నమ్మకాలు-నిజాలు: బహిష్టు సమయంలో కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? పిరియడ్ నొప్పి వస్తే పిల్లలు పుట్టరా?

ఫొటో సోర్స్, iStock
- రచయిత, డాక్టర్ రొంపిచెర్ల భార్గవి
- హోదా, బీబీసీ కోసం
పదో తరగతి పరీక్షలు రాస్తూ కడుపు నొప్పని మధ్యలోనే ఇంటికి పరుగెత్తుకొచ్చిన ప్రేమను చూసి ఇంట్లో అంతా కంగారుపడ్డారు. పొట్ట పట్టుకుని మెలికలు తిరిగిపోతున్న అమ్మాయిని డాక్టర్ దగ్గరకు తీసికెళ్తే కంగారేమీ లేదని.. బహిష్టు సమయంలో వచ్చే నొప్పేనని చెప్పారాయన.
'పరీక్షలు కదా ఒత్తిడికి గురై ఉంటుంది.. శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనయినప్పుడు ఇలా నొప్పి తీవ్రంగా వస్తుంద'ని చెప్పారు డాక్టర్.
...........
ప్రతి నెలా రెండు రోజులు నాగా పెడుతున్న నాగమ్మతో 'ఇలా పని ఎగ్గొడితే ఎలా.. నేను చేసుకోలేకే కదా నిన్ను పెట్టుకున్నది' వాపోయింది ఇంటావిడ ఈశ్వరి.
'ఏం చెయ్యనమ్మగారూ..! బయటజేరిన రెండురోజులూ పక్క దిగలేనమ్మా. వాంతులు కూడా అవుతాయి. డాక్టర్నడిగితే కొంత వయసు ముదిరితే తగ్గుతుందంటున్నారు' చెప్పింది నాగమ్మ.
...........
పెళ్లయి రెండేళ్లయినా పిల్లలు కలగని విమలని వాళ్లత్తగారు పొద్దున్నుంచి ఒకటే సతాయిస్తోంది. 'బహిష్టు సమయంలో కడుపులో నొప్పంటావు అందుకే పిల్లలు పుట్టటం లేదు' అంటోంది. ఆవిడ పోరు పడలేక విమల భర్తను తీసుకుని డాక్టర్ దగ్గరకెళ్లింది.
'బహిష్టు సమయంలో కడుపు నొప్పి వస్తే పిల్లలు పుట్టరని ఎవరు చెప్పారు? అసాధారణ పరిస్థితులలో(ఎండోమెట్రియోసిస్, కొన్ని ఇన్ఫెక్షన్స్) మాత్రమే అలాంటి సమస్య వస్తుంద'ని లేడీ డాక్టరు స్పష్టంగా చెప్పారు.
కడుపు నొప్పి రావడం ఒకరకంగా అండం విడుదలకు సూచన అని, అండం విడుదలకాని సందర్భంలో వచ్చే బహిష్టులలో కడుపు నొప్పి ఉండదని చెబుతూ 'అండం విడుదలయితేనేగా పిల్లలు పుట్టే అవకాశముంటుంది, అంతేకానీ, కడుపు నొప్పి వచ్చినంత మాత్రాన పిల్లలు పుట్టరని కాదు, ఏదైనా వ్యాధి వల్ల నొప్పి వస్తోందా.. లేదా సహజంగా వచ్చే నొప్పేనా అన్నది మొదట నిర్ధారించుకోవాల'ని చెప్పారామె.

ఫొటో సోర్స్, Getty Images
బహిష్టు లేదా పిరియడ్ అంటే ఏంటి?
చాలామంది మహిళలు ఎదుర్కొనే సమస్య ఈ 'బహిష్టు సమయంలో కడుపునొప్పి'. దీన్నే వైద్య పరిభాషలో డిస్మెనోరియా అంటారు.
అసలు ఈ నొప్పి కథేమిటో తెలుసుకుందాం..
బహిష్టు అంటే యుక్త వయసు ఆడపిల్లలలో నెలనెలా కనిపించే రక్తస్రావం. ఇది 50-200 మిల్లీ లీటర్లు ఉంటుంది.
గర్భాశయం లోపలి గోడలని కప్పుతూ ఉండే మృదువైన ఎండోమెట్రియమ్ అనే పొర ప్రతి నెలా బాగా ఎదిగి, మందంగా తయారై, అధిక రక్త ప్రసరణతో గర్భధారణకు సంసిద్ధంగా ఉంటుంది. నెలమధ్యలో విడుదలయ్యే అండం, వీర్యకణంతో కలసి ఫలదీకరణం చెంది పిండం ఏర్పడితే ఈ ఎండోమెట్రియమ్ పొర ఆ పిండానికి కావలసిన రక్తసరఫరాను, పోషకాలను అందిస్తూ అది గర్భాశయంలో అతుక్కుని ఎదగడానికి తోడ్పడుతుంది.
గర్భధారణ జరగని పరిస్థితులలో ఈ ఎండోమెట్రియమ్ పొర ప్రతి నెలా బయటకు విసర్జించబడుతుంది. దాంతోపాటు కొంత వ్యర్థ కణజాలాలు, అందులో ఉండే రక్తనాళాల కొనలు కూడా గర్భాశయ ద్వారం ద్వారా బయటకు విసర్జించబడతాయి. ఇదంతా హార్మోన్ వ్యవస్థ నియంత్రణలో ఉంటుంది.
ఇందులో ముఖ్యమైనవి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్. నెల మొదటి భాగం ఈస్ట్రోజన్ అధీనంలో.. రెండో భాగం అంటే 14 నుంచి 28 రోజుల వరకు ప్రొజెస్టిరోన్ అధీనంలో ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
మరి.. కడుపు నొప్పి ఎందుకొస్తుంది?
బహిష్టు సమయంలో వచ్చే ఈ నొప్పిని వైద్య పరిభాషలో 'డిస్మెనోరియా' అంటారు. ఇది సాధారణంగా రక్తస్రావంతో కానీ.. రక్తస్రావానికి కొద్ది గంటల ముందు నుంచి కానీ మొదలై ఒకట్రెండు రోజులు ఉంటుంది. కొద్దిమందిలో రక్తస్రావం మొదలు కావడానికి ఒకట్రెండు రోజుల ముందునుంచే నొప్పి వస్తుంది.
దీనికి కారణం గర్భాశయ లోపలి పొర అయిన ఎండోమెట్రియమ్ విచ్ఛిన్నమై బయటకు వచ్చేటపుడు ఆ కణజాలం నుంచి విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్ F2ఆల్ఫా అనే పదార్థం.
దీనివల్ల గర్భాశయంలో సంకోచ వ్యాకోచాలు కలుగుతాయి. అప్పుడు గర్భాశయ కండరాలు ముడుచుకోవడం వల్ల రక్త సరఫరా తగ్గుతుంది. దాంతో గర్భాశయ కండరాలకు ఆక్సిజన్ లభ్యత తగ్గుతుంది. ఫలితం కడుపు నొప్పి.
గర్భాశయ ద్వారం చిన్నదిగా, సన్నగా ఉంటే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
ఈ నొప్పి ఏ వయసు వారికి వస్తుంది?
సాధారణంగా యుక్త వయసు వారిలో అంటే 14-25 ఏళ్ల మధ్య ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. రజస్వల అయిన మొదటి రెండేళ్లు నొప్పి ఉండకపోవచ్చు. ఆ సమయంలో అండం విడుదల కాకుండానే హార్మోన్ల స్థాయిలో వచ్చే మార్పుల వల్ల మాత్రమే బహిష్టు అవుతుంది.
అనంతరం కొన్నాళ్లకు అండం కూడా విడుదల కావడం ప్రారంభమైతే కడుపునొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఇక మధ్య వయసు వారి విషయానికొస్తే.. ఒక్కోసారి ఇతర వ్యాధులేమైనా కూడా కారణం కావొచ్చు. ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్, కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నొప్పి వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
లక్షణాలు ఏంటి?
- పొత్తి కడుపులో తెరలుతెరలుగా నొప్పి మొదలై వాంతులు, వికారం, నడుమునొప్పి, తొడల భాగంలో నొప్పి కూడా ఉండొచ్చు.
- కొద్దిమందిలో మల బద్ధకం, విరోచనాలు, ఆకలి లేకపోవడం, చిరాకు, అసహనం, నిరాసక్తత వంటి లక్షణాలూ కనిపిస్తాయి.
ఈ డిస్మెనోరియాని రెండు రకాలుగా వర్గీకరిస్తారు
1) ప్రైమరీ డిస్మెనోరియా
యుక్త వయసులో నూటికి యాభై మందిలో కనిపించే నొప్పి ఇది. దీనికి ప్రత్యేక కారణమంటూ ఉండదు. వయసు పెరిగాక, పిల్లలు కలిగాక ఈ సమస్య దానికదే తగ్గిపోతుంది.
2) సెకండరీ డిస్మెనోరియా:
దీనికి కొన్ని రకాల వ్యాధులు కారణం
* ఎండోమెట్రియోసిస్: ఈ వ్యాధి వల్ల కడుపునొప్పి తీవ్రంగా ఉండడమే కాకుండా సంతాన లేమికీ దారి తీయొచ్చు. దీనికి కారణం గర్భాశయ కుహరాన్ని కప్పి ఉంచే ఎండోమెట్రియమ్ పొర అసహజంగా, అసాధారణంగా గర్భాశయం వెలుపలా.. పొత్తి కడుపులోని అండాశయం తదితర అవయవాలపై వ్యాపించి ఆయా కణజాలాలలో వాపుని కలగజేసి వాటి విధులకు ఆటంకం కలిగించడం. దీనివల్ల పీరియడ్స్లో క్రమబద్ధత లోపించడం, సంతానోత్పత్తి దెబ్బతినడం జరుగుతాయి. కాబట్టి బహిష్టు నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఎండోమెట్రియోసిస్ కారణమేమో తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన పరీక్షలు చేయించుకుని నిర్ధరించుకోవాలి.
* ఫైబ్రాయిడ్స్: ఇవి గర్భాశయం కండరాలలో వచ్చే కణుతులు. వీటివలన గర్భాశయం పరిమాణం పెరుగుతుంది.
* ఎడినోమయోసిస్ : ఈ సమస్య ఉన్నవారిలో ఎండోమెట్రియమ్ పొర గర్భాశయ గోడలకు పరిమితం కాకుండా కండరాలలోనికి చొచ్చుకునిపోతుంది. ఫలితంగా తీవ్రమైన కడుపునొప్పి, అధిక రక్తస్రావం కలుగుతాయి.
* జననేంద్రియవ్యవస్థలో ఇన్ఫెక్షన్లు: లైంగిక సంబంధాల వల్ల వ్యాపించే సుఖవ్యాధులు కూడా సెకండరీ డిస్మెనోరియాకి కారణాలు.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లలు పుడితే డిస్మెనోరియా తగ్గుతుందా?
పూర్తిగా తగ్గుతుందని చెప్పలేం కానీ పిల్లలు పుట్టాకా, కొంత వయసు పెరిగాక తగ్గే అవకాశముంది.
వ్యాధి నిర్ధారణ ఎలా?
అనుభవజ్ఞులైన వైద్యులు రోగి నుంచి అవసరమైన సమాచారం సేకరించడం ద్వారా, కొన్ని పరీక్షలు చేసి వ్యాధి నిర్ధరణ చేస్తారు.
దీనికి ఉపకరించే పరీక్షలు..
* జననేంద్రియాల లోపలి పరీక్ష
* కొన్ని రకాల రక్తపరీక్షలు
* అల్ట్రాసౌండ్ స్కానింగ్
* లాప్రోస్కోపీ.. ఇది ఎండోమెట్రియోసిస్ వ్యాధి నిర్ధరణలో, చికిత్సలో కూడా ఉపకరిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి?
* సమస్యను అర్థం చేసుకుని సానుభూతితో వ్యవహరించాలి. తగినంత విశ్రాంతి ఇవ్వాలి.
* వేడినీళ్ల స్నానం చేయడం.. పొత్తికడుపు, నడుము మధ్య వేడినీళ్ల బ్యాగుతో కాపడం పెడితే కొంత ఉపశమనం కలుగుతుంది.
* క్రమంతప్పని వ్యాయామం.. కాఫీ వినియోగం తగ్గించడం, ఆహారంలో ఉప్పు తగ్గించడం వల్ల రక్త సరఫరా పెరిగి నొప్పి తీవ్రత తగ్గే అవకాశముంది.
* సిగరెట్, ఆల్కహాల్ అలవాటుంటే వెంటనే మానేయాలి.
మందులు ఉన్నాయా?
* ఇక మందుల విషయానికొస్తే నొప్పికి కారణమైన ప్రోస్టాగ్లాండిన్స్ స్థాయిని తగ్గించే మందులు సురక్షితమైనవి. వీటిని డాక్టరు సలహాపైనే వాడాలి.
* నొప్పి బాగా తీవ్రంగా ఉంటే డాక్టర్ సలహాపై ఓసీ పిల్స్ కానీ, ప్రొజెస్టిరోన్ ఉన్న లూప్ కానీ వాడొచ్చు.
* వ్యాధుల కారణంగా వచ్చే కడుపు నొప్పికి ఆ వ్యాధిని నిర్ధారణ చేసి తగిన చికిత్స చేయాలి.
బహిష్టు సమయంలో కడుపునొప్పిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అది ఎందుకొస్తుందో తెలుసుకుని తగిన చికిత్స తీసుకుంటే మహిళల ఆరోగ్యం బాగుండటమే కాకుండా ఎంతో విలువైన పనిగంటలు కూడా వృథా కాకుండా ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
- అరటి పండు అంతరించిపోనుందా?
- ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే కంపెనీ ఇదే
- ఈ వీడియోని మీరు చూడండి, మీ పిల్లలకూ చూపండి
- స్వలింగ సంపర్కానికి, వేళ్ల పొడవుకు సంబంధం ఉందా?
- గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదా, కాదా
- శారీరక వ్యాయామం చేయని ప్రతి నలుగురిలో ఒకరికి ముప్పు
- ఫేస్బుక్ సెక్స్ వీడియో వివాదం.. వెయ్యి మందిపై కేసు
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- వ్యాయామం చేస్తే కరిగే కొవ్వు ఎటు వెళుతుంది?
- ఏం చేసినా బరువు తగ్గట్లేదా? ఈ ఐదూ కారణాలు కావొచ్చు..
- నెయిల్ ఎక్స్టెన్షన్: గోళ్లను అతికించుకోవడం ఇప్పుడో ట్రెండ్
- డిప్రెషన్ సమస్యకు వేడినీళ్ల సమాధానం
- #BBCSpecial జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎనిమిది మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








