వీర్యం ఆధారంగా 40 ఏళ్ల కిందటి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

ఫొటో సోర్స్, NEWSLINE MEDIA
- రచయిత, రెబెకా కుర్రాన్, కెన్ బ్యాంక్స్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
మాజీ భార్యను హత్య చేసి 40 సంవత్సరాలకు పైగా చట్టాలకు దొరకకుండా తప్పించుకున్న ఓ వ్యక్తి చివరకు జైలు పాలయ్యారు.
అతన్ని పట్టుకున్న ఓ డిటెక్టివ్ మాటల్లో చెప్పాలంటే ‘తాను చాలా తెలివైనవాడినని అనుకునేవాడు’
క్రిస్టోఫర్ హారిసన్ అనే వ్యక్తి 1978లో స్కాట్లాండ్లోని అబెర్డీన్ ప్రాంతంలో తన మాజీ భార్య 32 ఏళ్ల బ్రెండా పేజ్ను హత్య చేశారు. ఆమెతో విడాకులు తీసుకున్న ఒక ఏడాది తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
డిటెక్టివ్ జేమ్స్ కాలండర్ ఈ కేసులో చిక్కుముడి ఎలా వీడిందో వివరించారు. ‘‘హారిసన్ తాను చట్టం నుంచి తప్పించుకున్నట్లు భావించాడు. అయితే, ఆధారాలను ముందు పెట్టి విచారణ జరిపినప్పుడు అతను తనకు తానుగా ఈ కేసులో దొరికిపోయాడు.’’
బ్రెండా పేజ్ మరణించిన 45 సంవత్సరాల తర్వాత అతన్ని దోషిగా నిర్ధరించారు.

సుదీర్ఘ విచారణ
ఈ క్రైమ్ స్టోరీపై బీబీసీ మర్డర్ ట్రయల్: ది కిల్లింగ్ ఆఫ్ డాక్టర్ బ్రెండా పేజ్ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ నిర్మించింది. 2020లో హారిసన్ ను అరెస్టు చేస్తున్న దృశ్యాలతో ఈ డాక్యుమెంటరీ ప్రారంభమవుతుంది.
ఇందులోని ప్రారంభ సన్నివేశంలో పోలీసులు ఆయన కోసం వచ్చినప్పుడు ‘ఆమెను ఇక్కడ హత్య చేయలేదు’ అని హారిసన్ అనడం వినిపిస్తుంది.
జన్యుశాస్త్రంలో నిపుణురాలైన డాక్టర్ బ్రెండాపేజ్ మృతదేహం జూలై 14, 1978న అబెర్డీన్లోని ఆమె ఇంటిలో మంచం మీద రక్తపు మడుగులో లభ్యమైంది.
ఆమె మాజీ భర్త హారిసన్ ఆమెను హత్య చేసి ఉంటాడని మొదట అనుమానించారు. హత్య విషయం బయటపడ్డ కొన్నిగంటల్లోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగుతూ వచ్చింది. అతనే హత్య చేశాడనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు.
పోలీసులు, మీడియా ఆ ఆధారం కోసం పరిశోధనలు చేశారు. కానీ చాలా కాలం వరకు ఎలాంటి ఫలితం కనిపించలేదు.
దీంతో ఈ కేసు కోల్డ్ స్టోరేజ్కు వెళ్లిపోయింది. మళ్లీ 37 సంవత్సరాల తర్వాత అంటే 2015లో ఈ కేసును వెలికి తీయాలని పోలీసులకు ఆదేశాలు వచ్చాయి.

ఫొటో సోర్స్, FAMILIA PAGE
కొత్త సాక్ష్యాలు
బ్రెండా పేజ్ నివసించిన అపార్ట్మెంట్లోని దుప్పటిపై కనిపించే వీర్యం హారిసన్ డీఎన్ఏతో సరిపోలింది. అంతకు ముందు తానెప్పుడూ బ్రెండా ఫ్లాట్లో ఆమెతో సెక్స్లో పాల్గొనలేదని హారిసన్ పోలీసులకు చెప్పారు.
అయితే, అక్కడ దొరికిన వీర్యంలోని డీఎన్ఏ, హారిసన్ వీర్యంలోని డీఎన్ఏతో సరిపోలింది. ఈ వీర్యం అతనిదే అని చెప్పడానికి బలమైన ఆధారాలు ఉన్నాయని పోలీసులు తేల్చారు.
దీంతోపాటు బ్రెండా అపార్ట్మెంట్ కిటికీని బద్ధలు కొట్టుకుని ప్రవేశించినప్పుడు అక్కడ విరిగిపోయిన కొన్ని పెయింటింగ్ ముక్కలు, ఆయన కారులో లభించిన పెయింటింగ్ ముక్కలు ఒకటేనని తేలింది.
దీంతో మార్చి 27, 2020న హారిసన్ అరెస్టు చేసిన ప్రశ్నించారు.
అయితే, అప్పుడు కూడా తన మాజీ భార్య మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు హారిసన్. కానీ, సాక్ష్యాధారాలు బలంగా ఉండటంతో ఆయన హత్య కేసు నమోదు చేశారు.
చివవరకు మార్చి 2023లో 10 రోజుల పాటు సాగిన విచారణ తర్వాత హారిసనే ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. జీవిత ఖైదు విధించారు. అతను పెరోల్ కోసం అప్లై చేయాలంటే 20 సంవత్సరాలు వేచి ఉండాలి.
తన మాజీ భార్య బ్రెండా పేజ్ను చంపిన 40 ఏళ్ల తర్వాత తనను అరెస్టు చేస్తారని, జైల్లో వేస్తారని హారిసన్ ఊహించి ఉండరని ఈ కేసును పరిశోధించిన పోలీసు అధికారి కాలండర్ బీబీసీతో అన్నారు.
‘‘అతని అతి తెలివితేటలు అతని పతనానికి కారణమని అనుకుంటున్నాను. ఎందుకంటే 40 సంవత్సరాల తరువాత తనను ఎవరు పట్టుకుంటారులే అన్న ధైర్యంతో ఉన్నాడాయన’’ అని కాలండర్ చెప్పారు.
‘‘మీరు పోలీసులు అతన్ని వీడియో కెమెరాల ముందు విచారించిన తీరును చూస్తే, అతను తనకు తానే నేరాన్ని ఒప్పుకుని ఈ కేసులో ఇరుక్కుపోయాడు’’ అన్నారాయన.
తాను అందరికంటే తెలివైన వాడినని, ఈ కేసు నుంచి సులభంగా బయటపడగలనని అతను భావించాడని కాలండర్ చెప్పారు.

ఫొటో సోర్స్, CROWN OFFICE
హారిసన్ హింసాత్మక ప్రవృత్తి
ఉన్నత చదువులు చదువుకున్న హారిసన్, బ్రెండా పేజ్లు 1972లో పెళ్లాడారు. అయితే , వైవాహిక జీవితంలో తాను సంతోషంగా లేనని బ్రెండా తన సన్నిహితులతో చెప్పుకునేది. తన భర్తంటే తనకు భయంగా ఉందని చెప్పేవారు.
నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. బ్రెండా పేజ్ సొంతంగా ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు.
అయితే, విడాకులు తీసుకున్న తర్వాత కూడా బ్రెండా పేజ్ను హారిసన్ వేధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. ఇతర మగవాళ్లతో ఆమెకు సంబంధం ఉందని అతను అనుమానించేవాడని, ఆమెను వేశ్య అంటూ నిందించే వాడని ఆమె తమకు చెప్పుకునేదని కుటుంబ సభ్యులు వివరించారు.
పేజ్ మేనల్లుడు 59 ఏళ్ల క్రిస్ లింగ్ హారిసన్పై విచారణ జరుగుతున్న సమయంలో ప్రతి రోజూ కోర్టుకు వచ్చేవారు.
"కోర్టుకు రావడం చాలా విచిత్రమైన అనుభూతి. నా అత్తను హత్య చేసిన నిందితుడు మా మధ్యే ఇన్నాళ్లు తిరిగాడు. మా ముందే ఉన్నాడు.’’ అని లింగ్ బీబీసీతో అన్నారు.
డీఎన్ఏ టెక్నాలజీలో వచ్చిన డెవలప్మెంట్స్ కారణంగా నిందితుడిని ఇప్పటికైనా గుర్తించగలిగామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కేసు విచారణ కోసం పోలీసులు ఈ 40 ఏళ్లలో 4 వేలమంది సాక్షుల్ని ప్రశ్నించారు. 3 వేలమంది నుంచి వాంగ్మూలాలను తీసుకున్నారు. ఈ కేసు రీ ఓపెన్ అయిన తర్వాతనే సుమారు 500 స్టేట్మెంట్లను రికార్డు చేశారు.
ఇవి కూడా చదవండి:
- భారత మాజీ నేవీ అధికారుల విడుదలలో షారుక్ ఖాన్ పాత్ర ఉందా? ఈయన పేరు ఎందుకు ట్రెండ్ అయ్యింది?
- స్పీడ్ డేట్:ప్రేమికుల రోజుని వ్యతిరేకించే వారికి నిరసనగా మొదలైన ఈ కొత్త ట్రెండ్ ఏంటి?
- పుల్వామా దాడికి అయిదేళ్లు : కశ్మీర్ ఎలా విడిపోయింది, వారికి ఏం కావాలి?
- రైతులు రెండేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు 'చలో దిల్లీ' అంటూ నిరసన బాట పట్టారెందుకు?
- బెల్లం తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)













