ఆంధ్రప్రదేశ్పై స్పందించిన ప్రధాని మోదీ.. విభజన హామీలపై మాత్రం మౌనం

ఫొటో సోర్స్, Loksabha.nic.in
- రచయిత, బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్కు తగినన్ని నిధులు ఇవ్వలేదంటూ పార్లమెంటులో ఏపీ ఎంపీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
అయితే, ఎలాంటి హామీ చేయని మోదీ కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకే పరిమితమయ్యారు.
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్సభ బుధవారం ఆమోదించింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో మోదీ పాల్గొని ప్రసంగించారు.
గత రెండు రోజులుగా పార్లమెంటులో ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రధాని మాట్లాడేప్పుడు నిరసన విరమించుకుని తమతమ స్థానాల్లో కూర్చోగా.. వైసీపీ ఎంపీలు వాకౌట్ చేశారు.
ప్రధానమంత్రి తన ప్రసంగంలో ఏమన్నారంటే..
- మన దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి కూడా రాష్ట్రాలను విభజించారు. మూడు కొత్త రాష్ట్రాలు.. ఉత్తరాఖండ్, చత్తీశ్గఢ్, జార్ఖండ్ ఏర్పాటు చేశారు. అయితే, ఆ ప్రభుత్వ ముందుచూపుతో ఎలాంటి సమస్యలు లేకుండా ఈ విభజనలు చాలా చక్కగా జరిగాయి.
- ప్రభుత్వాధినేతలకు ముందుచూపు ఉండి, రాజకీయ స్వార్థం కోసం హడావుడి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే ఎంత మంచి నిర్ణయాలు తీసుకోవచ్చో ఇదే (మూడు రాష్ట్రాల ఏర్పాటు) ఉదాహరణ.
- మీ చరిత్రలో మీరు (కాంగ్రెస్ పార్టీ) దేశాన్ని ముక్కలు చేశారు. విషం తాగించారు. స్వాతంత్ర్యం ఏర్పడిన 70 ఏళ్ల తర్వాత కూడా.. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలు ప్రతిరోజూ శిక్ష అనుభవిస్తున్నారు.
- మీరు దేశాన్ని ఎలాగైతే ముక్కలు చేశారో.. అలాగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, హడావుడిగా.. పార్లమెంటు తలుపులు మూసేసి.. సభ సజావుగా లేకున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు పట్టించుకోకుండా.. మేం కూడా తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నప్పటికీ.. తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే ఇప్పటికీ మా లక్ష్యం.. కానీ, ఆంధ్రప్రదేశ్ విషయంలో మీరు ఎన్నికల కోసం చేసిన నిర్ణయం.. నాలుగేళ్ల తర్వాత కూడా సమస్యలు సృష్టిస్తోంది. మీకు ఇలాంటి పనులు పేరు తెచ్చిపెట్టవు.
- ‘మా హయాంలో అలా చేశాం, మేమైతే ఇలా చేసుండేవాళ్లం’ అంటూ క్యాసెట్ వినిపిస్తుంటారు. కానీ, భారత్ తర్వాత స్వాతంత్ర్యం పొందిన దేశాలు కూడా అభివృద్ధిలో దూసుకెళ్లాయి. మనం వెళ్లలేకపోయాం. దీన్ని అంగీకరించితీరాలి.
- మీరు (కాంగ్రెస్ పార్టీ) మాత్రం దేశాన్ని ముక్కలు చేసినా.. దేశం మీ వెంటే ఉంది. మీరు దేశాన్ని పాలిస్తున్నప్పుడు ప్రతిపక్షం నామమాత్రమే. అప్పుడు మీడియా కూడా పెద్దగా లేదు. ఉన్నా దేశాన్ని బలోపేతం చేయాలని పనిచేసేది. రేడియో మీ గీతాలే వినిపించేది. తర్వాత టీవీ వచ్చినా.. మీ సేవలోనే ఉంది. న్యాయ వ్యవస్థలో కూడా ఎవరుండాలనేది కాంగ్రెస్ పార్టీయే నిర్ణయించేది, నియమించేది. పంచాయితీల నుంచి పార్లమెంటు వరకూ మీ జెండాయే ఎగిరేది. అంత లగ్జరీ మీకు ఉండేది. కానీ, మీరు ఆ సమయాన్నంతా ఒక కుటుంబం కోసం (ఆ కుటుంబ పాటలు పాడుకుంటూ) గడిపారు. దేశం మొత్తం ఒకే కుటుంబాన్ని గుర్తుంచుకోవాలని మొత్తం శక్తినంతా అక్కడే వెచ్చించారు.
- ఆ సమయంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రజల సమర్థత మేరకు మీరు పనిచేసి ఉంటే.. దేశం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లేది. కానీ, మీరు మాత్రం సొంత డబ్బా వాయించుకున్నారు.
- నేను నిన్న ఖర్గే ప్రసంగం వింటున్నాను.. ఆయన అధికార పక్షాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారా? కర్నాటక ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారా? నాకప్పుడు అర్థం కాలేదు. ఖర్గే వినిపించిన కవితల్ని కర్నాటక ముఖ్యమంత్రి కచ్చితంగా వినే ఉంటారని ఆశిస్తున్నా. ‘నిజమే చెప్పాలి’ అని ఆ కవిత ప్రారంభంలో ఉన్న అక్షరాలను మాత్రం ఖర్గే ప్రస్తావించలేదు.

ఫొటో సోర్స్, Loksabha.nic.in
- కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఆగస్టు 15, 1947 తర్వాతే దేశం ఏర్పడిందని, అంతకు ముందు లేదనే భావనలో ఉంటారు. ఇది వారి అహంకారమా? తెలుసుకోలేకపోవటమా?
- మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు.. కాంగ్రెస్ పార్టీయో, నెహ్రూనో ప్రజాస్వామ్యాన్ని ఈ దేశానికి ఇవ్వలేదు. ఎప్పట్నుంచో ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది.
- రాజీవ్ గాంధీ హైదరాబాద్ ఎయిర్పోర్టులో దిగి.. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి.. షెడ్యూల్డు కులానికి చెందిన ముఖ్యమంత్రి స్వాగతం పలకటానికి విమానాశ్రయానికి వస్తే.. ఆ దళిత ముఖ్యమంత్రి టి అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించారు. అలాంటి మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది?
- తెలుగుదేశం పార్టీ.. ఎన్టీ రామారావు ఆ అవమానపు ఆగ్రహ జ్వాలల నుంచే పుట్టుకొచ్చారు. అంజయ్యకు జరిగిన అవమానాన్ని సరిదిద్దటానికే రామారావు తన సినీ జీవితాన్ని వదిలిపెట్టి రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు (రాజకీయాల్లోకి) వచ్చారు.
- అలాంటి మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారా? 90 కంటే ఎక్కువసార్లు రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసి.. రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి, ప్రజలు ఎన్నుకున్న పార్టీలను అధికారంలోంచి పీకేశారు.
- నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవికి పోటీలో నిలబడ్డారు. రాత్రికి రాత్రి మీరు ఆయన్ను ఓడించారు. అంజయ్య విషయంలో ఏం చేశారో సంజీవరెడ్డికీ అదే చేశారు.
- మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని మీ పార్టీ నాయకుడొకరు ప్రెస్మీట్లో చించేశారు. ఇలాంటివి మీకు పేరుతెచ్చిపెట్టవు.
- 15 కాంగ్రెస్ కమిటీల్లో 12 కమిటీలు సమర్థించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధమ ప్రధానమంత్రి కాకుండా అడ్డుపడిన అదేం ప్రజాస్వామ్యం. నెహ్రూను ప్రధానిని చేశారు. పటేల్ తొలి ప్రధాని అయితే ఇప్పుడీ కశ్మీర్ సమస్య ఉండేది కాదు.
- అలాంటి మీరు ప్రజాస్వామ్య పాఠాన్ని మా చేత చదివించాలని చూడొద్దు.
‘మోదీది రాజకీయ ప్రచార ప్రసంగం’
కాగా, మోదీ ప్రసంగం ప్రారంభించటానికి ముందు.. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.
మోదీ ప్రసంగిస్తున్నంతసేపూ ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాలని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేయటం గమనార్హం.
‘ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలు అమలు చేయండి’, ‘సభలో నాటకాలు ఆపండి’, ‘మ్యాచ్ ఫిక్సింగ్లు ఆపండి’, ‘అబద్ధపు ప్రసంగాలు ఆపండి’, అబద్ధపు హామీలు ఆపండి’ అంటూ మోదీ ప్రసంగిస్తున్నంతసేపూ కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు.
కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో దేశం ముందున్న సవాళ్ల గురించి కాకుండా కాంగ్రెస్ను నిందించటంపైనే దృష్టి పెట్టారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇలా సభల్లో మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చునని, ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన పార్లమెంటులో ఇలా మాట్లాడటం తగదన్నారు.
ఆంధ్రప్రదేశ్ విషయంతో పాటు పలు అంశాలపై ప్రధాని ఏం మాట్లాడతారో వినాలనుకున్నానని, అయితే ఆయన కేవలం రాజకీయ ప్రచార ప్రసంగం మాత్రమే చేశారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








