జైపూర్ మ్యూజియంలో 2,400 ఏళ్లనాటి ఈజిప్టు మమ్మీ ఇప్పుడెలా ఉంది... ఇక్కడికి ఎలా వచ్చింది?

జైపూర్ మమ్మీ

ఫొటో సోర్స్, Mohar Singh Meena/BBC

ఫొటో క్యాప్షన్, జైపూర్ మమ్మీ

ఆగస్టు 14న జైపూర్‌లో భారీ వర్షం కురవడంతో ఆల్బర్ట్ హాల్‌లో నీళ్లు నిండిపోయాయి. దాంతో, అక్కడ ఉంచిన 2,400 ఏళ్ల పురాతన మమ్మీ(మృతదేహం)ని చాలా కష్టపడి కాపాడగలిగారు.

ఈ మమ్మీని ఈజిఫ్టు ప్రాచీన రాజ్యం పానపోలిస్‌లోని అఖ్‌మీన్‌కు సంబంధించింది. అది క్రీస్తు పూర్వం 322 నుంచి 39 మధ్య కాలానికి చెందినది. అంటే దాదాపు రెండున్నర వేల కిందటి టోలమైక్ యుగం నాటిదని చెబుతున్నారు.

ఈ మమ్మీ ఈజిఫ్ట్ అఖ్‌మీన్‌లో ఖేమ్ అనే దేవత ఉపాసకులైన పురోహితుల కుటుంబంలోని తుతు అనే మహిళదని ఆల్బర్ట్ హాల్‌లో ఉన్న పత్రాల్లో ఉంది.

1883లో సవాయి మాధో సింగ్-2 బ్రిటిష్ ప్రభుత్వం, భారత రాజ్యాల సహకారంతో ఇండస్ట్రియల్ ఆర్ట్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ మ్యూజియం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శన కోసం ఈ మమ్మీని ప్రత్యేకంగా తెప్పించార”ని జైపూర్ చరిత్రకారుడు ప్రొఫెసర్ ఆర్పీ ఖంగోరోత్ చెప్పారు.

‘ఎ డ్రీమ్ ఇన్ డెజర్ట్’ పేరుతో రాసిన తన పుస్తకంలో కూడా ప్రొఫెసర్ ఖంగారోత్ ఇదే విషయం చెప్పారు. కానీ, దానిని ఎంతకు కొనుగోలు చేశారు అనే సమాచారం ఎక్కడా లేదు.

ఈ మమ్మీని కొనుగోలు చేశారా, బహుమతిగా ఇచ్చారా లేక ఏదైనా ఒప్పందం ప్రకారం జైపూర్‌ తీసుకొచ్చారా అనే ప్రశ్నలకు సమాధానంగా “దాని గురించి పక్కాగా ఎలాంటి పత్రాలూ లేవని ఆల్బర్ట్ హాల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ ఛోలక్ చెప్పారు.

మమ్మీ

ఫొటో సోర్స్, Mohar Singh Meena/BBC

మమ్మీని 5 సార్లు షోకేస్ లేకుండానే పెట్టారు

ఆగస్టు 14న జైపూర్‌లో భారీ వర్షం కురవడంతో బేస్‌మెంట్‌లో నీళ్లు నిండిపోయాయి. దాంతో మమ్మీ తడిచిపోకుండా దానిని షోకేస్ పగలగొట్టి బయటకు తీశారు. మమ్మీని ఇలా షోకేస్ నుంచి బయటకు తీయడం ఇది మొదటిసారి కాదు.

“ఆల్బర్ట్ హాల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మమ్మీని షోకేజ్‌లో పెట్టాం. కానీ 2017 ఏప్రిల్‌లో దానిని బేస్‌మెంట్‌లోకి షిఫ్ట్ చేశాం. ఆ సమయంలో కూడా మమ్మీని షోకేస్ నుంచి బయటకు తీశాం” అని రాకేష్ ఛోలక్ చెప్పారు.

“2005, 2007లో కూడా మమ్మీని షోకేస్ బయట ఉంచారు. 2012లో ఎక్కువగా నాలుగు రోజుల పాటు మమ్మీని బయటే ఉంది. అప్పుడు ఆ మమ్మీ ఎలా ఉందో పరీక్షించేందుకు ఈజిఫ్ట్ నుంచి ముగ్గురు నిపుణులను పిలిపించారు. దాంతో దానిని పరిశీలించేందుకు నాలుగు రోజుల పాటు మమ్మీని షోకేస్‌ బయటే ఉంచామ”ని ఆయన చెప్పారు.

జైపూర్‌లో కొన్ని గంటలపాటు కురిసిన వర్షం వల్ల ఆల్బర్ట్ హాల్‌కు చాలా నష్టం జరిగింది. చాలా పురాతన పత్రాలు, ప్రభుత్వ ఫైళన్నీ తడిచిపోయాయి.

బేస్‌మెంట్‌లో నడుము లోతు నీళ్లు రావడంతో షోకేస్ అడుగు వరకూ నీళ్లు చేరుకున్నాయి. కానీ సిబ్బందికి ధైర్యం చెప్పిన సూపరింటెండెంట్ షోకేస్ అద్దాలు పగలగొట్టించారు. మమ్మీని సురక్షితంగా బయటతీయడానికి అన్ని ప్రయత్నాలూ చేశారు.

అందుకే, దాదాపు రెండున్నర వేల ఏళ్లనాటి ఈ పురాతన మమ్మీ ఇప్పుడు ఆల్బర్ట్ హాల్‌లో సురక్షితంగా ఉంది.

జైపూర్‌లోని పురావస్తు ప్రదర్సన శాల

ఫొటో సోర్స్, MOHAR SINGG MEENA/BBC

ఫొటో క్యాప్షన్, జైపూర్‌లోని పురావస్తు ప్రదర్సన శాల

ఈ మమ్మీ ఎలా ఉంది

ఆల్బర్ట్ హాల్‌లో ఉంచిన ఈ మమ్మీపైన ప్రాచీన ఈజిఫ్టులో ‘రెక్కల పవిత్ర కీటకం’(గుబ్‌రేలా) చిహ్నాలు ఉన్నాయి. మరణం తర్వాత పునర్జన్మకు సంబంధించి అది ఒక సంకేతం. మెడ నుంచి నడుము వరకూ ముత్యాలు, కాలర్‌ ధరించి ఉన్న ఒక రెక్కల దేవత చిత్రాన్ని ఆ మృతదేహాన్ని రక్షించడానికి వేశారు.

దానికి కింద మూడు చదరాలు ఉన్నాయి. ఒకదానిపై చితిమంటలపై ఉన్న మృతదేహం, రెండు వైపులా స్త్రీలు ఉన్నారు. రెండోదానిలో పాతాళలోకంలో ముగ్గురు న్యాయమూర్తులు కూర్చున్న చిత్రం ఉంది. మూడోదానిలో హోరస్ దేవత నలుగురు కొడుకులు ఉన్నారు. వారి తలలు మనిషి, నక్క, కోతి, గద్దలా ఉన్నాయి.

జైపూర్ మమ్మీ

ఫొటో సోర్స్, Mohar Singh Meena/BBC

మమ్మీ సురక్షితంగా ఉందా?

వర్షం వల్ల దానిని మ్యూజియంలో వేరే ప్రాంతంలోకి షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి రావడంతో దాని భద్రత గురించి ఇప్పుడు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

కానీ, మ్యూజియం నిర్వాహకులు మాత్రం దానిని అక్కడ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నామని చెబుతున్నారు.

మమ్మీని బలంగా ఉండే ఒక అద్దాల షోకేస్‌లో ఉంచేవారు. దానికి ఎలాంటి నష్టం జరగకుండా చాల పద్ధతులు పాటించేవారు. కానీ ప్రస్తుతం ఈ మమ్మీ బయటే ఉంది.

ఆల్బర్ట్ హాల్ సూపరింటెండెంట్ రాకేష్ ఛోలక్

ఫొటో సోర్స్, MOhar Singh Meena/BBC

ఫొటో క్యాప్షన్, ఆల్బర్ట్ హాల్ సూపరింటెండెంట్ రాకేష్ ఛోలక్

“2012లో మమ్మీని పరిశీలించిన స్పెషలిస్టుల పర్యవేక్షణలో దానిపై ఉన్న రెండు లేయర్లను తొలగించాం, కానీ దాని చర్మాన్ని రక్షించడానికి మూడో లేయర్ తొలగించలేద”ని ఆల్బర్ట్ హాల్ సూపరింటెండెంట్ రాకేష్ ఛోలక్ చెప్పారు.

“జైపూర్, హైదరాబాద్, లఖ్‌నవూ, కోల్‌కతా, వడోదర, గోవా సహా దేశంలో మొత్తం ఏడు మమ్మీలు ఉన్నాయి. వీటిలో ఆరు ఈజిఫ్టు నుంచి తీసుకొచ్చారు. గోవాలో ఉన్న మమ్మీ మాత్రం అంత పురాతనం కాదు” అన్నారు.

2012లో మమ్మీని పరిశీలించిన ఈజిఫ్ట్ బృందం రెండు లేయర్లను తొలగించాక దానిని ఎక్స్ రే తీశారని, ఆ సమయంలో మమ్మీని పూర్తిగా పరీక్షించారని ఆయన చెబుతున్నారు.

“ఆ సమయంలో మా దగ్గర ఉన్న మమ్మీ అత్యంత భద్రంగా ఉందని ఆ నిపుణులు చెప్పార”ని రాకేష్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్‌ , ట్విటర్ ‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ లో సబ్‌స్క్రైబ్ చేయండి.)