మధ్యప్రదేశ్: 400 అడుగుల బోరుబావిలో పడిన బాలుడిని రక్షించేందుకు ప్రయత్నాలు

పొలంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన బాలుడు

ఫొటో సోర్స్, ANI

మధ్యప్రదేశ్‌లో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన ఎనిమిదేళ్ల బాలుడిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

మంగళవారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల తన్మయ్ సాహు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు.

400 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడిన తన్మయ్ 55 అడుగుల లోతున చిక్కుకుపోయి ఉన్నాడు.

ప్రస్తుతం బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నప్పటికీ లోపల అంతా బురదగా ఉండడంతో తన్మయ్ పరిస్థితి ఎలా ఉందన్నది తెలియడం లేదని సహాయ సిబ్బంది చెబుతున్నారు.

బేతుల్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదం నుంచి తన్మయ్‌ను కాపాడేందుకు మధ్యప్రదేశ్ విపత్తు నిర్వహణ దళాలు కృషి చేస్తున్నాయి.

తన్మయ్‌ను రక్షించడానికి మరికొన్ని గంటల సమయం పట్టొచ్చని, బేతుల్ జిల్లా కలెక్టర్ శ్యామేంద్ర జైస్వాల్ ఏఎన్ఐ వార్తాసంస్థతో చెప్పారు.

‘బోరుబావిలో రాళ్లున్నాయి. అందువల్ల సహాయచర్యలు అంత సులభంగా సాగడం లేదు. ప్రస్తుతం పొక్లెయిన్లతో తవ్వకం పనులు చేస్తున్నాం’ అని శ్యామేంద్ర చెప్పారు.

కాగా తన్మయ్ గురించి ఆందోళన వ్యక్తంచేస్తూ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. ‘స్థానిక అధికారులతో క్రమం తప్పకుండా సంప్రదిస్తున్నాను. సహాయ చర్యలు ఎంతవరకు వచ్చాయో తెలుసుకుంటున్నాను. తన్మయ్ సురక్షితంగా ఉండాలి’ అని ప్రార్థిస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

వ్యవసాయ అవసరాల కోసం భూగర్భ జలాలను వినియోగించుకునేందుకు భారత్‌లో రైతులు బోరుబావులు తవ్విస్తుంటారు.

ఇలా బావులు తవ్వేటప్పుడు అన్ని సందర్భాలలోనూ వాటిలో నీరు పడదు. నీరు పడని బోవులు నిరుపయోగం కావడంతో వాటిని వదిలేస్తుంటారు. పూడ్చకుండా వదిలేస్తుండడంతో అవి ప్రమాదకరంగా మారుతున్నాయి.

ముఖ్యంగా పిల్లలు వీటిలో పడుతున్నారు.

ఇలాంటి సన్నని బోరుబావుల్లో పడి ఊపిరందక ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)