You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్ ఫైజర్ వ్యాక్సీన్కు ఆమోదం తెలిపిన బ్రిటన్... వచ్చే వారమే పంపిణీ ప్రారంభం
- రచయిత, మిషెల్లీ రాబర్ట్స్
- హోదా, హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్ ఆన్లైన్
ఫైజర్-బయోఎన్టెక్ అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సీన్ విస్తృత వినియోగానికి బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రపంచంలో ఈ వ్యాక్సీన్ను ఆమోదించిన తొలి దేశమైన బ్రిటన్ వచ్చే వారం నుంచే ఈ వ్యాక్సీన్ పంపిణీకి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.
కోవిడ్ -19 వ్యాధి నుంచి ఈ వ్యాక్సీన్ 95 శాతం రక్షణ కల్పిస్తుందని, ఇది సురక్షితమైనదని బ్రిటన్ రెగ్యులేటరీ సంస్థ ఎంహెచ్ఆర్ఏ తెలిపింది.
బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే 4 కోట్ల డోసులకు ఆర్డర్ చేసింది. ఇది 2 కోట్ల మందిని వ్యాక్సినేట్ చేయడానికి సరిపోతుంది. త్వరలో కోటి డోసులు అందుబాటులోకి రాబోతున్నాయి. వాటితో బ్రిటన్లో టీకాలు ఇచ్చే ప్రక్రియ మొదలవుతుంది.
ప్రపంచంలో ఇప్పటివరకు అత్యంత వేగంగా తయారైన వ్యాక్సీన్ ఇదే. సాధారణంగా ఒక వ్యాక్సీన్ అభివృద్ధి చేయడానికి దాదాపు దశాబ్ద కాలం పడుతుంది. అటువంటిది, ఈ వ్యాక్సీన్ను కేవలం 10 నెలల్లో అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు.
బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హాంకాక్, "సహాయం మీ దారిలో ఉంది. వచ్చే వారమే టీకాలు ఇచ్చేందుకు ఎన్హెచ్ఎస్ సిద్ధంగా ఉంది" అని ట్వీట్ చేశారు.
వ్యాక్సీన్ ఇచ్చే ప్రక్రియ మొదలవుతున్నప్పటికీ, ప్రజలు మాత్రం ఇకపై కూడా అప్రమత్తంగా ఉండాలని, వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలను కొనసాగించాలని నిపుణులు చెబుతున్నారు.
అంటే, వ్యక్తుల మధ్య దూరాన్ని పాటించడం, మాస్కులు ధరించడం, లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవడం, పాజిటివ్ అని తేలితో ఐసోలేషన్లో ఉండడం వంటి నిబంధనలను పాటించాలని వారు చెబుతున్నారు.
కోవిడ్ నుంచి 90 శాతం రక్షణ
ఫైజర్, బయోఎన్టెక్ ఔషధ సంస్థలు తయారు చేసిన వ్యాక్సీన్ కోవిడ్-19 నుంచి మనుషులకు 90 శాతం రక్షణ కల్పిస్తున్నట్లు ప్రాథమిక పరిశీలనలో తేలిందని ఫైజర్ సంస్థ నవంబర్ 9న ప్రకటించింది.
సైన్స్కి, మానవాళికి ఇది ఒక అద్భుతమైన రోజు అని ఆ సంస్థలు వర్ణించాయి.
ఆరు దేశాల్లోని 43,500 మందిపై ఈ వ్యాక్సీన్ను పరీక్షించారు. దీని భద్రత గురించి ఎలాంటి ఆందోళనలూ వ్యక్తం కాలేదు.
నవంబర్ నెలాఖరులోగా ఈ వ్యాక్సీన్ను ఉపయోగించేందుకు అత్యవసర అనుమతులు పొందాలని ఈ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.
ఈ వ్యాక్సీన్ను కరోనాతో పోరాటానికి అత్యంత సమర్థవంతమైన ఆయుధంగా భావిస్తున్నారు.
మరో డజను వ్యాక్సీన్లు తుది దశ ట్రయల్స్లో ఉన్నాయి. కానీ. అత్యధిక శాతం సానుకూల ఫలితాలను చూపించిన మొట్టమొదటి వ్యాక్సీన్ మాత్రం ఇదేనని చెబుతున్నారు.
ఈ వ్యాక్సీన్ కోసం పూర్తిగా ప్రయోగాత్మక విధానాన్ని ఉపయోగించారు. ఈ ప్రక్రియలో వైరస్తో పోరాడేలా రోగనిరోధక శక్తికి శిక్షణ ఇచ్చేందుకు వైరస్ జెనెటిక్ కోడ్ను శరీరంలోకి ఎక్కించారు.
ఈ వ్యాక్సీన్ను మూడు వారాల్లో రెండు డోసులు తీసుకోవాలి. ఇప్పటివరకూ అమెరికా, బ్రెజిల్, జర్మనీ, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, టర్కీలో ట్రయల్స్ నిర్వహించగా, అందులో పాల్గొన్న 90 శాతం మందిలో ఏడు రోజుల్లోనే కరోనావైరస్ను ఎదుర్కొనే స్థాయిలో రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడింది.
ఈ ఏడాది చివరికల్లా ఈ వ్యాక్సీన్ 5 కోట్ల డోసులు అందుబాటులోకి తీసుకురాగలమని, 2021 చివరి నాటికి 130 కోట్ల డోసులు తయారు చేయగలమని ఫైజర్ చెబుతోంది.
కానీ, ఈ వ్యాక్సీన్ను భద్రపరచడానికి సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. దీనిని మైనస్ 80 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది.
రోగ నిరోధక శక్తిపై దీని ప్రభావం ఎంత కాలం ఉంటుంది? వివిధ వయసుల వారిలో దీని ప్రభావం ఎలా ఉంటుంది? అనేదానిపై రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. కానీ, కంపెనీ ఇప్పటివరకూ దానికి సంబంధించి ఎలాంటి సమాచారమూ వెల్లడించలేదు.
"మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారిని ఈ సంక్షోభం నుంచి బయటపడేయడానికి చాలా దగ్గరగా వచ్చాం" అని ఫైజర్ చైర్మన్ డాక్టర్ ఆల్బర్ట్ బోర్లా చెప్పారు.
బయోఎన్టెక్ ప్రొఫెసర్ ఉగూర్ సాహీన్ ఈ ఫలితాలను ఒక 'మైలురాయి'గా అభివర్ణించారు.
ఇప్పటివరకూ అందిన డేటా తుది విశ్లేషణ కాదు. దీనిని మొదటి 94 మంది వలంటీర్ల డేటా ఆధారంగా చెప్పారు. పూర్తి ఫలితాలను విశ్లేషించాక వ్యాక్సీన్ కచ్చిత ప్రభావంలో మార్పు ఉండవచ్చు.
నవంబరు మూడోవారంలో తమ వ్యాక్సీన్ను ఔషధ నియంత్రణ సంస్థల దగ్గరికి తీసుకెళ్లే స్థితిలో ఉంటామని ఈ సంస్థలు చెబుతున్నాయి.
ఇప్పటికే ఈ వ్యాక్సీన్ నాలుగు కోట్ల డోసులకు బ్రిటన్ ఆర్డర్ ఇచ్చింది. ఇవి 2 కోట్ల మందికి సరిపోతాయి.
ఇది శుభపరిణామం అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పీటర్ హార్బీ అన్నారు.
"ఈ వార్త ఎంతో ఉపశమనం కలిగించింది. ఇదొక చారిత్రక ఘట్టంలా అనిపిస్తోంది" అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- ఆలయంలో ముద్దు సీన్, నెట్ఫ్లిక్స్పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)