ఆంధ్రప్రదేశ్: 'మారేడుమిల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్.. మడావి హిడ్మా, ఆయన భార్య రాజె సహా ఆరుగురు మావోయిస్టులు మృతి'

మావోయిస్టు హిడ్మా

ఫొటో సోర్స్, UGC

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో సీనియర్ నేత మడావి హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని అధికారులు వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌లో కొంతకాలంగా ఒత్తిడి పెరుగుతుండటంతో మావోయిస్టులకు చెందిన కొందరు సీనియర్ నేతలు ఆంధ్రప్రదేశ్ అరణ్యంలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తూ, ఇక్కడ ఉద్యమాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తమకు కచ్చితమైన సమాచారం అందిందని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే మారేడుమిల్లి మండలంలోని అడవుల్లో మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఈ ఘటన జరిగిందనీ, ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని, వారిలో మడావి హిడ్మాతోపాటు ఆయన భార్య రాజె కూడా ఉన్నారని మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు.

అంతకుముందు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం అందిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కూడా తెలిపారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎవరీ హిడ్మా?

బక్కపల్చగా కనిపించే ఈ మావోయిస్టు నేత, దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో అత్యధిక సంఖ్యలో పోలీసుల మరణాలకు కారకుడిగా చెబుతారు.

1996-97 ప్రాంతంలో తన 17వ ఏట మావోయిస్టు పార్టీలో చేరారు మడావి హిడ్మా. ఆయనకు హిద్మల్లు, సంతోష్‌ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి.

దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం ఆయన సొంతూరు. ఆ గ్రామం నుంచి దాదాపు 40-50 మంది మావోయిస్టులు ఉంటారని అంచనా. పార్టీలోకి రాకముందు హిడ్మా వ్యవసాయం చేసుకునేవారు.

ఎక్కువగా మాట్లాడే అలవాటు లేని హిడ్మా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తారు. ఆ క్రమంలోనే మావోయిస్టు పార్టీతో కలసి పనిచేసిన ఒక లెక్చరర్ ద్వారా ఇంగ్లీషు నేర్చుకున్నారు.

తన మాతృభాష కాని హిందీని కూడా ఎంతో ఆసక్తితో నేర్చుకున్న ఆయన చదివింది మాత్రం 7వ తరగతే.

''హిడ్మాను 2000వ సంవత్సరం ప్రాంతంలో మావోయిస్టులకు అవసరమైన ఆయుధాల తయారీ విభాగంలో వేశారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే కుతూహలం అక్కడ కూడా ప్రదర్శించారని చెబుతారు. ఆయుధాల తయారీ, రిపేర్లు చేసేవాడు. గ్రనేడ్లు, లాంఛర్లు స్థానికంగా తయారు చేయించాడు'' అని మావోయిస్టు పార్టీ మాజీ సభ్యుడు ఒకరు గతంలో బీబీసీకి చెప్పారు.

మావోయిస్టుల సమావేశం (ఫైల్‌ ఫొటో)

ఫొటో సోర్స్, CGKHABAR/BBC

ఫొటో క్యాప్షన్, మావోయిస్టుల సమావేశం (ఫైల్‌ ఫొటో)

దళంలో కీలకం

2001-02 ప్రాంతాల్లో దక్షిణ బస్తర్ జిల్లా ప్లటూన్‌లో ఎదిగారు హిడ్మా. తరువాత మావోయిస్టు సాయుధ విభాగం పీఎల్‌జీఏ ( పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)లో చేరారు.

2001-2007 మధ్య హిడ్మా సాధారణ మావోయిస్టు పార్టీ సభ్యుడుగానే ఉన్నారు. కానీ బస్తర్ ప్రాంతంలో సల్వాజుడుం ఎదుగుదల, హిడ్మా మరింత యాక్టివ్‌గా మారడంలో కీలక పాత్ర పోషించిందంటారు మావోయిస్టు కార్యకలాపాలను విశ్లేషించిన వారు.

2007వ సంవత్సరం మార్చి నెలలో ఉర్పల్ మెట్ట ప్రాంతంలో పోలీసులపై దాడి జరిగింది. ఇందులో 24 మంది సీఆర్పీఎఫ్‌ పోలీసులు మరణించారు. హిడ్మా నాయకత్వంలో ఈ దాడి జరిగిందని చెబుతారు.

మావోయిస్టులను మందుపాతరల నుంచి తుపాకులవైపు మళ్లించడంలో హిడ్మాది కీలక పాత్రగా చెబుతారు.

''నిజానికి హిడ్మా దూకుడు పార్టీ నాయకత్వనికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. తరువాత కూడా ఆయన ఆ దూకుడును కొనసాగించాడు. అందుకే పార్టీ ఆయనకు పెద్ద బాధ్యతలు ఇస్తూ పోయింది'' అని ఒక మాజీ మహిళా మావోయిస్టు గతంలో బీబీసీకి చెప్పారు.

2008-09 ప్రాంతంలో మావోయిస్టు పార్టీ అప్పుడే ఏర్పాటు చేసిన ఫస్ట్ బెటాలియన్‌కి కమాండర్ అయ్యారు హిడ్మా. ఈ ఫస్ట్ బెటాలియన్ బస్తర్ ప్రాంతంలో చురుగ్గా ఉంటుంది.

తరువాత 2011లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలో హిడ్మా సభ్యుడయ్యారు.

2010 ఏప్రిల్ లో జరిగిన తాడిమెట్ల ఘటనలో 76 మంది పోలీసులు మరణించారు. 2017 మార్చిలో 12 మంది సీఆర్పీఎఫ్ పోలీసుల మృతి చెందారు. ఈ రెండు ఘటనల్లో హిడ్మా పాత్ర ఉందని చెబుతారు.

హిడ్మా

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మడావి హిడ్మా ( ఫైల్ ఫోటో)

తుపాకీ పట్టడం అరుదు

2011 ప్రాంతంలో మావోయిస్టు పార్టీలో హిడ్మా గురించి ఆసక్తికర చర్చ జరిగిందని అప్పట్లో మావోయిస్టు పార్టీలో ఉండి తరువాత బయటకు వచ్చిన ఒక మావోయిస్టు చెప్పారు.

''ఆ చర్చ ఆయన పోరాట శైలి గురించి. హిడ్మా అనేక పోరాటాల్లో క్షేత్ర స్థాయిలో పాల్గొన్నా, స్వయంగా తూటాలు పేల్చేది తక్కువ. దగ్గరుండి మిగిలిన మావోయిస్టులను నడిపిస్తారు.

ఎంతో తప్పనిసరి అయితే తప్ప తన దగ్గరున్న తుపాకీ ఉపయోగించరు. ఆయన నాయకత్వంలోని దళం చాలా చురుగ్గా పని చేస్తుంది. అలాగని ఆయన యుద్ధ భూమికి దూరంగా ఉండరు. పక్కనే ఉండి నడిపిస్తారు'' అని ఆ మాజీ మావోయిస్టు ఒకరు హిడ్మా గురించి చెప్పారు.

''ఇంకా విచిత్రం ఏంటంటే, నాకు తెలిసి 2012 వరకూ హిడ్మాకు ఒక్క చిన్న గాయం కూడా కాలేదు. అన్ని వేల బుల్లెట్ల పోరాటంలో అతనున్నా, చిన్న గాయం కాకుండా ఉండడం విచిత్రమైన విషయం. 2012 తరువాత అతనికి ఏమైనా గాయాలు అయ్యాయా అనేది నాకు తెలియదు'' అని బీబీసీకి చెప్పారు ఆ మాజీ మావోయిస్టు.

పోలీసులకు-మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, పోలీసులకు-మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు (ఫైల్ ఫోటో)

స్థానికంగా క్రేజ్

‘‘బస్తర్ స్థానికుడు హిడ్మా. అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. స్థానికులతో కలిసిపోతారు. వారితో సత్సంబంధాలు ఉంటాయి. అతనికి స్థానిక యూత్‌లో బాగా క్రేజ్ ఉంది. అక్కడి వారు అతణ్ణి ఓ దేవుడిలా చూస్తారు'' అని దండకారణ్యం వార్తలు కవర్ చేసిన ఒక విలేఖరి బీబీసీకి చెప్పారు.

‘‘ఎవరేం చెప్పినా శ్రద్ధగా విని నోట్స్ రాసుకోవడం ఆయనకు అలవాటు'' అని హిడ్మా గురించి చెప్పారాయన.

''హిడ్మా విదేశాల్లో శిక్షణ పొందారన్నది తప్పు. నాకు తెలిసినంత వరకూ ఆయన ఎప్పుడూ ఏ పెద్ద నగరమూ చూసి ఉండరు. ఆయన బస్తర్, దండకారణ్యం దాటి ఉండకపోవచ్చు. అసలు మెయిన్ రోడ్లపై హిడ్మా ప్రయాణించిన దాఖలాలు కూడా లేవు'' అన్నారాయన.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)