నేషనల్ పెన్షన్ సిస్టమ్ - ఎన్.పి.ఎస్ ప్రయోజనాలేమిటి? :లబ్డబ్బు
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
2018 సంవత్సరం చివరి ఘట్టానికి చేరుకుంది. మరి కొద్ది రోజుల్లో చివరి నెల మొదలు కాబోతోంది. సమయం ఎంత వేగంగా గడిచిపోతుందో కదా! అయితే పరుగులు తీసే కాలానికి తగినట్లుగా మీరు మీ రిటైర్మెంట్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారా?
అప్పుడేనా, మాకింకా చాలా సమయం ఉందిలే అనుకుంటారేమో? రిటైర్మెంట్ ప్లాన్ ఎంత త్వరగా చేసుకుంటే మీ ఫ్యూచర్ అంత సేఫ్ అంటున్నారు ఆర్థికవ్యవహారాల నిపుణులు. అందుకే ఎన్పిఎస్(నేషనల్ పెన్షన్ సిస్టం) అంటే ఏంటో, దాంతో కలిగే లాభాలేంటో ఈ వారం లబ్ డబ్బులో తెలుసుకుందాం.
నేషనల్ పెన్షన్ సిస్టం అనేది ఒక ప్రభుత్వ పథకం. దీన్ని 2004లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రారంభించారు. ఆ తర్వాత 2009లో అన్ని వర్గాల ప్రజల కోసం దీని తలుపులు తెరిచారు.
ఈ స్కీమ్లో నమోదు చేసుకున్న వారికి తమ వేతనంలో కొంత భాగాన్ని పెన్షన్ అకౌంట్లో డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. రిటైర్ అయ్యాక సభ్యులు తమ డబ్బు వెనక్కి తీసుకోవచ్చు.
ఎన్పిఎస్ అకౌంట్ తెరవడానికి చాలా పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (పీఓపీలు) ఏర్పాటు చేశారు. దాదాపు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు అన్నిటిలో పీఓపీలు ఉన్నాయి.
65 ఏళ్ల లోపు వయసు గల భారతీయ పౌరులెవరైనా ఈ స్కీమ్లో అకౌంట్ తెరవచ్చు.

టయర్ 1 అకౌంట్ - ఈ అకౌంట్ తెరవడం తప్పనిసరి. ఈ ఖాతాలో జమ చేసే నగదును గడువుకు ముందే, అంటే రిటైర్ అయ్యే ముందే వెనక్కి తీసుకోలేరు. దీనిపై టాక్స్ బెనిఫిట్ ఉంటుంది.
అకౌంట్ తెరిచేటప్పుడు టయర్-1 ఖాతాలో కనీసం 500 రూపాయలు, సంవత్సరానికి కనీసం 1000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
టయర్ 2 అకౌంట్ - టయర్ 1 అకౌంట్ ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ అకౌంట్ తెరవచ్చు. ఈ ఖాతా తెరచిన వాళ్లు తమ ఇష్టానుసారం ఎప్పుడైనా డబ్బు డిపాజిట్ చేయొచ్చు. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి కూడా తీసుకోవచ్చు.
ఈ ఖాతా తెరవడం తప్పనిసరేమీ కాదు. టయర్-2 అకౌంట్ తెరవాలంటే 250 రూపాయలు డిపాజిట్ చేస్తే చాలు. ఇందులో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచడం తప్పనిసరేమీ కాదు.
ఈ పెన్షన్ ఫండ్లో ఇన్వెస్టర్లు డిపాజిట్ చేసే డబ్బును షేర్లు, బాండ్ల మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్లో ఉన్న అప్ అండ్ డౌన్స్ ప్రకారం లాభం ఆధారపడి ఉంటుంది.
ప్రభుత్వ ఉద్యోగులు కానివారు, 50 ఏళ్లకన్నా తక్కువ వయసున్న వారు తమ ఇష్టప్రకారం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాల్సిన మొత్తాన్ని 75 శాతం వరకు ఉంచుకోవచ్చు.
అయితే ఆ తర్వాత ఈ పరిమితి దానంతటదే 50 శాతానికి పరిమితమవుతుంది.

ఒకవేళ కనీస మొత్తం డిపాజిట్ చేయని పక్షంలో మీ ఖాతా ఫ్రీజ్ అవుతుందన్న విషయం పక్కాగా గుర్తు పెట్టుకోవాలి.
మీ ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయించుకోవాలనుకుంటే మీరు ఏదైనా పీఓపీ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఏడాదికి 100 రూపాయల చొప్పున జరిమానా చెల్లించి ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయించుకోవాలి.
ఒకవేళ మీరు 60 ఏళ్ల వయసు వరకు 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారనుకోండి... ఆ పది లక్షల్లో 40 శాతం... అంటే 4 లక్షల రూపాయల పెన్షన్ డబ్బుతో యాన్యుటీ ప్లాన్ కొనుక్కోవాల్సి ఉంటుంది.
మిగిలిన 6 లక్షల రూపాయల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. కావాలంటే మొత్తం పెన్షన్ డబ్బుతో యాన్యుటీ ప్లాన్ కొనుక్కోవచ్చు.
ఒకవేళ మీరు మొత్తం 10 లక్షల రూపాయలతో యాన్యుటీ ప్లాన్ కొనుక్కుంటే, అప్పటికి వడ్డీ రేటు 6 శాతం ఉంటే, అప్పుడు బీమా సంస్థ మీకు జీవితాంతం సంవత్సరానికి 60 వేల రూపాయలు, అంటే, నెలకు 5 వేల రూపాయలు పెన్షన్ చెల్లిస్తుంది. మరణానంతరం అసలు మొత్తం నామినీకి చెల్లిస్తారు.
ఇవి కూడా చదవండి:
- అమరావతిలో అంతర్జాతీయ పవర్ బోట్ రేసింగ్
- డోనల్డ్ ట్రంప్: ‘అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ప్రశ్నలకు ఈజీగా సమాధానాలు రాసేశాను’
- పెయిడ్ న్యూస్: ఎన్నికల వేళ వార్తల వ్యాపారం
- తెలంగాణ ఎన్నికలు: 'ఎన్టీఆర్పై ఎలా గెలిచానంటే'
- సిసలైన తెలంగాణ ప్రజావాణి బీబీసీ న్యూస్ తెలుగులో
- ఎంపీలుగా ఓడారు.. ఎమ్మెల్యే టికెట్ పట్టారు
- శబరిమలలో తృప్తి దేశాయ్: ‘నన్ను చంపేస్తామని 300 మెసేజ్లు వచ్చాయ్’
- సింగర్ బేబీ: రెహమాన్ మెచ్చిన ఈ కోయిల పాట ఇలా మొదలైంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








