లువిస్ హామిల్టన్: ‘‘పూర్ ఇండియా’ వ్యాఖ్యలు భారత్ పట్ల సానుభూతితోనే..’

లూయిస్ హమిల్టన్

ఫొటో సోర్స్, Getty Images

ఫార్ములా వన్ రేసులో ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన లువిస్ హామిల్టన్ భారతదేశం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇండియా 'పేద ప్రాంతం' అన్న తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు.

33 ఏళ్ల హామిల్టన్ ఈ వారం బీబీసీ స్పోర్ట్‌తో మాట్లాడారు. భారతదేశంలో రేసింగ్ 'విచిత్రంగా' అనిపించిందని, తాను 'చాలా సంఘర్షణకు లోనయ్యా'నని అన్నారు.

ఈ ఏడాది ఎఫ్1 కేలండర్ ఈవెంట్లు, వాటి వేదికల గురించి మాట్లాడుతున్నప్పుడు హమిల్టన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త వేదికలపై రేసింగ్ అనుభవాలను ఆయన పంచుకున్నారు.

''నేను ఇంతకు ముందు వియత్నాం వెళ్లాను. అది చాలా అందంగా ఉంది. గతంలో ఒక రేసులో పాల్గొనేందుకు నేను ఇండియా వెళ్లాను. చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే భారతదేశం ఒక పేద ప్రాంతం.. అయినా ఒక భారీ, అందమైన గ్రాండ్ ప్రిక్స్ ట్రాక్‌ను ఎక్కడో ఒకచోట ఏర్పాటు చేశారు. ఆ గ్రాండ్ ప్రిక్స్‌కు వెళ్లినప్పుడు నేను చాలా సంఘర్షణకు లోనయ్యా'' అని అన్నారు.

ప్రపంచంలోని ఇతర వేదికలపైన కూడా ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు. ''టర్కీలో గ్రాండ్ ప్రిక్స్‌కు ఎవ్వరూ రారు. కూల్ ట్రాక్.. కూల్ వీకెండ్ కానీ ఆడియన్స్ మాత్రం పూర్'' అని అన్నారు.

భారతదేశం పేద ప్రాంతం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. దీనిపై వివరణ ఇస్తూ.. ఆయన గురువారం ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

‘ఆ డబ్బును పాఠశాలలు, ఇళ్లు లేనివారి కోసం వాడాల్సింది’

''భారతదేశం గురించి నేను చేసిన వ్యాఖ్యలతో కొందరు బాధపడినట్లు నేను గుర్తించాను. భారతదేశం ప్రపంచంలోని అత్యంత అందమైన దేశాల్లో ఒకటి. అక్కడి సంస్కృతి అత్యద్భుతం. నేను వెళ్లినప్పుడల్లా గొప్పగా గడిపాను. (భారత్) అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ (దేశంలో) చాలా పేదరికం ఉంది'' అని ఆ ట్వీట్‌లో వివరించారు.

''నా వ్యాఖ్యలు ఆ గ్రాండ్ ప్రిక్స్‌ను ఉద్దేశించినవి. అది చాలా విచిత్రంగా అనిపించింది.. ఇళ్లులేని ప్రజలను దాటుకుని వెళ్లటం.. అక్కడేమో భారీ వేదిక.. డబ్బు అనేది సమస్యే కాని ప్రాంతంలో అడుగుపెట్టడం.. వాళ్లు ఆ ట్రాక్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, ఇప్పుడది వాడకంలోనే లేదు. ఆ డబ్బును పాఠశాలలు, ఇళ్లులేని వారి కోసం ఇళ్లు కట్టేందుకు వాడాల్సింది'' అని హామిల్టన్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

''మేం రేసు జరిపినప్పుడు ఎవ్వరూ రాలేదు. బహుశా అది చాలా ఖరీదైనది అయి ఉండొచ్చు లేదా ఆసక్తి లేక కావొచ్చు. ఏదేమైనా నేను మాత్రం కొందరు గొప్ప భారతీయ అభిమానుల్ని కలిశాను'' అని ఆ వివరణలో పేర్కొన్నారు.

భారత గ్రాండ్ ప్రిక్స్ (జీపీ)లో 2011 నుంచి 2013 వరకు మూడు సీజన్ల పాటు రేసులు జరిగాయి.

వియత్నాం రాజధాని నగరం హనోయి వీధులపై ఏప్రిల్ 2020 నుంచి కొన్నేళ్లపాటు రేసు నిర్వహించేందుకు ఎఫ్1 యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుంది.

2004వ సంవత్సరం నుంచి బహ్రెయిన్, చైనా, టర్కీ, సింగపూర్, అబుదాబి, దక్షిణ కొరియా, రష్యా, అజర్‌బైజాన్ గ్రాడ్‌ప్రిక్స్ వేదికలను ఎఫ్1 క్యాలెండర్‌లో చేర్చారు.

మెర్సిడెజ్ ట్వీట్
మెర్సిడెజ్ ట్వీట్

‘సంపద, పేదరిక వైరుధ్యం వల్లే ఆ వ్యాఖ్యలు’

కాగా, హామిల్టన్‌ను మెర్సిడెజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టోటో వోల్ఫ్ సమర్థించారు. ఈ మేరకు మెర్సిడెజ్ ఎఫ్1 ట్విటర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.

''లూయిస్ (భారత) దేశాన్ని విమర్శించలేదు. భారతదేశం పట్ల సానుభూతితో, ఒక స్పోర్టింగ్ అంబాసిడర్‌గా ప్రపంచవ్యాప్తంగా పర్యటించేప్పుడు సంపద, పేదరికాలను చూసినప్పుడు కలిగే బాధాకరమైన వైరుధ్యంతో అతను మాట్లాడాడు. అతని వ్యాఖ్యలు చాలా ఆలోచనలతో నిండినవి, ఒక చాంపియన్‌లాగా మాట్లాడాడు. సమస్యల్లా అతని మాటల్ని వక్రీకరించినవారితోనే'' అని అందులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)