ట్రంప్ సుంకాలు: భారత్పై ఎంత, చైనా సహా ఇతర దేశాలపై ఎంత విధించారు?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పినట్టుగానే ‘పరస్పర సుంకాలు’ (రెసిప్రోకల్ టారిఫ్స్) ప్రకటించారు. అయితే ఆయా దేశాలపై డిస్కౌంట్ ఇస్తున్నట్టు కూడా ఆయన తెలిపారు. వీటిని డిస్కౌంట్ పరస్పర సుంకాలుగా’ ఆయన అభివర్ణించారు. అన్నిదేశాలపై కనిష్ఠ సుంకాలను పదిశాతంగా నిర్థరించారు.
బుధవారం రాత్రి శ్వేత సౌధంలోని రోజ్గార్డెన్స్లో ఆయన మాట్లాడుతూ అమెరికాకు ఇది ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న లిబరేషన్ డే అని చెప్పారు. ఏప్రిల్ 2, 2025 తేదీ చరిత్రలో నిలిచిపోతుందని, అమెరికా పరిశ్రమలు పునరుజ్జీవం పొందిన, అమెరికా తిరిగి సంపన్న దేశంగా మారిన రోజుగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
సుంకాల విధింపును సమర్థిస్తూ.. ఉద్యోగాలు, స్థానిక తయారీ రంగం తిరిగి అమెరికాకు చేరుతుందని, తీవ్రమైన పోటీతో వినియోగదారులకు తక్కువ ధరకు వస్తువులు లభిస్తాయని, ఇది అమెరికాకు స్వర్ణయుగం కానుందని ట్రంప్ విశ్వాసం వ్యక్తంచేశారు.


ఫొటో సోర్స్, AFP
ఇండియా గురించి ఏం చెప్పారు?
ట్రంప్ తన ప్రసంగంలో భారత్ గురించి ప్రస్తావించారు. భారత్పై డోనల్డ్ ట్రంప్ 26శాతం సుంకాలు విధించారు. ప్రధాని మోదీని గొప్ప స్నేహితుడుగా అభివర్ణించిన ట్రంప్ భారత్ అమెరికాపై 52శాతం సుంకం విధిస్తోందన్నారు. న్యూదిల్లీ సుంకాలు చాలా కఠినమైనవిగా అభివర్ణించారు.
‘‘వారి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే అమెరికా నుంచి వెళ్లారు. ఆయన నాకు మంచి స్నేహితుడు. కానీ నేను ఆయనను ‘‘మీరు నాకు స్నేహితుడు కానీ మమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదు’’ అని చెప్పాను. భారత్ మనపై 52శాతం సుంకాలు వసూలు చేస్తోందని, కాబట్టి మేం వారికి అందులో సగం 26శాతం వసూలు చేస్తాం అని చెప్పారు.

ఫొటో సోర్స్, BBC / Bernd Debusmann Jr
స్నేహితుడే ప్రమాదకారి
కొన్నిసార్లు స్నేహితుడు శత్రువు కంటే ప్రమాదకారి అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దక్షిణ కొరియాలో తయారయ్యే 80శాతం కార్లు, దక్షిణకొరియాలోనే అమ్ముడుపోతున్నాయన్నారు.
జపాన్లో తయారయ్యే 90శాతానికి పైగా కార్లు ఆ దేశంలోనే అమ్ముడవుతున్నాయని, ఆ దేశాల్లో అమెరికా ప్రాతినిధ్యం చాలా తక్కువన్నారు.
ఇతర దేశాల్లో ఫోర్డ్ చాలా తక్కువగా అమ్ముడవుతోందని, ఈ అసమతుల్యత అమెరికా పరిశ్రమలను దెబ్బతీసిందని ట్రంప్ ఆరోపించారు.
అందుకే విదేశీ తయారీ ఆటోమొబైల్స్ అన్నింటిపై విధించే 25శాతం సుంకం ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికాలో దిగుమతయ్యే అన్ని ఉత్పత్తులపై కనీసం 10శాతం సుంకం విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు.
ఈ నిర్ణయం ఈ నెల ఐదవ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, అంతర్జాతీయ వాణిజ్యంలో ఇది కీలకమైన క్షణమని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికా వాణిజ్య లోటు ఆధారంగా చేసుకుని విధించిన సుంకాలతో కొన్ని దేశాలపై 50శాతం వరకు అధిక టారిఫ్లు పడనున్నాయి.
ఈ నెల 8 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.
బ్రిటన్ వస్తువులపై 10శాతం సుంకం, యూరోపియన్ యూనియన్ వస్తువులపై 20శాతం సుంకం ఉంటాయని ట్రంప్ తెలిపారు.
అమెరికన్లు అధిక పన్నులు చెల్లించేలా విదేశాలు చేశాయని ట్రంప్ ఆరోపించారు.
అమెరికా బీఫ్ కొనడానికి ఆస్ట్రేలియా తిరస్కరించిందని, అమెరికా పౌల్ట్రీని యూరోపియన్ యూనియన్ ఒప్పుకోలేదని, అమెరికా బియ్యాన్ని అమ్మడానికి ఆసియా దేశాలు అంగీకరించలేదని ట్రంప్ అన్నారు.
తాను చేస్తుందని సరైనది అని చరిత్ర రుజువుచేస్తుందని, భవిష్యత్తులో అమెరికన్లు చరిత్రలోకి తొంగిచూసి తాను తీసుకున్న నిర్ణయాలు సరైనవని గుర్తిస్తారని వ్యాఖ్యానించారు.
అన్నిదేశాలపై కనిష్ఠంగా 10శాతం ప్రాథమిక సుంకాలను విధించారు.
మొత్తం 100 దేశాలపై ట్రంప్ కొత్త సుంకాల ప్రభావం పడుతుంది.
వాటిలో 60దేశాలపై అధిక దిగుమతి సుంకాల భారం ఉంటుంది.
పెరుగుతున్న వాణిజ్యయుద్ధంపై ప్రపంచ ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఏ దేశంపై ఎంతెంత..
అమెరికా కొత్త టారిఫ్ రేట్లతో పాటు ఆయన చార్టులో కనిపించిన ఆసియాలోని కొన్ని దేశాలను ఇక్కడ చూడండి:
- ఇండియా - 26%
- చైనా - 34%
- వియత్నాం - 46%
- తైవాన్ - 32%
- జపాన్ - 24%
- దక్షిణ కొరియా - 25%
- థాయ్ లాండ్ - 36%
- మలేషియా - 24%
- కంబోడియా - 49%
- బంగ్లాదేశ్ - 37%
- సింగపూర్ - 10%
- ఫిలిప్పీన్స్ - 17%
- పాకిస్తాన్ - 29%
- శ్రీలంక - 44%
- మియన్మార్ - 44%
- లావోస్ - 48%
అలాగే యూరోపియన్ యూనియన్ లోని 27 సభ్య దేశాల సహా యూరోపియన్ దేశాలు ట్రంప్ ప్రకటనలో ఎక్కువగా ఉన్నాయి.
- యూరోపియన్ యూనియన్ - 20%
- కొసావో - 10%
- స్విట్జర్లాండ్ - 31%
- యునైటెడ్ కింగ్ డమ్ - 10%
- నార్వే - 15%
- యుక్రెయిన్ - 10%
- లైచెన్స్టెయిన్ - 37%
- సెర్బియా - 37%
భారత్పై ఎలాంటి ప్రభావం ఉండనుంది?
మిగిలిన ఆసియా దేశాలతో పోలిస్తే ట్రంప్ భారత్పై విధించిన సుంకాలు తక్కువేనని వాణిజ్యరంగ నిపుణులు అంటున్నారు.
చైనాపై 34శాతం, వియత్నాంపై, 46శాతం, కంబోడియాపై 49శాతం సుంకాలు విధించారు ట్రంప్.
అయితే భారత్లోని పరిస్థితుల దృష్ట్యా 26శాతం సుంకాలు ఎక్కువని, భారత్లో శ్రమ ఆధారిత ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
దేశీయ డిమాండ్, జీడీపీపై ప్రభావం చూపుతుందని అంచనావేస్తున్నారు.
అలాగే వియత్నాం వంటి దేశాలపై విధించిన భారీ సుంకాల వల్ల భారత్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు లాభం కలిగే అవకాశం ఉందని తెలిపారు.
అయితే ట్రంప్ టారిఫ్ల వల్ల భారత్పై ప్రతికూల ప్రభావమే ఎక్కువని వాణిజ్యరంగ నిపుణులు అంటున్నారు.
ఔషధాలను రెసిప్రోకల్ టారిఫ్స్ నుంచి మినహాయించడంతో 13బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఎగుమతులు చేస్తున్న భారత ఫార్మా రంగానికి ఉపశమనం లభించింది.
కెనడా, మెక్సికో, ఈయూలా కాకుండా ఇప్పటిదాకా ట్రంప్తో భారత్ రాజీధోరణిలో వ్యవహరిస్తోంది. ద్వైపాక్షిక చర్చలు జరుపుతోంది.
ట్రంప్ నిర్ణయం తర్వాత భారత్ ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














