కేసీఆర్: ‘‘ఒక్క కార్మికుడినీ తీసేయం, ఒక్క రూటులోనూ ప్రైవేటు బస్సును అనుమతించం, బడ్జెట్లో ఏటా వెయ్యి కోట్లు ఇస్తాం’’

టీఎస్‌ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్

ఫొటో సోర్స్, facebook/TelanganaCMO

    • రచయిత, బళ్ల సతీష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆర్టీసీలో ఒక్క ఉద్యోగినీ ఉద్యోగంలోంచి తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఒక్క రూటులో ఒక్క ప్రైవేటు బస్సుకు కూడా అనుమతి ఇవ్వబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.

వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని వెల్లడించారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని, ప్రతీ ఏడాది వెయ్యి కోట్ల రూపాయల లాభం ఆర్టీసీకి రావాలని, ప్రతీ ఉద్యోగీ ఏడాదికి లక్ష రూపాయల బోనస్ అందుకునే స్థితి రావాలని ఆకాంక్షించారు.

సెప్టెంబర్ నెల జీతాన్ని సోమవారమే అందించనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి, సమ్మె కాలానికి సంబంధించిన వేతనాన్ని ఏకమొత్తంలో అందిస్తామని ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 97 డిపోల నుంచి డిపోకు ఐదుగురు చొప్పున కార్మికులు పాల్గొన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఈడీలు, ఆర్ఎంలు, డీవీఎంలు, డీఎంలు, కంట్రోలర్లు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కేసీఆర్, తర్వాత రెండు గంటల పాటు వారితో సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ప్రతీ అంశంపైనా, ప్రతీ సమస్యపైనా సీఎం స్పందించి, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్

ఫొటో సోర్స్, @TelanganaCMO

ఆర్టీసీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నిర్ణయాలు:

  • ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి. అందరినీ ఉద్యోగులు అనే పిలవాలి. యాజమాన్యం, ఉద్యోగులు వేర్వేరు కారు. అందరూ ఒకటే, ఒకటే కుటుంబం లాగా వ్యవహరించాలి.
  • ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన సెప్టెంబర్ నెల జీతాన్ని మంగళవారం (డిసెంబర్ 2న) చెల్లిస్తాం.
  • ఉద్యోగులు సమ్మె చేసిన 55 రోజులకు కూడా వేతనం చెల్లిస్తాం.
  • ఉద్యోగుల ఇంక్రిమెంట్ యధావిధిగా ఇస్తాం.
  • సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలి. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున రెండు లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం.
  • వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్లు కేటాయిస్తాం.
  • ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతాం.
  • ఆర్టీసీ ఉద్యోగులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత ఉంటుంది.
  • సంపూర్ణ టికెట్ బాధ్యత ప్రయాణీకుడిపైనే ఉంటుంది. ఆ కారణంతో కండక్టర్లపై చర్యలు తీసుకోము.
  • కలర్ బ్లైండ్‌నెస్ ఉన్న వారిని వేరే విధుల్లో చేర్చుకోవాలి తప్ప, ఉద్యోగం నుంచి తొలగించవద్దు.
  • మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వేయవద్దు. రాత్రి 8 గంటలకు వారు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు చేయాలి.
  • ప్రతీ డిపోలో కేవలం 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్ చేంజ్ రూమ్స్, లంచ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి
  • మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేస్తాం.
  • మహిళా ఉద్యోగుల ఖాకీ డ్రెస్ తొలగిస్తాం. వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్ వేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. పురుష ఉద్యోగులు కూడా ఖాకీ డ్రస్సు వద్దంటే వారికీ వేరే రంగు యూనిఫామ్ వేసుకునే అవకాశం కల్పిస్తాం.
  • మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తగు సూచనలు చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం.
  • రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదు.
  • ప్రతీ డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం.
  • ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వర్తించేలా ఆర్టీసీలో హెల్త్ సర్వీసులు అందించాలి. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుకునేలా చర్యలు తీసుకోవాలి.
  • ప్రతీ డిస్పెన్సరీలో ఉద్యోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలి. మందుల కోసం బయటకు తిప్పవద్దు.
  • ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్సు పాసులు అందించాలి.
  • ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంటు సౌకర్యం వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది.
  • ఉద్యోగుల పీఎఫ్ బకాయిలను, సీసీఎస్‌కు చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తాం.
  • డిపోల్లో కావాల్సిన స్పేర్ పార్టులను సంపూర్ణంగా అందుబాటులో ఉంచుతాం.
  • ఆర్టీసీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేస్తాం.
  • ఆర్టీసీ కార్మికుల గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది.
  • ఆర్టీసీలో పార్సిల్ సర్వీసులను ప్రారంభించాలి.
ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ మధ్యాహ్న భోజనం

ఫొటో సోర్స్, @TelanganaCMO

‘‘నేనే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తా’’

అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేసి ఆర్టీసీని బతికించుకోడానికి ప్రతిజ్ఞ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. సమష్టిగా కష్టపడి పోరాటం చేసి, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న స్ఫూర్తితోనే ఆర్టీసీని లాభాల బాటన నడిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.

తాను రవాణా శాఖ మంత్రిగా మూడేళ్లు పనిచేసి, ఆర్టీసీని లాభాల బాట పట్టించానని, నేటికీ తనకు ఆర్టీసీపై ఎంతో ప్రేమ ఉందని సీఎం అన్నారు. ఆర్టీసిని బతికించడానికి ప్రభుత్వం తరుఫున చేయాల్సిందంతా చేస్తామని, ఇక అధికారులు, ఉద్యోగులు కలిసి పని చేసి, ఆర్టీసీని కాపాడాలని చెప్పారు. నష్టాల్లో ఉన్న డిపోలను లాభాల బాట పట్టించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, రూట్లను రీ సర్వే చేయాలని సూచించారు.

ఆర్టీసీకి తానే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా ప్రతీ నెలా ఒక రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కోరతామన్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రతీ రెండు నెలలకోసారి డిపో మేనేజర్లతో సమీక్ష నిర్వహించాలని, రవాణా మంత్రి నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. అవసరమైన పక్షంలో రోజుకు గంటో, అర గంటో ఎక్కువ పనిచేయాలని ముఖ్యమంత్రి కోరగా, కార్మికులు హర్షధ్వానాలతో అంగీకరించారు.

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడే ఏకైక ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని సీఎం ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేటుకు ఇవ్వలేదని గుర్తించారు. విద్యుత్ ఉద్యోగుల మాదిరిగా ఎక్కువ వేతనాలు, సింగరేణి కార్మికుల మాదిరిగా ప్రతీ ఏటా బోనస్‌లు అందుకునే పరిస్థితి ఆర్టీసీ ఉద్యోగులకు రావాలని సీఎం ఆకాంక్షించారు.

ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్

ఫొటో సోర్స్, @TelanganaCMO

ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం

ప్రగతి భవన్‌లో ఆర్టీసీ ఉద్యోగులతో భోజనం చేసే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రైవర్లు, కండక్టర్లతో ఆత్మీయంగా మాట్లాడి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. సీఎం చాలా ఆప్యాయంగా పలకరించడంతో మహిళా కండక్టర్లు తమ సమస్యలను వివరించారు. సీఎంకు ఎంతో చొరవగా తమ కష్టసుఖాలను చెప్పుకున్నారు.

పిట్టకథ

నడుమ నడుమ సీఎం విసిరిన ఛలోక్తులు సందర్భోచిత సామెతలు సమావేశంలో ఉన్న ప్రతివొక్కరిని కడుపుబ్బ నవ్వించాయి. ప్రతి పని చేసేటప్పుడు చెడగొట్టేవాళ్ళు ఉంటారని చెబుతూ ముఖ్యమంత్రి రామాయణ యుద్ధం గురించి ప్రస్తావించి ఆర్టీసీ ఉద్యోగులను కడుపుబ్బ నవ్వించారు.

యుద్ధంలో రామబాణం వల్ల అర్ధాయుష్షుతో మరణించిన రాక్షసులు కొందరు తమ పరిస్థితి ఏమిటని రాముణ్ణి అడిగినప్పుడు కలియుగంలో మీరు అక్కడక్కడా పుట్టండి అంటారు. అలా పుట్టిన వారే మనుషులను పీక్కుతింటున్నారని, వారే ఆర్టీసీలో అందరినీ ఇబ్బంది పెడుతున్నరు అంటూ ముఖ్యమంత్రి పేర్కొనడంతో సమావేశంలో నవ్వులు విరిశాయి.

ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్

ఫొటో సోర్స్, @TelanganaCMO

వెటర్నరీ డాక్టర్అత్యాచారం, హత్యపై సీఎం కేసీఆర్ స్పందన

ఆర్టీసీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ శివార్లలోని షాద్ నగర్ సమీపంలో వెటర్నరీ డాక్టర్‌ అత్యాచారం, హత్య ఘటనను ప్రస్తావించారు. మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీలు వద్దని చెప్పారు. మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయని అన్నారు. ఇది దారుణమైన ,అమానుషమైన దుర్ఘటనగా అభివర్ణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)