అభిప్రాయం: వాళ్లు బేషరతుగా లొంగిపోయారు!

ఫొటో సోర్స్, Getty Images/tdp.ncbn.official/facebook
- రచయిత, డానీ
- హోదా, బీబీసీ కోసం
జాతీయ బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్లో ఓ రాజకీయ వీధి నాటకం మొదలవుతూ ఉంటుంది.
దీన్ని ఓ వారం రోజులు ఆడుతారు. అందరూ ఆరితేరిన నటులు కావడంతో తమ నటనా చాతుర్యంతో ఒక యుధ్ధం మొదలయిపోతున్నంత హడావుడి సృష్టిస్తారు.
ఆ తరువాత, ఎవరి డేరాలు, కుర్చీలు బల్లలు, మైకులు వాళ్ళు తీసుకుని ఎవరి దారిన వాళ్ళు మెల్లగా జారుకుంటారు.
పౌరాణిక పాత్రలు పుట్టినపుడు మంత్రసాని చేతుల్లో మొదలుకుని చచ్చేక చితి మీద శయనించే వరకు ఒకే మూసలో ప్రవర్తిస్తుంటాయి.
మినహాయింపు లేకుండా మన రాజకీయ నాయకులు అందరూ పౌరాణిక పాత్రల వంటి వారు.
ఎవరి మూస వారిది. ఎంత హిచ్ కాక్, రామ్ గోపాల్ వర్మ సినిమా అయినా మొదటి వారం ఉన్నంత ఉత్కంఠ, సస్పెన్సు రెండోవారం వుండదు!

ఫొటో సోర్స్, AFP
ఏపీ రాజకీయ నాయకులు గత ఐదు కేంద్ర బడ్జెట్లుగా ఒకే నాటకం ఆడుతున్నారు.
అంచేత, నాటకం మొదలు కాకుండానే, పాత్రల డైలాగుల్ని సహితం ప్రజలు ముందుగానే చెప్పేస్తున్నారు.
అరుణ్ జైట్లీ యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ముందే ఏపీలో మూడు విషయాలు తెలిసిపోయాయి.
మొదటిది - ఇది కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బడ్జెట్ అనేది.
రెండోది - దేశంలో రగులుకుంటున్న రైతాంగ పోరాటాలను శాంతింపచేసే ప్రయత్నం చేస్తారనేది.
మూడోది - అన్నింటికన్నా కీలకమైనది, ఏపీకి ఏమీ ఇవ్వరనేది.
ఇందులో మూడోది చిత్రమైనదేగానీ ఏపీకీ ఏమీ ఇవ్వక పోయినా చంద్రబాబు ఏమీ చేయలేరనే అభిప్రాయం జనంలో బలంగా నాటుకుంది.
ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తానని బహిరంగ సభలో ప్రకటించిన మోదీ మాటతప్పినా చంద్రబాబు, జగన్ నోరు మెదపలేని స్థితి బహిరంగమే.
జాతీయ ప్రజాస్వామిక కూటమిలో టీడీపీ కీలక భాగస్వామి. టీడీపీ అధినేత చంద్రబాబుకు గతంలో ఎన్డీయే కన్వీనర్గా పనిచేసిన చరిత్ర కూడా వుంది.
ఎందువల్లనో గానీ, నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక అమరావతికీ ఢిల్లీకీ మధ్య దూరం రానురాను పెరుగుతూ వుంది.
ఈ విషయం మీద అనేక కథనాలు ప్రచారంలో వున్నాయి.

ఫొటో సోర్స్, tdp.ncbn.official/facebook
జైట్లీ బడ్జెట్ను ప్రవేశపెట్టగానే గ్రాండ్ నేరేటివ్స్ యథావిధిగా మొదలయిపోయాయి.
బడ్జెట్ విదిలింపుల మీద చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో వున్నారని ప్రచారం మొదలైంది.
నిజానికి ఈ బడ్జెట్ మీద చంద్రబాబు ఎక్కడా మాట్లాడలేదు. వారి మనో భావాలను వారి అనుకూల మీడియా 'టెలీపతి' ద్వారా తెలుసుకుని కథనాలు ప్రచారంలో పెట్టింది.
స్క్రీన్ప్లే ప్రకారం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబుకు మోదీ ఎన్ని ఇచ్చారో వివరించారు.
అందులో "చంద్రబాబు కుమారుడు లోకేష్ బాబుకు మోదీ 19 అవార్డులు ఇప్పించారు" అనే విషయాన్ని మరీ నొక్కి చెప్పారు.
ఇందులో ఒక సమంజసమైన తర్కం వుంది.
ఎవరయినా చంద్రబాబును విమర్శిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృధ్ధిని అడ్డుకుంటున్నట్టే అనే తర్కాన్ని టీడీపీ శ్రేణులు కొంత కాలంగా బలంగా ప్రచారం చేస్తున్నాయి.
దాని ప్రకారం, చంద్రబాబు కుమారుడికి ఏదైనా ఇచ్చి సంతృప్తి పరిస్తే ఆంధ్రప్రదేశ్ను సంతృప్తి పరచినట్టేనని సోము వీర్రాజు తర్కం కావచ్చు.
ప్రత్యర్థుల్ని బహిరంగంగా ఉరివేయాలనీ, కత్తీ, ఢాలు పట్టుకుని యుధ్ధ రంగంలోనికి ఉరకాలనీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు టిజీ వెంకటేష్కు చాలా సరదా. బీజేపీ పొగరు దించుతామనీ, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమికి చంద్రబాబు నాయకత్వం వహిస్తారనీ వారు ఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
లోక్సభలో తక్కువగానూ, టీవీల ముందు అతిగానూ కనిపించే చిత్తూరు ఎంపీ నారమల్లి శివప్రసాద్ తాము కత్తులూ, ఢాళ్ళూ తీసి పదును పెట్టామనీ, చంద్రబాబు ఆదేశించగానే కదనరంగంలోనికి దూకేస్తామని ఆవేశం ప్రదర్శించారు.

ఫొటో సోర్స్, YS Jagan Mohan Reddy/Facebook
పాత్ర ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ సంభాషణలు వారికోసం ప్రత్యేకంగా వున్నాయి. నిధులు తేలేకపోయినందుకు ఆయన చంద్రబాబును విమర్శిస్తారేగానీ నిధులు ఇవ్వనందుకు మోదీని ఏమీ అనలేరు.
నిజానికి చంద్రబాబు కూడా కేంద్రం నుంచి తెచ్చుకోవలసినవి తెచ్చుకోలేక పోయారు. పైగా ఏపీకి రావలసినవి చాలా వదులుకున్నారు.
ఏపీకి ప్రత్యేక తరహా హోదాను కాకుండా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని కేంద్రం సంకేతాలను ఇచ్చినపుడు వారు చాలా సంబరపడ్డారు.
ప్రత్యేక తరహా హోదా ఆడపిల్లలాంటిదనీ, ప్రత్యేక ప్యాకేజీ మగ పిల్లాడు లాంటిదని గొప్పగా చెప్పుకున్నారు.
"కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా?" అని మురిసిపోయారు. [సీమంతం కూడా జరిపినట్టున్నారు].
చంద్రబాబు తరచూ తనను తాను ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక విప్లవ సారథి అని చెప్పుకుంటూ వుంటారు.
పురుషులు పురుడు పోసుకొనే దశకు జీవశాస్త్రం ఇంకా అభివృధ్ధి కాలేదని వారికి సమాచారం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
నాటకం నియమాల ప్రకారం కథ క్లైమాక్సుకు చేరుతున్నప్పుడు కొంచెం ఉత్కంఠను పెంచాలి.
ఆ నియమానికి లోబడి, ఎన్డీయేకు ప్రత్యామ్నాయంగా చంద్రబాబు వివిధ పార్టీల జాతీయ నాయకులతో సంప్రదింపులు చేస్తున్నట్టు పుకార్లు వినిపించాయి.
ఇలాంటివన్నీ సాధారణంగా సీయం పేషీ నుండే లీకుల రూపంలో బయటికి వస్తుంటాయి.
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో టీడీపీ అధ్యక్షుడు మంతనాలు చేసినట్లు అలా ఒక లీకు బయటికి వచ్చింది.
అనేక పార్టీలు తాము ఎన్డీఏ భాగస్వాములమని గొప్పగా చెప్పుకుంటుంటాయి గానీ నిజానికి సీబీఐ, ఈడీ, ఈసీ, ఆర్బీఐలను మోదీ తనకు నమ్మకమైన మిత్రులుగా భావిస్తుంటారు.
ఈ జాబితాలో సుప్రీంకోర్టు కూడా వుందని కొందరి అభిప్రాయం.
సీబీఐ భయం వున్నంత కాలం చంద్రబాబు జగన్ ఎన్నడూ యుధ్ధం కాదు కదా, మోదీ మీద ఒక్క పరుష పదాన్ని కూడా వాడలేరని ఏపీలోఇప్పుడే పుట్టిన పసిపిల్ల కూడా చెపుతుంది.
నిజానికి ఈ విషయాన్ని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబే స్వయంగా చెప్పారట.
కేంద్రంపై ఒత్తిడి తెస్తే కేసులు పెడతారని కొందరు అంటున్నారని, తాను వేటికీ భయపడేది లేదని వారే అన్నారట.

ఫొటో సోర్స్, GettyImages/DIBYANGSHU SARKAR
సమావేశంలో మోదీ మీద అమీతుమీ యుధ్ధానికి చంద్రబాబు జెండా ఊపేస్తున్న దశలో ఒక పక్క కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, మరోపక్క మోదీ ఆత్మీయ మిత్రుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఫోన్ చేసి వివాదాన్ని చల్లబరచారని ఇంకో లీకు వచ్చింది.
దానర్థం ఏమంటే, చంద్రబాబు మొదలెట్ట బోయిన యుధ్ధాన్ని మరోసారి వాయిదా వేశారని.
వచ్చేది ఎలాగూ ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెటే కనుక మోదీ ప్రభుత్వానికి సంబంధించి ఇదే ఐదవ బడ్జెట్, ఇదే చివరి బడ్జెట్.
చివరి బడ్జెట్ తరువాత కూడా చంద్రబాబు మొదటి యుధ్ధం చేయదలచలేదు.
దీని అర్థం ఏమంటే, ప్రత్యేక హోదానే కాకుండా పోలవరం, అమరావతి నిర్మాణాలు ప్రశ్నార్థకమయ్యాయి. చంద్రబాబు చిత్తశుద్ధి కూడా బోనులో పడింది.
ఉద్ధవ్ ఠాక్రే, రాజ్నాథ్ సింగ్, అమిత్షాలతో చంద్రబాబు చేశారంటున్న ఫోన్ సంభాషణల్లో ఎంత వాస్తవమో ? ఎంత కల్పనో మనకు తెలీదు.
సాధారణంగా బడ్జెట్ రూపకల్పన సమయంలోనే మంత్రివర్గ సూచనలు తీసుకుంటారు, కూటమి గాబట్టి భాగసామ్య పక్షాల అభిప్రాయాన్ని కుడా తీసుకుంటారు.
మోదీ ఈ లాంఛనాన్ని పాటించారో లేదో తెలీదు.
అయితే, తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రుల వ్యవహార శైలి కొన్ని అనుమానాలకు తావిచ్చింది.
సీనియర్ మంత్రి పి. అశోక్ గజపతిరాజు అసలు సమావేశానికే రాలేదు. జూనియర్ మంత్రి వై. సుజనా చౌదరి మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లోబీజేపీతో పొత్తును వదులుకోవడం సాధ్యం కాదనీ, ఆ పార్టీతో ఘర్షణ పడలేమనీ, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు రాలేమనీ వివరించారు.
వెరసి తాము బేషరతుగా లొంగిపోయామని తేల్చి చెప్పారు.
(రచయిత సీనియర్ జర్నలిస్టు)
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్పై స్పందించారు.. హామీలపై మాత్రం మౌనం వహించారు
- సోషల్: 2019 ఎన్నికల తర్వాత మీ పని కూడా ‘పకోడీలు అమ్ముకోవటమే’!
- భారత్లో ప్రజాస్వామ్య పయనం ఎటు వైపు?
- చంద్రబాబు సాధిస్తారా? జగన్ అస్త్రంగా మలుచుకుంటారా?
- హైపర్లూప్: భవిష్యత్తా? భ్రమా?
- ఆసియాలో విమానయానాన్ని ఎవరు శాసిస్తున్నారు?
- ఇవి తింటే.. మీ జుట్టు భద్రం!
- ప్రపంచ మార్కెట్లు ఎందుకిలా పతనమయ్యాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)








