ప్రజాస్వామ్య సూచిలో భారత్ 10 స్థానాలు దిగజారడానికి 5 కారణాలివే!
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఎలా ఉంది? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ప్రజాస్వామ్య పరిస్థితులు మునుపటిలా ఉన్నాయా?
ఈ ప్రశ్నకు సమాధానం 'ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్' తాజా నివేదిక చెప్తోంది. దాని ప్రకారం 'అంతర్జాతీయ ప్రజాస్వామ్య సూచి'లో భారత్ ఏడాదిలోనే 10 స్థానాలు దిగజారింది.
2016లో భారత్ ఈ సూచిలో 32వ స్థానంలో ఉండగా 2017 నివేదికలో 42వ స్థానానికి పడిపోయింది.
ఒక్క భారత్లోనే కాదు, అంతర్జాతీయంగా అనేక దేశాల్లో ప్రజాస్వామ్య పరిస్థితులు క్షీణిస్తున్నాయని ఈ నివేదిక వెల్లడించింది.

గత పదేళ్లలో ఇదే అత్యల్ప స్కోరు
భారత్ విషయానికొస్తే గత పదేళ్లలో ఇదే అత్యంత క్షీణ దశ అని ఈ నివేదిక చెప్తోంది.
ఎన్నికల ప్రక్రియ, ప్రభుత్వ పనితీరు, రాజకీయ ప్రాతినిధ్యం, రాజకీయ సంస్కృతి, పౌర హక్కులు వంటి వివిధ అంశాలను ప్రాతిపదికగా చేసుకుని 167 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేసి రూపొందించిన ఈ నివేదికలో ప్రతి దేశానికి నిర్ణీత స్కోరు ఇచ్చారు.
అందులో భారత్కు 10కి గాను 7.23 స్కోరు దక్కింది. 2016లో ఇది 7.81గా ఉండేది. ఇంతకుముందు 2010లో అత్యల్ప స్కోరు 7.28 ఉండగా 2017లో అంతకంటే తక్కువగా 7.23 మాత్రమే సాధించింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచమంతా ఎలా ఉంది?
ఈ నివేదిక అధ్యయనం చేసిన 167 దేశాల్లో 19 దేశాల్లో మాత్రమే పూర్తిస్థాయిలో ప్రజాస్వామ్యం ఉన్నట్లు తేల్చారు.
57 దేశాల్లో ప్రజాస్వామ్యం లోపభూయిష్టంగా ఉందని, భారత్లోనూ లోపభూయిష్ట ప్రజాస్వామ్యమే ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ప్రపంచంలోని 44.8 శాతం జనాభా ఈ దేశాల్లోనే నివసిస్తున్నారు.
39 దేశాల్లో నియంత్రిత ప్రజాస్వామ్యం, 52 దేశాల్లో ఆధిపత్య పాలన ఉన్నట్లు నివేదిక తేల్చింది.
ప్రపంచ దేశాల్లో నార్వే ప్రథమ స్థానంలో ఉండగా ఉత్తరకొరియా అట్టడుగున ఉంది.

భారత్లో ఎందుకిలా..?
2016తో పోల్చితే ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల ర్యాంకింగ్ తగ్గింది. అందులో భారత్ కూడా ఒకటి. భారత్ ర్యాంకింగ్ తగ్గడానికి ప్రధానంగా 5 కారణాలను ప్రస్తావించింది.
- సంప్రదాయ మత సిద్ధాంతాలు పెరగడం
- రైట్ వింగ్ బలపడడం.
- అల్పసంఖ్యాక వర్గాలపై దాడులు
- చట్టాన్ని ప్రభుత్వేతర శక్తులు చేతుల్లోకి తీసుకోవడం
- వ్యతిరేక స్వరాలను అణగదొక్కే యత్నాలు
ఇవి కాకుండా అనేక సందర్భాల్లో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులపై నిషేధం విధించారని, ఛత్తీస్గఢ్, జమ్ముకశ్మీర్ వంటి రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో పాత్రికేయులకు స్వేచ్ఛ లేదని కూడా నివేదిక పేర్కొంది.
ప్రత్యేకించి మీడియా స్వేచ్ఛ విషయంలో భారత్ ప్రపంచంలో 49వ స్థానంలో ఉంది.

ఫొటో సోర్స్, The Economist Intelligence Unit
ప్రధాన దేశాల ర్యాంకింగు ఎంత?
అమెరికా 21వ స్థానంలో ఉండగా, జర్మనీ 13, యునైటెడ్ కింగ్డమ్ 14 స్థానాల్లో ఉన్నాయి.
బ్రిక్స్ దేశాల విషయానికొస్తే చైనా 139, రష్యా 135, బ్రెజిల్ 49, దక్షిణాఫ్రికా 41వ స్థానాల్లో ఉన్నాయి.
భారత్ పొరుగుదేశాల్లో పాకిస్తాన్ 110, బంగ్లాదేశ్ 92, శ్రీలంక 62, నేపాల్ 94, భూటాన్ 99వ స్థానంలో ఉన్నాయి.
(ఆధారం: ది ఎకనమిస్ట్ ఇంటిలిజెన్స్ యూనిట్)
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









