తేజ్ ప్రతాప్ యాదవ్: రాధ కోసం వెతుకుతున్నా - భార్యతో విడాకులు కావాలి

ఫొటో సోర్స్, TEJ PRATAP YADAV/FACEBOOK
- రచయిత, నీరజ్ ప్రియదర్శి
- హోదా, బీబీసీ కోసం
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ గత శుక్రవారం మధురలోని నిధివన్ నుంచి ఫేస్బుక్ లైవ్ ఇచ్చారు.
ఫేస్బుక్ లైవ్లో నిధివన్లో అంతా తిరుగుతూ ఆ ప్రాంతం గురించి చెప్పారు.
"నేను తేజ్ ప్రతాప్ యాదవ్, బృందావనంలోని ఈ పవిత్ర భూమి నిధివన్ నుంచి నేను మీకు నేరుగా లైవ్ చూపిస్తున్నాను. శ్రీకృష్ణుడు రాధ, గోపికలతో కలిసి రాసలీలలు ఆడిన ప్రాంతం ఇదే. రాధాకృష్ణులు, గోపికలు ఇక్కడ రాత్రిళ్లు కూడా నాట్యం చేస్తారు. అందుకే ఇక్కడకు రాత్రిళ్లు ఎవరూ రారు.
మధుర, బృందావన్ బ్రజ్ యాత్ర చేస్తున్నప్పుడు ఒక వారం క్రితం నిధివన్ నుంచి లైవ్ ఇచ్చిన బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్, తర్వాత కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశారు. ఆయన అలా చేస్తారని ఎవరూ ఊహించలేదు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
కానీ తేజ్ ప్రతాప్ అలా ఎందుకు చేశారు?
బృందావన్ నుంచి తిరిగొచ్చిన తేజ్ ప్రతాప్ శుక్రవారం హిందూ మ్యారేజ్ యాక్ట్ 13(1A) ప్రకారం పట్నా ఫ్యామిలీ కోర్టు చీఫ్ జస్టిస్లో భార్య ఐశ్వర్య నుంచి విడాకులు కావాలని పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్ స్వీకరించిన కోర్టు నవంబర్ 29న దీనిపై విచారణ చేస్తామని చెప్పింది.
విడాకులకు అప్లై చేసిన తర్వాత బయటికొచ్చిన తేజ్ ప్రతాప్ యాదవ్.. తను శ్రీకృష్ణుడినని, రాధ కోసం వెతుకుతున్నానని మీడియాకు చెప్పారు.
భార్య ఐశ్వర్య తన రాధ కాదని తేజ్ ప్రతాప్ చెప్పారు. అందుకే ఇప్పుడు ఆమె నుంచి విడిపోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు.

ఫొటో సోర్స్, NEERAJ PRIYADARSHI/BBC
విడాకులకు ఆధారం ఏమిటి?
ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసిన తేజ్ ప్రతాప్, భార్య ఐశ్వర్యా రాయ్ 'క్రూర ప్రవర్తన' వల్లే విడాకులు కోరుకుంటున్నట్టు చెప్పారు. భార్య ప్రవర్తన వల్ల తన దాంపత్య జీవితంలో చాలా బాధలు పడ్డానని, విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
సమాచార ఏజెన్సీ ఎఎన్ఐతో మాట్లాడిన తేజ్ ప్రతాప్ లాయర్ ఇద్దరూ అన్యోన్యంగా లేకపోవడం వల్లే విడాకులకు దరఖాస్తు చేశామని చెప్పారు.

ఫొటో సోర్స్, SHAMIM AKHTAR
సయోధ్య ప్రయత్నాలు
శుక్రవారం తేజ్ ప్రతాప్ విడాకులకు దరఖాస్తు చేశారనే వార్తలు రాగానే, ఆయన భార్య ఐశ్వర్యా రాయ్ తన కుటుంబంతో సహా రబ్రీదేవిని కలిశారు. రాంచీ వెళ్తున్న తేజ్ ప్రతాప్ కూడా తన ప్రయాణం మధ్యలో ఆపి ఇంటికి తిరిగి వచ్చారు.
రెండు కుటుంబాల మధ్య సయోధ్య ప్రయత్నాలు జోరందుకున్నాయి. రబ్రీదేవి ఐశ్వర్య కుటుంబంతో మాట్లాడారు. అయితే రెండు కుటుంబాలు ఇంకా దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

ఫొటో సోర్స్, TEJ PRATAP/INSTAGRAM
విడాకులపై బిహార్లో చర్చ
బిహార్లో అత్యంత పెద్ద రాజకీయ కుటుంబంలో హఠాత్తుగా ఇలాంటి వార్త రావడంతో రాష్ట్రంలో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు.
రెండు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో తేజ్ ప్రతాప్ సోదరుడు, బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కూడా ఇంట్లోనే ఉన్నారు. దాణా కుంభకోణంలో దోషిగా ఉన్న లాలూ ప్రస్తుతం రాంచీలోని రిమ్స్లో చికిత్స తీసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, TEJ PRATAP/FACEBOOK
ఐదు నెలల్లోనే విడాకులు ఎందుకు?
ఇదే ఏడాది మే 12న తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్య రాయ్ వివాహం జరిగింది.
పెళ్లి తర్వాత లాలూకు దాణా కుంభకోణంలో మూడు రోజుల పెరోల్, ఆరు వారాల ప్రొవిజినల్ బెయిల్ రావడం, రబ్రీ దేవికి శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా కావడం లాంటి కొన్ని మంచి విషయాలు జరిగాయి.
రబ్రీదేవి కూడా ఒక మీడియా సమావేశంలో "మా కోడలు రావడంతో ఇంట్లో సంతోషాలు వచ్చాయని" చెప్పినట్లు హిందుస్తాన్ టైమ్స్ ఒక కథనంలో ప్రచురించింది.
ఆ తర్వాత తేజ్ ప్రతాప్, భార్య ఐశ్వర్యతో కలిసి తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ కూడా అయ్యాయి.
ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకుల నిర్ణయం ఇప్పుడు లాలూ కుటుంబాన్ని కుదిపేస్తోంది.

ఫొటో సోర్స్, SHAMIM AKHTAR
తేజ్ ప్రతాప్, ఐశ్వర్య జోడీ
ప్రముఖ రాజకీయ కుటుంబాలకు చెందిన వధూవరుల విద్యార్హతల విషయానికి వస్తే, తేజ్ ప్రతాప్ పట్నాలోని బీఎన్ కాలేజీలో 12వ తరగతి వరకే చదివారని చెబుతారు.
ఇటు పట్నాలోని నోట్రెడేమ్ అకాడమీలో 12 వరకు చదివిన ఐశ్వర్యా రాయ్ తర్వాత దిల్లీ యూనివర్సిటీలోని మిరండా హౌస్లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆమె ఎమిటీ యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ కూడా అందుకున్నారు.
పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఫొటోలు తప్ప, ఈ జంట ఎప్పుడూబయట కనిపించలేదు. స్థానిక మీడియా మాత్రం ఐశ్వర్య పుట్టింటిలోనే ఉందని వార్తలు ప్రచురించేవి.

ఫొటో సోర్స్, TEJ PRATAP/INSTAGRAM
ఇటు తేజ్ ప్రతాప్ యాదవ్ సోషల్ మీడియా అకౌంట్ గమనిస్తే, ఈలోపు ఆయన ఇతర రాష్ట్రాల్లో ఉన్న చాలా ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మధుర, బృందావన్ పర్యటనకు చాలాసార్లు వెళ్లారు. ఇటీవల కూడా అక్కడికి వెళ్లివచ్చారు.

ఫొటో సోర్స్, TEJ PRATAP/FACEBOOK
నుదుటిపై నామాలతో, ఒక్కోసారి నెమలి పించంతో, మరోసారి కిరీటంతో, ఒక్కోసారి బహిరంగ వేదికలపై వేణువు వినిపిస్తూ కనిపించే తేజ్ ప్రతాప్.. తనను తాను శ్రీకృష్ణుడికి పరమ భక్తుడుగా చెప్పుకుంటారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర కొరియా క్యాలెండర్లలో కనిపించని కిమ్ పుట్టినరోజు
- ట్రంప్ ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- వీళ్లు కవలలు.. కానీ ఒకే ‘ఏడాది’ పుట్టలేదు!
- జమాల్ ఖషోగ్జీ హత్య: గొంతు నులిమి చంపేశారన్న టర్కీ
- పాకిస్తాన్: దైవ దూషణ కేసులో క్రైస్తవ మహిళకు మరణశిక్ష నుంచి విముక్తి
- గూగుల్ ఉద్యోగుల వాకౌట్: మహిళల పట్ల వివక్షపై ప్రపంచవ్యాప్త నిరసనలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








