బడ్జెట్ 2019 : వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితి పెరగలేదు...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వేణుగోపాల్ బొల్లంపల్లి
- హోదా, బీబీసీ ప్రతినిధి
వ్యక్తిగత ఆదాయ పన్ను గురించి ప్రకటన చేస్తూ ఆర్థిక మంత్రి రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని అన్నారు.
పన్ను రిబేటును అయిదు లక్షల వరకు పొడిగిస్తున్నామని ప్రకటించారు.
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, గోయల్ వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిలో మార్పులు చేయలేదు. శ్లాబులు కూడా మార్చలేదు. పెంచిదల్లా రిబేటు పరిమితి మాత్రమే.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ రిబేటు మతలబు?
ఇది తెలియాలంటే.. ముందుగా మనం ఒక పదాన్ని అర్థం చేసుకోవాలి. అది పన్ను చెల్లించాల్సిన ఆదాయం.
అంటే, మొత్తం ఆదాయం నుంచి 80C 80డి వంటి సెక్షన్ల కింద పన్ను రాయితీలు పోగా.. మిగిలిన ఆదాయాన్ని పన్ను చెల్లించాల్సిన ఆదాయం అంటారు.
ఇప్పుడు ఆదాయపు పన్ను పరిమితి పెంచకుండా రూ. 5 లక్షల మాటేమిటి? అనే విషయానికి వద్దాం.
హైదరాబాద్కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ (సి.ఏ) టి.ఎస్.ఎన్. మూర్తి విశ్లేషణ:
తాజా బడ్జెట్లో ఆదాయపు పన్ను పరిమితి పెరగలేదు.
అయితే, పన్ను చెల్లించాల్సిన ఆదాయం అయిదు లక్షలోపు ఉన్నవారికి కొత్త బడ్జెట్ వల్ల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
పన్ను చెల్లించాల్సిన ఆదాయం అయిదు లక్షలు దాటిన వారికి మాత్రం రూ. 12,500 పన్ను రిబేటు వర్తించదు.
పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ. 5 లక్షల కన్నా ఒక్క రూపాయి ఎక్కువున్నా, వారు రూ. 12,500 చెల్లించాల్సిందే. రూ. 5 లక్షల మీద ఉన్న ఆదాయానికి ప్రస్తుత రేట్ల ప్రకారం 20 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సిందే.
అంటే, రూ. 5 లక్షల ఆదాయం దాటిన వారికి కొత్త బడ్జెట్ ప్రకారం పాత రిబేట్ వర్తించదు. సింపుల్గా చెప్పాలంటే అయిదు లక్షలకు మించి పన్ను చెల్లించే ఆదాయం ఉన్నవారికి ఈ బడ్జెట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
వారికి పన్ను పరిమితి.. పన్ను శ్లాబుల్లో ఏమాత్రం తేడా ఉండదు.
తాజా బడ్జెట్ ప్రతిపాదన ప్రకారం, 87A కింద టాక్స్ రిబేటును అయిదు లక్షలకు పెంచారు. దీని వల్ల రూ. 12500 పన్ను ప్రయోజనం ఉంటుంది. అయితే ఇది అయిదు లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారికే వర్తిస్తుంది.
అయిదు లక్షల తర్వాత ఒక్క రూపాయి అదనపు ఆదాయం ఉన్నా రూ.12500 పన్ను కట్టాల్సిందే.
గతంలో ఈ రిబేటు మూడున్నర లక్షల ఆదాయం లోపువారికి (రూ.2500) వర్తించేది. అంటే కొత్తగా అయిదు లక్షలోపున్న లక్షన్నరకు రిబేటు ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఓ ఉదాహరణ చూద్దాం.
పై ఉదాహరణ ప్రకారం.. కొత్త బడ్జెట్ ప్రకారం అయిదు లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపులో ఏమీ తేడా లేదు.
కొత్త బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం.. అయిదు లక్షలలోపు వేతనం పొందేవారికి 13 వేల దాకా పన్ను ప్రయోజనం చేకూరుతుంది. (ఎందుకంటే స్టాండర్డ్ డిడక్షన్ను 40,000 నుంచి 50,000కు పెంచారు. దీని వల్ల 500 దాకా అదనపు పన్ను ప్రయోజనం ఉంటుంది.)
ఇప్పుడో పే స్లిప్ చూద్దాం
ఉదాహరణకు.. వార్షికాదాయం రూ.8 లక్షలున్న వ్యక్తి ఎంత పన్ను చెల్లించాలో చూద్దాం. ఇక్కడ కేవలం సెక్షన్ 80సి రాయితీలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తున్నాం. (ఇతర రాయితీలు వర్తించే వారు వాటినీ యాడ్ చేసుకోవచ్చు.)

ఫొటో సోర్స్, lOK SABHA TV
మొత్తం వార్షికాదాయం రూ. 8 లక్షలు
80సీ కింద 1.50 లక్షలు తీసేద్దాం.
మిగిలింది రూ. 6.50 లక్షలు. ఇది పన్ను చెల్లించాల్సిన ఆదాయం అవుతుంది.
దీనికి ఎంత పన్ను పడుతుందో చూద్దాం.
2.5 లక్షల వరకు పన్ను 0.
అయిదు లక్షల లోపు 2.5 లక్షలకు పన్ను 5 శాతం అంటే రూ. 12,500
6.5 లక్షల్లో 5 లక్షలు పోతే.. మిగిలిన 1.5 లక్షలు 20 శాతం శ్లాబులోకి వస్తుంది.
అంటే, దీనికి 30 వేలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
మొత్తం లెక్కిస్తే.. రూ.8 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి 80సీ మాత్రమే క్లెయిమ్ చేస్తే 42500 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- బడ్జెట్ 2019: ఐదు లక్షల లోపు వ్యక్తిగత ఆదాయానికి పన్ను లేదు
- రిటైర్ అయ్యాక జీవితం హాయిగా సాగాలంటే ఏం చేయాలి?
- జీఎస్టీకి ఏడాది.. ఇదీ దాని చరిత్ర
- పీపీఎఫ్ ఖాతాతో ప్రయోజనాలేంటి?
- గ్రాట్యుటీని ఎలా లెక్కిస్తారు?
- వర్షాలకు, వడ్డీ రేట్లకు సంబంధం ఏమిటి?
- బీమా తీసుకునేటపుడు ఏ విషయాలు పరిశీలించాలి?
- ఆయుష్మాన్ భారత్ - ఆరోగ్య బీమాతో ప్రయోజనాలివీ..
- భారత దేశ మొదటి బడ్జెట్ ఎంతో తెలుసా?
- ధరల క్యాలికులేటర్: ఇప్పుడు కేజీ 100 - మరి పదేళ్ల కిందట?
- Fact Check: కనీస ఆదాయ పథకం ప్రపంచంలో మరెక్కడా లేదా?
- వ్యవసాయానికి సాయం చేస్తున్న మొదటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








