదాయకంగా ఉంటుందని అన్నారు.

"ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షా విధానం ఆశావహంగా ఉంది. ప్రస్తుత విధానంలో ఒక ఏడాది ఏ కారణాలవల్లైనా పరీక్ష రాయలేకపోతే, ఇంక ఆ సంవత్సరం వృధా అయిపోయినట్టే. కానీ సీఈటీ ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తామని అంటున్నారు."

"ప్రస్తుతం ప్రతీ పరీక్షకు వేరువేరుగా దరఖాస్తులు పెట్టుకోవాలి. ఐబీపీఎస్లాంటి పరీక్షలకు జనరల్ క్యాటగిరీ దరఖాస్తు ఖరీదు 800 రూపాయలు ఉంటుంది. పేద విద్యార్థులకు ఇది కష్టమే. ఈ కొత్త విధానంలో కనీసం తొలిదశ పరీక్ష ఉచితంగా నిర్వహిస్తామంటున్నారు. ఇది మంచి విషయం. ఆ మేరకు ఆర్థికభారం, సమయభారం తగ్గుతాయి."

"నాతోపాటూ ఎంతోమంది విద్యార్థులు ప్రభుత్వ రంగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ ఉమ్మడి పరీక్షా విధానం వార్త వచ్చినదగ్గరనుంచీ ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరీక్ష 2020 లో నిర్వహిస్తారా? ఒకవేళ 2021లో నిర్వహిస్తే అది 2020 సంవత్సర పరీక్షా? లేక 2010 సంవత్సరానిదా? ఈ అంశంలో మరిన్ని వివరాలకోసం ఎదురుచూస్తున్నాం" అని పూర్వేష్ శర్మ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)