కేరళ: నలుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు పెళ్లి కొడుకులు, ఒకే రోజు పెళ్లి

ఫొటో సోర్స్, Uthara
- రచయిత, స్వామినాథన్ నటరాజన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేరళకు చెందిన ఈ నలుగురు అక్కాచెల్లెళ్లు ఒకే రోజు జన్మించారు. చిన్నప్పటి నుంచీ ఒకే ఇంట్లో... ఒకే ఆహారం... ఒకే రకమైన వస్త్రధారణతో పెరిగారు. అంతేకాదు, 15 ఏళ్లు వచ్చే వరకూ పాఠశాల తరగతి గదిలోనూ ఒకే వరుసలో కూర్చునేవారు.
ఇప్పుడు ఈ నలుగురూ ఒకే రోజు పెళ్లిపీటలు ఎక్కేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.
ఈ అయిదుగురు కవలలు (ఈ నలుగురు అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు) పుట్టినప్పటి నుంచే వార్తల్లో నిలిచారు. తక్కువ బరువుతో పుట్టిన వారి ఆరోగ్య సమస్యలు, తొమ్మిదేళ్ల వయసులోనే వారు తండ్రిని కోల్పోవడం లాంటి ఇబ్బందుల గురించి స్థానిక మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి.
ఇప్పుడు పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంగా వారు తమ గురించి బీబీసీతో పంచుకున్నారు.

ఫొటో సోర్స్, Uthara
ఒకే రోజు పెళ్లి
వీళ్ల పేర్లు... ఉత్రా, ఉత్రజా, ఉతరా, ఉతమా. వీరి సోదరుడి పేరు ఉత్రాజన్.
1995 నవంబర్ 18న జన్మించిన ఈ నలుగురు అక్కాచెల్లెల్లూ 2020 ఏప్రిల్ 26న వివాహం చేసుకోవాలని నిర్ణయించారు.
"ఇప్పుడు మా ఇంటి దగ్గర చర్చ అంతా మా పెళ్లి గురించే. మేము ఇంకా పెళ్లి చీరలు కొనాల్సి ఉంది. అందరమూ ఒకే డిజైన్, ఒకే రంగు బట్టలు తీసుకుంటాం’’ అని ఉతరా చెప్పారు.
ఆమె ఒక జర్నలిస్టు. ఆమెకు కాబోయే భర్త కూడా రిపోర్టర్గా పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Uthara
తమ పెళ్లి హిందూ సంప్రదాయాల ప్రకారం ఓ ప్రముఖ ఆలయంలో జరుగుతుందని వాళ్లు చెప్పారు. భాగస్వాములను ఎవరికి వారు ఎంచుకోకుండా, ఆ బాధ్యతను కుటుంబ పెద్దలకు అప్పగించారు.
మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా సంబంధాలు చూసేందుకు వీరికి తల్లి రెమా దేవి సాయపడ్డారు.
సాధారణంగా ఇలాంటి పెళ్లిళ్లలో వధూవరుల కులం, మతాలతో పాటు ఆర్థిక పరమైన విషయాలు, విద్యార్హతలను ఎక్కువగా చూస్తుంటారు. వధూవరుల జాతకాలు కలుస్తున్నాయో లేవో పండితులు చూసి చెబుతుంటారు.
కానీ, వీళ్లవి అలాంటి పెద్దలు చూసి, నిశ్చయించిన పెళ్లిళ్లు కాదు. వధూవరుల పరస్పర ఇష్టాల ప్రకారమే పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Uthara
2019 సెప్టెంబర్లో నిశ్చితార్థం జరిగింది. అయితే, ఈ నలుగురు అక్కాచెల్లెళ్లలో ముగ్గురు కువైట్లో ఉద్యోగాలు చేస్తుండటంతో వాళ్లు తమ సొంతూరిలో జరిగిన ఆ వేడుకకు రాలేకపోయారు.
పెళ్లి మాత్రం ఎవరికీ అడ్డంకులు రాకుండా పక్కా ప్రణాళికతో ఒకేరోజు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
వీరి వివాహానికి దగ్గరి బంధువులు, స్నేహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. మీడియా రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లు కూడా పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Uthara
వీళ్లందరూ చిన్నప్పటి నుంచీ కలిసే పెరిగినా ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక అభిరుచి ఉంది.
ఉత్రజా చదువులో దిట్ట. ఉతమాకు సంగీతం అంటే ప్రాణం, అందుకే ఆమె వయోలిన్ నేర్చుకోవడం ప్రారంభించారు. ఉత్రా ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నారు. ఉత్రజా, ఉతమా ఇద్దరూ ఆస్పత్రిలో అనస్తీషియా టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు.
"మాలో ఒకరిద్దరికి పెళ్లి సంబంధాలు ముందే వచ్చాయి. కానీ, మేమంతా ఒకే రోజు పెళ్లి చేసుకోవాలనేది మా అమ్మ కోరిక. దాంతో అందరికీ సంబంధాలు దొరికే వరకూ వేచిచూశాం’’ అని ఉత్రజా బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Uthara
భారత్లో పెళ్లి అంటే భారీ ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిపోయింది. అలాంటప్పుడు, నలుగురు అమ్మాయిలకు పెళ్లిళ్లు వేర్వేరుగా చేయడం అంటే ఆ కుటుంబానికి ఖర్చు భారీగా అవుతుంది.
అయితే, ఖర్చు విషయమే కాదు, తన బిడ్డలందరూ ఒకేసారి పెళ్లి చేసుకోవాలన్న సెంటిమెంట్ కూడా తల్లిలో బలంగా ఉండటం కూడా వీరికి ఒకేసారి పెళ్లి చేయడానికి ఒక కారణం.
ఉత్రజా... ఆకాశ్ కుమార్ను వివాహం చేసుకోబోతున్నారు. అయితే, ప్రస్తుతం ఉత్రజా భారత్లోనే పనిచేస్తుండగా, ఆకాశ్ మాత్రం కువైట్లో పనిచేస్తున్నారు. గతంలో ఇద్దరూ భారత్లోనే ఒకే ఆస్పత్రిలో పనిచేసేవారు. ఇద్దరి కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
మిగతా ముగ్గురూ వైవాహిక జీవితం ప్రారంభించేందుకు చాలా ఉత్సాహంతో ఉన్నారు. వారి సోదరుడు ఉత్రాజన్ మాత్రం విదేశాలకు వెళ్లి కెరీర్లో స్థిరపడిన తర్వాత వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Uthara
అయిదుగురు కవలలు పుట్టగానే వారి తల్లిదండ్రులు 'పంచరత్నాలు' అంటూ ఆనందంలో మునిగితేలారు. అయిదుగురూ బాగున్నారని వైద్య పరీక్షల్లో తేలినా, బరువు చాలా తక్కువ ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళనపడ్డారు.
తర్వాత తరచూ అనారోగ్యం బారిన పడుతుండేవారని వారి తల్లి రెమా దేవి గుర్తుచేసుకున్నారు. అయిదుగురు పిల్లల వైద్య ఖర్చులు, చదువు, పోషణ కోసం ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Uthara
అయితే, వాళ్లందరూ 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇంటికి పెద్ద దిక్కు అయిన తండ్రి చనిపోయారు. ఆయన స్టేషనరీ దుకాణం నడిపేవారు. దాని ద్వారా వచ్చే ఆదాయంతోనే కుటుంబం గడిచేది. కానీ, తర్వాత ఓ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోవడంతో 2004లో ఆత్మహత్య చేసుకున్నారు.
ఆయన చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. వారి పరిస్థితి గురించి మీడియాలో పెద్దఎత్తున కథనాలు వచ్చాయి. దాంతో స్పందించిన కేరళ ప్రభుత్వం రెమా దేవికి స్థానిక బ్యాంకులో ఉద్యోగం కల్పించింది.
"ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇవ్వడం వల్ల నా పిల్లలను పోషించుకోగలిగాను" అని రెమా దేవి అంటున్నారు.
అయిదుగురు పిల్లలూ బాగా చదువుకున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- చిన్న వయసులో ఫిన్లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్
- పాస్వర్డ్లతో భద్రత లేదా? బయోమెట్రిక్స్ సురక్షితమేనా?
- మీకు ఇలాంటి వాట్సాప్ కాల్ ఎప్పుడైనా వచ్చిందా.. వస్తే అనుమానించాల్సిందే
- మీ చేతిలోని స్మార్ట్ ఫోనే మీకు శత్రువుగా మారితే...
- ‘బికినీ’ లేని అందాల పోటీని మీరు వీక్షిస్తారా?
- #100WOMEN: మహిళ 'అందం' అనే భారాన్ని మోయాల్సిన అవసరం ఏముంది: నందితా దాస్
- అక్కినేని అమల: హుందాగా వయసును ఆహ్వానిద్దాం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)








