ఏపీలో ఇసుక కొరత: లాక్డౌన్ సడలించినా నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు

ఫొటో సోర్స్, FACEBOOK/YSRCPOFFICIAL
- రచయిత, శంకర్.వి
- హోదా, బీబీసీ కోసం
కరోనా లాక్డౌన్ సడలింపులు మొదలు కావడంతో అన్నిరంగాలలో కార్యకలాపాలు మొదలవుతున్నాయి. ప్రభుత్వాలు కూడా పనులను ప్రోత్సహిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో నిర్మాణరంగం మాత్రం కదలడం లేదు.
ఇసుక దొరక్క పోవడమే దీనికి ప్రధాన కారణమని చాలామంది చెబుతున్నారు. ఒకపక్క విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కానీ ప్రభుత్వం మాత్రం ఇసుక అందుబాటులోనే ఉందని, కొరతకు అవకాశమే లేదని ప్రకటనలు చేస్తోంది.

ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
ఆంధ్రప్రదేశ్లో కొన్నేళ్లుగా ఇసుక మాఫియా ఇష్టారాజ్యం సాగుతోందన్న ఆరోపణలున్నాయి. నదుల్లో నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తవ్వకాలు జరపడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ జోక్యంతో ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం కూడా చెల్లించాల్సి వచ్చింది.
తాము అధికారంలోకి వస్తే ఇసుక సమస్య పరిష్కరిస్తామని 2019 ఎన్నికలకు ముందు జగన్ ప్రకటించారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఇసుక పెద్దసమస్యగా మారింది.
కొరత కారణంగా పనులు దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు కూడా చేసుకోవడంతో ఇదో వివాదమైంది.
కృష్ణా, గోదావరి నదుల్లో చాలా రోజులపాటు వరదలు కొనసాగడం కొరతకు కారణమని ప్రభుత్వం చెప్పింది. కానీ ఈసారి వేసవి వచ్చేసరికి ఒకపక్క లాక్డౌన్, మరోపక్క బల్క్ బుకింగ్లు నిర్మాణ రంగానికి తలనొప్పిగా మారాయి.

ఏమిటీ బల్క్ బుకింగ్ విధానం?
ఇసుక తవ్వకాలలో పారదర్శకత కోసమంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన బల్క్ బుకింగ్ విధానం కొత్త కష్టాలు తీసుకొస్తోందన్న ఆరోపణలున్నాయి.
గతంలో ఇసుక కావాలంటే ర్యాంపులకు వెళ్లి డబ్బు చెల్లించి కొనుక్కోవచ్చు. ఇప్పుడు దాన్ని ఆన్లైన్కు మార్చారు.
ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే, ఆధార్ కార్డు, ఇంటికి సంబంధించిన పర్మిషన్ కాపీలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 12గంటలకు కొద్ది నిమిషాలకు ముందు ఈ బుకింగ్స్ను ఓపెన్ చేస్తారు. కాసేపట్లోనే బుక్సింగ్ అయిపోతున్నాయి. ''పారదర్శకత పేరుతో ప్రభుత్వం చేసిన ప్రయత్నం ప్రజలకు కొత్త కష్టాలు తీసుకొస్తోంది'' అని బిల్డింగ్ అండ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నాయకుడు కంచుమర్తి కాటమ రాజు బీబీసీతో అన్నారు.
బల్క్బుకింగ్స్ పేరుతో కొందరు వ్యాపారులు అక్రమంగా ఇసుకను కొనుగోలు చేస్తున్నారని, దాన్ని తిరిగి బ్లాక్మార్కెట్లో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. '' తూర్పుగోదావరి జిల్లాలోని ముగ్గళ్ల ర్యాంప్ నుంచి కాకినాడకి ఐదుటన్నుల లారీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రూ.15,500కి వస్తుంది. దానిని బయట రూ. 30వేలకు అమ్ముతున్నారు. అంటే రెట్టింపు ధర. అయినా సామాన్యులకు ఇసుక దొరకడం లేదు'' అన్నారు కాటమ రాజు.

సర్కారు తీరుపై విమర్శలు
ఆన్లైన్ బుకింగ్లతో ఇసుక మోసాలు అరికడతామంటున్న ప్రభుత్వం ఆ పని చేయలేకపోయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఏపీలో ఇసుక కొరతపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వ తీరుని తప్పుబట్టారు. ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇటు నిర్మాణరంగంలో ఉన్నవారు కూడా ప్రస్తుత విధానంలో స్పష్టత లేదంటున్నారు.
''ఇసుక అమ్మకం విధానంలో ప్రభుత్వం చెబుతున్నదానికి ఆచరణకు తేడా ఉంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే, లాక్డౌన్ సడలించారు కాబట్టి...అన్ని ర్యాంపుల్లో తవ్వకాలకు అనుమతి ఇవ్వాలి'' అని గుంటూరు జిల్లాకు చెందిన బిల్డర్ రమేశ్ కుమార్ బీబీసీతో అన్నారు.
''కొరతను తీర్చకపోతే నిర్మాణ రంగం పుంజుకోదు. అత్యవసరమై బ్లాక్మార్కెట్లో కొన్నా, జరిమానాలు విధించి మళ్లీ సామాన్యుడినే ఇబ్బంది పెడుతున్నారు'' అని రమేశ్కుమార్ అన్నారు.
బల్క్లో ఇసుకను పెద్ద మొత్తంలో తరలించుకుపోయేందుకు వీలుగా నిబంధనలు ఉన్నాయని అంబాజీపేటకు చెందిన కె.ఎస్.ప్రసాద్ బీబీసీతో అన్నారు.
''మా ఇంటి నిర్మాణంలో చిన్నచిన్న మార్పుల కోసం రెండు ట్రాక్టర్ల ఇసుక కావాలని పది రోజులుగా ప్రయత్నం చేస్తున్నా. కోనసీమలోని చాలా ఇసుక ర్యాంపులను మూసేశారు. ఎందుకు తెరవలేదన్నది ఎవరికీ తెలియదు'' అని ప్రసాద్ వాపోయారు.
''చాలాచోట్ల మధ్యలోనే పక్కదారి పడుతోంది. అధికారిక స్టాక్ పాయింట్లకు, ర్యాంపుల నుంచి తరలిస్తున్న ఇసుక నిల్వలకు పొంతన లేదు'' అని ఆయన ఆరోపించారు.
ఇటు భవన నిర్మాణ కార్మికులు పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ''నిర్మాణ పనులు మొదలైత కూలికి పోదామని ఎదురుచూస్తున్నా. మూడు నెలలుగా పనుల్లేవు. ఇసుక లేక ఎక్కడా పనులు జరగట్లేదు. మాకు కూలి దొరకడం లేదు'' అని ఆవేదన వ్యక్తం చేశారు విజయవాడకు చెందిన భవన కార్మికుడు ఉమామహేశ్వరరావు. ''చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లకు కూడా పనులు దొరకడం లేదు. ప్రభుత్వం ఆలోచించాలి'' అన్నారాయన.
అధికార పార్టీ నేతలదీ అదే వేదన.
సామాన్యులు, విపక్షాలు, భవననిర్మాణ కార్మికులే కాదు అధికార పార్టీ నేతలు కూడా ప్రస్తుత ఇసుక విధానంపై అసంతృప్తితో ఉన్నారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
'' జగన్ ఎన్ని మంచి పనులు చేసినా ఇసుక కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది'' అని అన్నారు విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.
గుంటూరు జిల్లా జెడ్పీ సమావేశంలో వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ''రీచ్లో ఎత్తిన ఇసుక, యార్డు దాకా రావడం లేదు'' అని తీవ్రవ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం ఏమంటోంది ?
ఇసుక సమస్యపై వెల్లువెత్తుతున్న నిరసనలకు ప్రభుత్వంలో కూడా కదలిక వచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వ్యవహారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
''ఇసుక బుకింగ్లో అక్రమాలు గుర్తించాం. బుకింగ్ విధానాన్ని సరళతరం చేస్తాం'' అన్నారాయన. ''సచివాలయ వ్యవస్థ ద్వారా ఇసుక బుకింగ్ ఎలా ఉంటుందన్న దానిపై ఆలోచన చేస్తున్నాం.
ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని 70 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ చేయాలని నిర్ణయించాము. కొరత రాకుండా చూస్తాం'' అని వివరించారు రామచంద్రారెడ్డి.
ఇవి కూడా చదవండి:
- అమెరికా డాలర్ కనుమరుగవుతుందా? చైనా డిజిటల్ యువాన్ రాజ్యం చేస్తుందా?
- సంక్షేమానికి, వివాదాలకూ రారాజు జగన్
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నరేంద్ర మోదీ వారసుడు అమిత్ షాయేనా?
- స్వాల్బార్డ్కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- వరంగల్ హత్యలు: ‘‘ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’
- రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే
- పాకిస్తాన్: 'పది అడుగుల ఎత్తు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాను...' - కరాచీ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ జుబైర్
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్టాక్ చూపించింది’
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








