You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్: 4 x 400 మీటర్ల రిలే జట్టు సభ్యుల మతంపై చర్చ ఎందుకు జరుగుతోంది?
వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించి భారత్ ఆటగాడు నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.
జావెలిన్ త్రో విభాగంలోనే కిశోర్ జెనా, మను డీపీ కూడా ఫైనల్లో అయిదు, ఆరు స్థానాలలో నిలిచారు. స్టీపుల్ చేజ్ 3 వేల మీటర్ల విభాగంలో భారత్కు చెందిన పారుల్ చౌదరి ఫైనల్ చేరారు. కానీ, ఫైనల్లో మాత్రం పారుల్ మెరుగైన ప్రదర్శన కనబరచలేకపోయారు. ఫైనల్లో పాల్గొన్న 15 మందిలో పారుల్ 11వ స్థానంలో నిలిచారు.
నీరజ్ చోప్రా, కిశోర్ జెనా, మను డీపీ, పారుల్ చౌదరే కాకుండా భారత్ 4 x 400 మీటర్ల పరుగు జట్టు కూడా ఫైనల్స్లో పాల్గొంది. ఫైనల్స్లో ఈ టీం 5వ స్థానంలో నిలిచింది.
దీంతో 4 x 400 మీటర్ల పరుగు జట్టులోని ముహమ్మద్ అనాస్ యాహ్యా, అమోజ్ జాకబ్, ముహమ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్ పతకం సాధించనప్పటికీ దేశ ప్రజల ప్రశంసలు మాత్రం అందుకుంటున్నారు.
‘లౌకిక’ జట్టు అని ఎందుకు అంటున్నారు?
భారత రిలే జట్టు క్వాలిఫైయింగ్ రౌండ్లలో రెండో స్థానంలో నిలిచింది.
క్వాలిఫైయింగ్ రౌండ్లో భారత జట్టు 2:59:05 సమయంలో రిలే పూర్తి చేసి, ఆసియా రికార్డ్ బద్దలుకొట్టి అమెరికా జట్టుకు గట్టి పోటీ ఇచ్చింది.
భారత రిలే జట్టు తాజా ప్రదర్శన ప్రపంచ అథ్లెటిక్స్లో భారత్కు కొత్త ఆశలు కలిగిస్తోంది.
రాజకీయ, క్రీడా రంగాలకు చెందినవారు, అనేక మంది ఇతరులు జట్టుకు అభినందనలు తెలిపారు.
అయితే, సోషల్ మీడియాలో ఈ జట్టుపై భిన్నమైన చర్చ నడిచింది. రిలే జట్టులో ఇద్దరు ముస్లింలు, ఒక హిందువు, ఒక క్రిస్టియన్ ఉన్నారని, అది లౌకిక జట్టు అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు.
రిలే జట్టు సభ్యుల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ చాలా మంది జట్టు ‘లౌకిక’ కూర్పును ప్రస్తావించారు.
ఈ నలుగురు ఆటగాళ్లు సహకారం, పరస్పర విశ్వాసం, సామరస్యాలకు ప్రతీక అంటూ కేంద్ర మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ట్వీట్ చేశారు.
ఈ ఈవెంట్ జరిగిన హంగరీలోని బుడాపెస్ట్ సమీపంలో విభజనవాద దళాలేవీ లేనందుకు దేవుడికి ధన్యవాదాలు అంటూ ఆయన రాసుకొచ్చారు.
‘ఆటలో మతాన్ని తేవాల్సిన అవసరం ఏమిటి?’
నలుగురు ఆటగాళ్ల మతాలను ప్రస్తావిస్తూ ‘నీలిమ శ్రీవాస్తవ’ అనే యూజర్ జైహింద్ అని రాశారు.
ఇద్దరు ముస్లింలు, ఒక హిందువు, ఒక క్యాథలిక్ ఉన్న ఈ టీం నిజమైన జాతీయ సమగ్రతా స్ఫూర్తికి ప్రతీక అని సంజీవ్ బాత్రా ట్వీట్ చేశారు.
బీజేపీతో సంబంధాలున్న చారు ప్రగ్యా అనే యూజర్ చిదంబరం ట్వీట్పై స్పందిస్తూ ఆటలో మతాన్ని తేవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
ప్రతిభా కౌల్ అనే మరో యూజర్ స్పందిస్తూ... ప్రతిదాంట్లో మతాన్ని తీసుకురావాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ రిలే జట్టును ట్విటర్ వేదికగా అభినందిస్తూ నీరజ్ చోప్రా విజయం మధ్య రిలే జట్టు ప్రదర్శనను మర్చిపోరాదన్నారు.
జట్టు సభ్యులు వేర్వేరు మతవిశ్వాసాలకు చెందినవారైనప్పటికీ భారతీయులుగా వారంతా కలిసికట్టుగా ఆడారన్నారు.
చాలా మంది నేతల్లా అడ్డుగోడలు కట్టకుండా క్రీడలు వంటి బ్రిడ్జ్లు మనం కట్టినప్పుడు భారతదేశ అసలు శక్తేంటో అర్థమవుతుందని ఆయన అన్నారు.
బీజేపీ అభ్యంతరం ఏమిటి?
బీజేపీ మీడియా సెల్ ఇంచార్జి అమిత్ మాలవీయ ఈ అంశంపై స్పందిస్తూ ఆటగాళ్ల మతాల ప్రస్తావన తేవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
లౌకికవాదులు అని చెప్పుకొనేవాళ్లు ఇలాగే ఆలోచిస్తుంటారని, రిలే జట్టు ప్రదర్శనపై వారిని అభినందించాల్సింది పోయి వారు ఏ మతానికి చెందినవారన్నది మాట్లాడుకోవడం సరికాదన్నారు.
ఈ భారతీయ ఆటగాళ్లు ఒక దశలో ప్రపంచ చాంపియన్లైన అమెరికన్లను కూడా దాటి ఆసియా రికార్డును బద్దలుగొట్టారు, ఆ విషయం వదిలేసి వారి మతం గురించి మాట్లాడుతారా అంటూ ఆయన ప్రశ్నించారు.
ఈ చాంపియన్ల గురించి వారి విజయం గురించి మాట్లాడకుండా వారి మతం గురించి మాట్లాడుతున్నారంటూ ఆయన ట్విటర్లో(ఎక్స్లో) తప్పుబట్టారు.
రిలే పరుగులో ఇండియా గొప్ప ప్రదర్శన
క్వాలిఫైయింగ్ దశలో భారత జట్టుపై చాలా మందికి ఏమాత్రం అంచనాలు లేవు. ప్రపంచ చాంపియన్షిప్ వంటి పెద్ద ఈవెంట్లో భారత జట్టు గొప్ప ప్రదర్శన చేయగలుగుతుందని ఎవరూ అనుకోలేదు.
కానీ, అందుకు భిన్నంగా భారత జట్టు అందరనీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
క్వాలిఫైయింగ్ రౌండ్లో భారత రిలే జట్టు పరుగును ముహమ్మద్ అనాస్ ప్రారంభించారు. ఆ తరువాత అమోజ్ జాకబ్ అద్భుతంగా పరుగెత్తడంతో భారత్ రెండో స్థానంలో నిలవగలిగింది.
అక్కడి నుంచి జోరు కొనసాగింది.
అనాస్, జాకబ్లు సాధించిన ఆధిపత్యాన్ని మొహమ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్లు కొనసాగించారు.
ఈ క్రమంలో ఆసియన్ రికార్డ్ బ్రేక్ చేయడమే కాకుండా రెండో స్థానంలో నిలిచారు.
క్వాలిఫైయింగ్ రౌండ్లో ఒక్క అమెరికా జట్టు మాత్రమే భారత్ కంటే ముందు నిలిచింది. ఒక దశలో అమెరికా ఆటగాళ్లను కూడా భారత ఆటగాళ్లు వెనక్కు నెట్టారు.
2:59:05 టైమింగ్తో ఆసియా స్థాయిలో కొత్త రికార్డు నెలకొల్పారు. అంతకుముందు జపాన్ పేరిట ఈ రికార్డ్ ఉండేది.
2:59:51 టైమింగ్తో జపాన్ పేరిట ఉన్న రికార్డును ఇప్పుడు భారత రిలే జట్టు తిరగరాసింది.
అయితే, ఫైనల్లో భారత జట్టు ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఫైనల్లో 2:59:92 టైమింగ్తో అయిదో స్థానంలో నిలిచింది.
ఆటగాళ్ల నేపథ్యం ఇదీ
4 x 400 మీటర్ల రిలే జట్టులోని ముహమ్మద్ అనాస్ది కేరళ. ఆసియా గేమ్స్లో అనాస్ రజతం గెలిచారు.
2016 ఒలింపిక్స్కు కూడా ఆయన ఎంపికయ్యారు. 400 మీటర్ల పరుగులో అనాస్కు జాతీయ రికార్డ్ ఉంది.
జట్టులోని మరో ఆటగాడు రాజేశ్ రమేశ్ది తమిళనాడు. రాజేశ్ కెరీర్ ఎత్తుపళ్లాలుగా సాగింది. గాయాలు, కోవిడ్ కారణంగా ఒక దశలో ఆయన కెరీర్ ముగిసిపోయిందనుకున్నారు. కానీ, ఆయన పట్టు వదల్లేదు.
తిరుచ్చి రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టరుగా పనిచేసేవాడు రాజేశ్.
అమోల్ జాకబ్ సొంత రాష్ట్రం కేరళ అయినప్పటికీ ఆయన పుట్టింది మాత్రం దిల్లీలో. ఒక దశలో ఆయన ఈ ఆటను వదిలేయాలనుకున్నారు. 400 మీటర్ల పరుగుతో పాటు జాకబ్ 800 మీటర్ల పరుగు కూడా ప్రాక్టీస్ చేస్తుంటాడు.
2016 ఆసియన్ జూనియర్ చాంపియన్షిప్లో జాకబ్ రెండు పతకాలు సాధించాడు.
మరో ఆటగాడు ముహమ్మద్ అజ్మల్ది కేరళ. అజ్మల్ అంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడు. ఆ తరువాత ఆయనకు 100 మీటర్ల పరుగుపై ఆసక్తి ఏర్పడింది.
చివరకు అజ్మల్ 400 మీటర్ల పరుగు పోటీల్లో పాల్గొనడం ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి:
- గదర్ 2: సన్నీ దేవోల్ మూవీకి ఎందుకింత క్రేజ్? ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది?
- తాడిపత్రి బిర్యానీ: దీని రుచి ఎందుకంత స్పెషల్?
- ఓసీడీ: పదేపదే చేతులు కడుక్కోవాలనే ఆలోచన చంపేస్తోందా? అయితే, వెంటనే ఇది చదవండి
- లూనా-25: చంద్రుడి మీద కూలిపోయిన రష్యా స్పేస్క్రాఫ్ట్
- ప్రైమరీ స్కూల్ టీచర్ పోస్టులకు బీఎడ్ చదివినవారు అనర్హులా... సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)