'జై శ్రీరాం' అనాలంటూ ముస్లిం యువకుడిపై దాడి: పోలీసులు, హిందూసేన కార్యకర్తలు ఏమంటున్నారు

బర్కత్ ఆలం

మే 25న దిల్లీలోని ఓ మసీదులో ప్రార్థన చేసి, ఇంటికి వెళుతున్న ఓ యువకుడిని కొందరు వ్యక్తులు అడ్డుకుని, తలపైన ముస్లిం సంప్రదాయ టోపీని ధరించరాదని, 'జై శ్రీరామ్' అనాలంటూ దాడి చేశారన్న వార్త వెలుగుచూసింది.

మే చివరి శనివారంనాడు నమాజ్ చేయడానికి బర్కత్ ఆలం మసీదుకు వెళ్లారు. ప్రార్థన చేశాక, ఇంటికి వెళుతున్న సమయంలో తనపై ఒక హిందూ మూక 'జై శ్రీరామ్' అనాలంటూ దాడి చేశారని బర్కత్ ఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బీబీసీ బర్కత్ ఆలంతో మాట్లాడింది.

''ఇంత గట్టిగా పిలుస్తున్నా వినపడటం లేదా అని బూతులు తిడుతూ అడిగారు. నీకు తెలియదా ఈ ఏరియాలో టోపీ ధరించడానికి అనుమతి లేదు. ముందు టోపీ తియ్యి అన్నారు. నమాజ్ చదివి వెళ్తున్నాను, టోపీ ఎందుకు ధరింకూడదని నేను అడిగాను. నన్ను చెంపదెబ్బ కొట్టి, నా టోపీని కింద పడేశారు. పోలీసుల దగ్గరికెళ్లి ఎఫ్ఐఆర్ రాయించాను. 'జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై' అనిపించారని చెప్పాను. కానీ ఎఫ్ఐఆర్‌లో అటువంటి విషయాలేమీ ప్రస్తావించలేదు'' అని బర్కత్ తెలిపారు.

వీడియో క్యాప్షన్, వీడియో: ‘జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై అనాలంటూ దాడి చేశారు’

గాయపడిన బర్కత్‌‌ను స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

తనతో బలవంతంగా 'జై శ్రీరామ్' నినాదాన్ని చెప్పించారని, తలపై ధరించే తెల్లని టోపీని కూడా తీసేయమన్నారని బర్కత్ చెబున్నారు.

ఉద్యోగ వేటలో భాగంగా బర్కత్ దిల్లీకి వచ్చారు. కానీ ఈ సంఘటన తర్వాత, ఎక్కడ మరోసారి దాడి చేస్తారోననే భయంతో తన సొంత రాష్ట్రమైన బిహార్‌కు తిరిగి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు.

దాడికి పాల్పడ్డవారిపై మత ఘర్షణలను ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణలతో ఐపీసీ 153ఏ సెక్షన్ కింద గుర్‌గ్రామ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే, ఈ ఘటనపై బర్కత్ ఆలంతోపాటు పోలీసుల వాదన మరోలా ఉంది. అతనితో ఎవరో అలా చెప్పించినట్లు అనిపిస్తోందని, టీవీల్లో వచ్చిన అతని స్టేట్‌మెంట్లు చూస్తే మీకే అర్థమవుతుందని గురుగ్రామ్ పోలీస్ కమిషనర్ అంటున్నారు.

ఈ ఘటన పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్ర అని హిందూసేన ఆరోపిస్తోంది.

"ఇదంతా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్లాన్ ప్రకారం అతణ్ని హాస్పటల్‌కు తీసుకెళ్లారు. అతనికి ఎక్కడా రక్తం రాలేదు. కట్టు కట్టలేదు. చొక్కా చిరిగింది. తోపులాటలో చొక్కా చిరగడం సాధారణం. కొట్టారని చెబితే డాక్టర్లు పోలీసులను పిలుస్తారని వారికీ తెలుసు. అప్పుడు అది పెద్ద విషయమవుతుంది. అసలు అక్కడ గొడవే లేదు" అని హిందూ సేన జాతీయ వైస్ ప్రెసిడెంట్ సుర్జీత్ యాదవ్ అన్నారు.

స్థానిక ముస్లింలు మాత్రం దీనిపై భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. "జై శ్రీరామ్ అనడంతో తప్పేమీ లేదు. కానీ మాతో బలవంతంగా అలాంటి పనులు చేయించడం సహించలేము" అని వారంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)