IPL auction: దృష్టి అంతా ఈ ఆటగాళ్ల మీదే

ఐపీఎల్ ట్రోఫీ

ఫొటో సోర్స్, Twitter / IPL

ఐపీఎల్ 13వ సీజన్‌కు ఆటగాళ్ల వేలం డిసెంబర్ 19న (ఇవాళ) కోల్‌కతాలో జరుగుతుంది. ఇందులో 332 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ జాబితాలో 186 మంది భారత ఆటగాళ్లు, 143 మంది విదేశీయులు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి ముగ్గురిని ఎంపిక చేశారు.

ప్రధాన దృష్టి ఎవరి మీద?

తమ కనీస ధర రూ.2 కోట్లుగా ఏడుగురు విదేశీ ఆటగాళ్లు ప్రకటించారు. వారిలో ఇద్దరు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు పాట్ కమిన్స్, జోష్ హజ్లెవుడ్.

మానసిక సమస్యతో కొద్దికాలం పాటు విరామం తీసుకున్న మాక్స్‌వెల్ ఈ వేలంలో భారీగానే ధర పలికేలా ఉన్నాడు. అతడు ఇంతకుముందు ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ జట్లలో ఆడాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఉన్న క్రిస్ లిన్ కూడా ఈ వేలంలో పాల్గొంటున్నాడు. ఆల్- రౌండర్ మిచెల్ మార్ష్ ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. కానీ, ఫిట్‌నెస్, వివాదాస్పద ప్రవర్తన కారణంగా అతనికి అవకాశం దొరకడం అనుమానమే.

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాడు. అతడు ఇంతకు ముందు డెక్కన్ ఛార్జర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున ఆడాడు.

శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్, ఆల్‌- రౌండర్ మాథ్యూస్ తనదైన ముద్ర వేసుకోవాలని చూస్తున్నాడు. కానీ, అతని ఫిట్‌నెస్ జట్టుకు సమస్యలు తెచ్చిపెట్టొచ్చు.

ఐపీఎల్, మాక్స్‌వెల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాక్స్‌వెల్

ఓల్డ్ ఈజ్ గోల్డ్

అత్యధిక కనీస ధర ఉన్న భారత ఆటగాళ్లు రోబిన్ ఉతప్ప, పీయూష్ చావ్లా, యూసుఫ్ పఠాన్, జయదేవ్ ఉనాడ్కట్. వీళ్లందరూ తమ కనీస ధర రూ.1.5 కోట్లుగా ప్రకటించారు.

ఉతప్ప, చావ్లాలను కోల్‌కతా తొలగించింది. యూసుఫ్ పఠాన్‌ను తప్పించాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణయించింది.

గత సీజన్‌లో జయదేవ్ ఉనాడ్కట్‌ను రాజస్థాన్ జట్టు రూ.8 కోట్లకు దక్కించుకుంది. కానీ, ఆశించినంతగా అతడు రాణించలేకపోయాడు. దాంతో, అతడిని ఈసారి తప్పించాలని జట్టు యాజమాన్యం నిర్ణయించింది.

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జయదేవ్ ఉనాడ్కట్

యువ ఆటగాళ్లు

అండర్-19లో, స్థానిక టోర్నమెంట్లలో తమదైన మార్కు చూపించిన ముగ్గురు యువ ఆటగాళ్లు ఇప్పుడు ఐపీఎల్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంటులో ముంబయికి చెందిన యశస్వి జైశ్వాల్ ద్విశతకం చేశాడు. దూకుడుతో కూడిన బ్యాటింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న అతడిని తీసుకునేందుకు చాలా జట్లు ఆసక్తిగా ఉన్నాయి.

వచ్చే ఏడాది జరగబోయే అండర్19 టోర్నమెంటులో భారత జట్టుకు ప్రియం గార్గ్ నాయకత్వం వహించనున్నాడు. అయితే, దానికంటే ముందు అతని మీద ఐపీఎల్ జట్ల కన్ను పడింది. వరుస మ్యాచ్‌లలో ప్రతిభ చూపుతున్న అతడు ఐపీఎల్‌లో జట్టులో చేరతాడన్నది ఆసక్తిగా మారింది.

ప్రయాస్‌ బర్మన్‌ గత ఏడాది బెంగళూరు జట్టులో ఉన్నాడు. కానీ, ఆ సీజన్ ముగిశాక అతడిని తొలగించాలని జట్టు నిర్ణయించింది. కాబట్టి, ఇప్పుడు అతడు కూడా వేలంలో ఉన్నాడు.

IPL, యశస్వి జైస్వాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యశస్వి జైస్వాల్

ఎవరిని అదృష్టం వరిస్తుంది?

భారత టెస్ట్ క్రికెట్ జట్టుకు వెన్నెముక చటేశ్వర్ పుజారా, ఆల్- రౌండర్ హనుమ విహారి, బౌలర్ మోహిత్ శర్మ, ఆల్- రౌండర్ దీపక్ హుడా, బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠీ, విరాట్ సింగ్‌ల పేర్లు బాగా చర్చలో ఉన్నాయి.

ఫాస్ట్ బౌలర్ ఇషాన్ పోరెల్ స్థిరంగా ఆడాడు, వికెట్లు తీశాడు. అతడి పేరు కూడా వేలంలో ముందువరుసలో ఉండే అవకాశం ఉంది.

చాలా ఏళ్లుగా డేవిడ్ మిల్లర్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ జట్టులో ఉన్నాడు. కానీ, ఈ ఏడాది అతడు వేలంలో ఉన్నాడు. విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా, అద్భుతమైన ఫీల్డర్‌గా మిల్లర్‌కు గుర్తింపు ఉంది.

షిమ్రాన్ హెట్‌మయర్ కూడా వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాడు.

ఏ జట్టు దగ్గర ఎంత డబ్బుంది? ఎంత మంది ఆటగాళ్లను కొనగలదు?

ఇప్పటి వరకు ఐపీఎల్ విజేతలు (జట్లు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)