పెథాయ్: ‘యానాం, తుని మధ్య తీరం దాటొచ్చు’ - ఏపీ ఆర్టీజీఎస్

బంగాళాఖాతంలో పెథాయ్ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. సోమవారం ఉదయం 8.30 గంటల సరికి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు 125 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ పెను తుపాను ఈ రోజు మధ్యాహ్నం 11.30 నుంచి 2.30 గంటల మధ్య యానాం, తుని పట్టణాల మధ్య తీరం దాటొచ్చని ఆంధ్రప్రదేశ్ రియల్టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఏపీ ఆర్టీజీఎస్) వెల్లడించింది.
తుపాను తీరం దాటేటప్పుడు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను ప్రస్తుతం 16 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఐఎండీ అనుబంధ 'రీజనల్ స్పెషలైజ్డ్ మెటియరలాజికల్ సెంటర్ ఫర్ ట్రోపికల్ సైక్లోన్స్' వెల్లడించింది.
తుపాను ప్రభావంతో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు.. కృష్ణా, గుంటూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ ఐఎండీ హై అలర్ట్ ప్రకటించింది.
సముద్రం అల్లకల్లోలంగా ఉందని, సాధారణం కంటే మీటరు అంతకంటే ఎక్కువ ఎత్తులో అలలు వస్తాయని, తీర ప్రాంత జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదముందని హెచ్చరించింది.

ప్రజలకు ఆర్టీజీఎస్ అప్రమత్తపు హెచ్చరికలు
కాగా తుపాను నేపథ్యంలో ఏపీ ఆర్టీజీఎస్ ప్రజలకు పలు సూచనలు చేసింది.
తుపాను తీరం దాటేటప్పుడు పెనుగాలులతో భారీ వర్షాలు కురవనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అరటి, ఉద్యాన పంటల రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని.. వరి, జొన్న, ఇతర పంటలు కోసినవారు తక్షణం పంటను గోదాముల్లో భద్రపరుచుకోవాలని సూచిస్తూ ఏపీ ఆర్టీజీఎస్ ప్రజలకు సందేశాలు పంపించింది.
గుడిసెలు, రేకుల ఇళ్లలో ఉన్నవారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
ప్రత్యేకించి తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని.. రోడ్లపై వాహనాల్లో తిరగడం, చెట్లకింద తలదాచుకోవడం చేయరాదని సూచించింది.

ఫొటో సోర్స్, APRTGS
మరోవైపు రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు మొదలయ్యాయి. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 400 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు విద్యాశాఖ సోమవారం సెలవు ప్రకటించింది. ప్రకాశం జిల్లాలోని 11 మండలాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరు మండలాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ముందస్తు ఎన్నికలు: విలీన మండలాల ఓటర్లు ఎటు?
- తెలంగాణ ఎన్నికలు: ప్రపంచ ఓటర్ల వేలిపై తెలంగాణ సిరా చుక్క
- తెలంగాణ ఎన్నికలు: “ప్రత్యేక రాష్ట్రం వస్తే పాతబస్తీ వెలిగిపోతుందన్నారు. కానీ హామీలే మిగిలాయి”
- ‘24 గంటల కరెంట్ మాకొద్దు’
- లువిస్ హామిల్టన్: ‘‘పూర్ ఇండియా’ వ్యాఖ్యలు భారత్ పట్ల సానుభూతితోనే..’
- ప్రవాసాంధ్రులు ఏపీకి పంపిస్తున్న డబ్బులు ఎంతో తెలుసా?
- బ్రెగ్జిట్: యురోపియన్ యూనియన్కు ‘విడాకులిస్తున్న’ బ్రిటన్... ఎందుకు? ఏమిటి? ఎలా?
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటీ? చేయకపోతే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








