సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో తనను అన్యాయంగా ఇరికించారన్న రియా చక్రవర్తి, సీబీఐ విచారణకు సుప్రీం 'నో'

ఫొటో సోర్స్, Getty Images
తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, కేసు పెట్టారని సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి తన పిటిషన్లో పేర్కొన్నారు. సుశాంత్ మృతికి, తనకు ఏ సంబంధం లేదన్నారు. సుశాంత్తో తాను సహజీవనం చేస్తున్నట్లు కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
"నన్ను అన్యాయంగా ఇందులో ఇరికించారు" అని ఆమె పిటిషన్లో తెలిపారు.
సుశాంత్ కొంత కాలంగా డిప్రెషన్తో బాధపడుతున్నారని, యాంటీ-డిప్రెసెంట్లు వాడుతున్నారని, జులై 14 ఉదయం బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకుని మరణించారని రియా చక్రవర్తి తన పిటిషన్లో చెప్పారు.
"బిహార్లో నిష్పాక్షిక విచారణ జరగదు, అందుకే అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ను ముంబయికి బదిలీ చేయాలి" అని ఆమె కోరారు.
"నన్ను చంపుతామని, అత్యాచారం చేస్తామని అనేక బెదిరింపులు వచ్చాయి. అప్పటికే సుశాంత్ మరణంతో దిగులుతో ఉన్నాను. దీనికి ఈ బెదిరింపులు, మీడియాలో వస్తున్న కథనాలు తోడయ్యాయి" అని ఆమె తన పిటిషన్లో వెల్లడించారు. ఈ బెదిరింపులపై ఆమె ముంబయి శాంతా క్రజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సీబీఐ విచారణకు సుప్రీం నిరాకరణ
అంతకుముందు, సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధించిన కేసును సీబీఐకి బదిలీచేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పోలీసుల పనిని పోలీసులను చెయ్యనివ్వండి అని వ్యాఖ్యానించింది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై దాఖలైన కేసుల విచారణను సీబీఐకి బదిలీ చేయాలంటూ అల్కా ప్రియ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
'మేం మీ పిటిషన్పై విచారణను నిరాకరిస్తున్నాం' అని సీజేఐ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని సుప్రీం త్రిసభ్య ధర్మాసనం చెప్పింది.
పిటిషనర్ అల్కా ప్రియకు ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వచ్చేందుకు అవకాశం లేదని చెబుతూ పిల్ను కొట్టివేసింది.
"ఈ కేసులో ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే బోంబే హైకోర్టుకు వెళ్లండి" అని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది.
సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ అల్కా ప్రియ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మరోవైపు, ఈ కేసు విచారణను ముంబయికి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్పై సుశాంత్ కుటుంబం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. పట్నా నుంచి ముంబయికి కేసు విచారణను బదిలీ చేయాలంటూ రియా ఇప్పటికే పిటిషన్ వేశారు.
దీనిపై బిహార్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ఈరోజు కేవియట్ దాఖలు చేసింది. ఇప్పటికే పట్నాలో రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తన కుమారుడిని రియా ఆత్మహత్యకు పురికొల్పినట్లు సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపిస్తున్నారు. కేవియట్ దాఖలు చేయడం ద్వారా బిహార్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో సుశాంత్ కుటుంబానికే మద్దతుగా ఉంటున్నట్లు స్పష్టమైందని బిహార్ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) లలిత్ కిషోర్ తెలిపారు.
ఈ కేసు విషయంలో బిహార్ ప్రభుత్వం ఏజీతో పాటు, సుప్రీం కోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గీ సాయం తీసుకోవచ్చని ఆయన అన్నారు. రియా పిటిషన్ను సుప్రీం కోర్టులో వ్యతిరేకిస్తామని ఆయనన్నారు.

ఫొటో సోర్స్, RHEA CHAKRABORTY/INSTAGRAM
ఇప్పటి వరకూ ఈ కేసులో ఏం జరిగింది?
నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో పట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్లో నటి రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు మేరకు రియా చక్రవర్తి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు రాజీవ్ నగర్ పోలీసు స్టేషన్ ఇన్చార్జి యోగేంద్ర రవిదాస్ బీబీసీకి తెలిపారు. సుశాంత్ ప్రియురాలైన రియా మీద జూలై 25 నాడే ఈ ఎఫ్ఐఆర్ నమోదు అయిందని ఆయన చెప్పారు.
సుశాంత్ తండ్రి రియా మీద డబ్బుకు సంబంధించి, తన కుమారుడి ఆత్మహత్యకు సంబంధించి ఆమె మీద ఆరోపణలు చేశారని యోగేంద్ర చెప్పారు. ఈ నేపథ్యంలో పట్నా నుంచి ఒక పోలీసు బృందం ముంబై వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. పట్నా సెంట్రల్ జోన్ ఐజీ సంజయ్ సింగ్ కూడా FIR నమోదైన విషయాన్ని ధ్రువీకరించారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
సుశాంత్ సింగ్ ముంబయిలోని బాంద్రా ప్రాంతంలోని తన ఇంట్లో జూన్ 14 న చనిపోయారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత, ముంబై పోలీసులు ప్రశ్నించిన వారిలో రియా కూడా ఉన్నారు.
అయితే, ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.సూసైడ్ నోట్ వంటిదేమీ దొరకలేదని ముంబయి పోలీసుల అధికార ప్రతినిధి డీసీపీ ప్రణయ్ అశోక్ చెప్పారు.
కాగా సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆయన ఇంట్లో పనిచేసేవారు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నటుడు శేఖర్ సుమన్ ఈ కేసు గురించి చాలా గట్టిగా ఉన్నారు. దీనిపై ట్వీట్ కూడా చేసిన ఆయన "సుశాంత్ కుటుంబ సభ్యులు, రియాకు వ్యతిరేకంగా సెక్షన్ 306 ఆత్మహత్యకు ప్రేరేపించడం, 340, 342 కింద కేసు పెట్టారని తెలిపారు. మొత్తం కేసులో దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేయాలని కూడా శేఖర్ సుమన్ కోరారు.
అంతకు ముందు, ఈ మొత్తం కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని రియా చక్రవర్తి హోంమంత్రి అమిత్ షాను కోరారు.
రియా తన ఇన్స్టాగ్రాంలో "సర్, నేను సుశాంత్ సింగ్ రాజ్పుత్ గర్ల్ ఫ్రెండ్ని. సుశాంత్ చనిపోయి ఒక నెల గడిచిపోయింది. నాకు ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉంది. ఈ కేసులో న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. అందుకే ఈ కేసు దర్యాప్తు సీబీఐతో చేయించాలి. సుశాంత్ ఏ ఒత్తిడిలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడో నేను తెలుసుకోవాలనుకుంటున్నా" అని పెట్టారు.

ఫొటో సోర్స్, SHWETA SINGH INSTA
సుశాంత్ సింగ్ రాజ్పుత్ సోదరి శ్వేతా సింగ్ జులై 27న ఇన్స్టాగ్రాంలో తన సోదరుడిని గుర్తు చేసుకుంటూ రెండు పోస్టులు చేశారు. అందులో ఒక పోస్టులో శ్వేత వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశారు. ఆ చాట్ సుశాంత్ మృతికి కేవలం ఒక్క రోజు ముందుది.
శ్వేత రెండు ముక్కలుగా ఆ పోస్టును ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు. మొదటి దానిలో ఆమె సుశాంత్ చిన్ననాటి ఫొటో ఒకటి షేర్ చేస్తూ "మొదట కొడుకు కావాలని అనుకున్నామని మా అమ్మనాన్నలు నాకు చెప్పారు. వాళ్లకు మొదట అబ్బాయే పుట్టాడు. కానీ, ఏడాదిన్నర వయసుకే తను చనిపోయాడు. నేను ఎప్పుడూ మా అన్నను కలవలేదు. కానీ అమ్మనాన్నలు రెండోసారి కూడా కొడుకే పుడతాడని నమ్మకంతో ఉండేవారు. వాళ్లు మొక్కుకున్నారు. రెండేళ్లు మా భగవతిని పూజించారు. వ్రతాలు, యజ్ఞాలు చేశారు. ఎన్నో గుడులూ, పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. కానీ దీపావళి రోజు నేను పుట్టాను. అమ్మ నేను చాలా అదృష్టవంతురాలినని నమ్మేది. చాలాసార్లు లక్ష్మీ అని పిలిచేది. కానీ ఆమె తన పూజలు వదల్లేదు. ఏడాది తర్వాత నా తమ్ముడు పుట్టాడు. తను మొదటి నుంచీ అందగాడే" అని పోస్ట్ చేశారు.
శ్వేత ఆ నోట్ ముందు తనకు, తమ్ముడికి మధ్య ఉన్నబలమైన బంధం గురించి ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Getty Images
టీవీ నటుడిగా మొదలైన ప్రస్థానం
సుశాంత్ సింగ్ బిహార్లోని పట్నాలో 1986 జనవరి 21న జన్మించారు. సినిమాల్లోకి రాకముందు ఎన్నో టీవీ సీరియళ్లలో నటించారు.
కిస్ దేశ్ మే హై మేరా దిల్ అనే టీవీ సీరియల్తో అతని నటనా జీవితం ప్రారంభమైంది.జీటీవీలో 2009-11లో వచ్చిన పవిత్ర రిష్తా సీరియల్తో మంచి పేరు సంపాదించిన ఆయన 2013లో వచ్చిన కైపోచేతో సుశాంత్ బాలీవుడ్లోకి అడుగుపెట్టారు.

ఫొటో సోర్స్, AFP
మొదటి సినిమాకే ఫిలింఫేర్ అవార్డు
2013లో వచ్చిన కైపోచేతో సుశాంత్ బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. అందులో తన నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.తర్వాత సుశాంత్ శుద్ధ్ దేశీ రొమాన్స్, డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షీ లాంటి సినిమాలు చేశారు.
అమీర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ పీకేలోనూ సుశాంత్ది కీలక పాత్ర ఉంది.

ఫొటో సోర్స్, SPICE PR
ధోనీ జీవిత కథతో సౌత్లోనూ..
భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ జీవితకథతో వచ్చిన ‘‘ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’’ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు.కేదార్నాథ్, చిచోరే లాంటి కమర్షియల్ సినిమాలు కూడా చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
జర్నలిస్ట్ మధు పాల్ వివరాల ప్రకారం బాంద్రా పోలీస్ స్టేషన్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ నౌకరు ఈ ఘటన గురించి సమాచారం ఇచ్చారు.టీవీ నటుడుగా కెరియర్ ప్రారంభించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇటీవల కొన్నేళ్లుగా వెండితెరపై తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇదే..
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
సుశాంత్ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ చందామామా దూర్ కే రిలీజ్ కావాల్సి ఉంది. బడ్జెట్ కొరతతో ఆ చిత్రాన్ని ప్రస్తుతానికి ఆపేశారు.పది రోజుల క్రితం అతడు ఇన్స్టాగ్రాంలో తన తల్లి ఫొటోతో పాటూ తన ఫొటోను పోస్ట్ చేశాడు.
''మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి.
ఆ రెండింటి మధ్యా బతుకుతున్నా' అని సుశాంత్ ఆ పోస్టులో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
లవ్లైఫ్లో ఒడుదొడుకులు
సుశాంత్ ఇంజనీరింగ్ చేశాక హీరో కావాలనే కలలు నిజం చేసుకోడానికి యాక్టింగ్ వైపు మళ్లాడు.మొదట్లో అతడు డ్యాన్సర్గా పనిచేశాడు. ఆ తర్వాత 'కిస్ దేశ్ మే హై మేరా దిల్' పేరుతో వచ్చిన సీరియల్తో అతడికి యాక్టింగ్ కెరీర్లో మొదటి బ్రేక్ వచ్చింది.
ఆ తర్వాత 'పవిత్ర రిస్తా' సీరియల్ సుశాంత్ను ఇంటింటికీ పరిచయం చేసింది.యాక్టింగ్ కెరీర్ విజయవంతం అయ్యాక సుశాంత్ 'జర నచ్ కే దిఖా', 'ఝలక్ దిఖలాజా' డాన్స్ రియాలిటీ షోల్లో కూడా పాల్గొన్నాడు.ఆ తర్వాత సుశాంత్ సినిమాల్లోకి వచ్చాడు. తొలి సినిమా 'కైపోచే'లో అతడికి ప్రశంసలు దక్కడంతో సుశాంత్ కెరియర్ గ్రాఫ్ పైపైకి వెళ్లింది. వరస హిట్స్ అందుకున్నాడు. కెరియర్ పరంగా విజయం దక్కినా సుశాంత్ 'లవ్ లైఫ్' అంత సంతృప్తికరంగా లేదు. టీవీ సీరియల్ 'పవిత్ర రిష్తా'లో సహ నటి అంకితా లోఖండేతో అతడు సహజీవనం చేశాడు. తర్వాత ఇద్దరూ విడిపోయారని వార్తలు వచ్చాయి. సుశాంత్ సినీరంగంలో విజయవంతం కావడంతో ఇద్దరి మధ్యా మనస్ఫర్థలు వచ్చాయని భావించారు. ఇటీవల సుశాంత్ దగ్గర గతంలో మేనేజర్గా పనిచేసిన చుంకీ దిశా సలియన్ కూడా ఒక భవనం మీద నుంచి పడిపోవడం వల్ల చనిపోయారు.
మొదట ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు భావించారు. కానీ తర్వాత దిశ ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Twitter
ఆత్మహత్యలు వద్దని చెప్పిన హీరోయే చివరకు..
సుశాంత్ కేవలం హీరోగానే కాదు, టీవీ ఆర్టిస్ట్ గా, డ్యాన్సర్గా, దాతగానూ పేరు తెచ్చుకున్నారు. చదువుకునే రోజుల్లో జీనియస్ అని పేరు తెచ్చుకున్న ఆయన జాతీయ స్థాయి ఒలింపియాడ్ ఫిజిక్స్లో విజేతగా నిలిచారు.
గతంలో తాను నటించిన చిచ్చోరే సినిమాలో ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని సందేశం ఇచ్చే హీరో పాత్ర పోషించిన సుశాంత్ ఇప్పుడు తానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇవి కూడా చదవండి:
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఉత్తర ప్రదేశ్లో వైద్యం అందక గర్భిణి మృతి.. కరోనా పాజిటివ్ కేసుల్లో ఐదో స్థానానికి చేరుకున్న భారత్
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- భారత్-నేపాల్ సంబంధాలు: 1990ల్లో 13 నెలలపాటు నేపాల్ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు...
- రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో మళ్లీ సొంతూరికి నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








