Democracy Summit: చైనా కోసం పాకిస్తాన్ అమెరికానే వదులుకుంటోందా.. ఇమ్రాన్ ఖాన్ తాజా నిర్ణయ ఫలితం ఎలా ఉండనుంది

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించాక జో బైడెన్ ఇంతవరకు పాకిస్తాన్ ప్రధానికి ఒక్క ఫోన్ కాల్ అయినా చేయలేదనేది పాకిస్థాన్ ఎప్పటినుంచో చేస్తోన్న ఫిర్యాదు.
పాకిస్తాన్ జాతీయ సలహాదారు మోయిద్ యూసుఫ్ కూడా దీనిఫై ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఈ ఫిర్యాదుల ఒత్తిడికి అమెరికా ఏమాత్రం లొంగలేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఇప్పటివరకు పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్తో మాట్లాడలేదు.
డెమోక్రసీ సమ్మిట్కు హాజరవ్వాలని పాకిస్తాన్ను గత నెలలో అమెరికా ఆహ్వానించడంతో ఇరుదేశాల మధ్య ఉన్న పొరపొచ్చాలు కాస్త తగ్గిపోతాయేమో అనిపించింది.
అమెరికా ఆధ్వర్యంలో డిసెంబర్ 9, 10 తేదీల్లో వర్చువల్గా ఈ సమావేశం జరుగుతోంది. శుక్రవారంతో ఈ శిఖరాగ్ర సమావేశం ముగుస్తోంది. కానీ ఇందులో పాల్గొనేందుకు పాకిస్తాన్ నిరాకరించింది.
దక్షిణాసియా నుంచి భారత్, పాకిస్తాన్, మాల్దీవులు, నేపాల్ దేశాలకు ఈ సదస్సుకు హాజరుకావాలని పిలుపు రాగా, శ్రీలంక, బంగ్లాదేశ్లకు ఆహ్వానం అందలేదు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ తిరస్కరణ
బైడెన్ ప్రభుత్వం ఈ సదస్సుకు 110 దేశాలను ఆహ్వానించింది. కానీ చైనా, రష్యా, టర్కీలను పక్కనబెట్టిన అమెరికా సర్కారు తైవాన్కు ఆహ్వానం పంపింది. తైవాన్ను పిలవడంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా కారణంగానే ఈ సదస్సుకు హాజరుకాకూడదని పాకిస్తాన్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
అసలే అమెరికాతో సంబంధాలు చెడిన నేపథ్యంలో, పాకిస్తాన్ తాజా వైఖరి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలహీనం చేస్తుందని అంటున్నారు.
గంటల తరబడి సంప్రదింపులు జరిపిన తర్వాత తాము ఈ సదస్సులో పాల్గొనడం లేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
జో బైడెన్తో మాట్లాడేందుకు తమ కేబినెట్లోని ఒక మంత్రిని పంపిస్తామని తొలుత పాకిస్తాన్ చెప్పుకొచ్చింది. కానీ చివరకు సదస్సులో ప్రాతినిధ్యం వహించకూడదని నిర్ణయించుకుంది.
''యూఎస్తో మా భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనది. రెండు దేశాల మధ్య జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలు సంబంధాలు విస్తరిస్తాయని మేం ఆశిస్తున్నాం. ప్రజాస్వామ్యం, మానవ హక్కులకు సంబంధించిన అంశాల పరంగా మేం అమెరికాతో సంప్రదింపులు జరుపుతాం. భవిష్యత్లో ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఎదురు చూస్తాం'' అని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
'అసలైన సోదరుడు పాకిస్తాన్'
పాకిస్తాన్ విదేశాంగ శాఖ చేసిన ప్రకటనను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ ట్వీట్ చేశారు. ''ప్రజాస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు పాకిస్తాన్ నిరాకరించింది. అసలైన, బలమైన సోదరుడు'' అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు.
సదస్సుకు పాకిస్తాన్ గైర్హాజరు కావడం చైనాకు సంతోషాన్ని కలిగించినట్లు ఆయన చేసిన ట్వీట్తో అర్థం అవుతోంది. పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం చైనా అని పాకిస్తాన్ మీడియా కూడా పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
''ఈ సదస్సుకు చైనాను ఆహ్వానించకపోవడానికి చాలా పెద్ద కారణం ఉంది. అమెరికాతో పటిష్ట అనుబంధం లేని కారణంగా ఈ సదస్సుకు దూరంగా ఉండాలని ఇస్లామాబాద్ నిర్ణయించుకుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్, పాకిస్తాన్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కూడా ఓ కారణం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నిర్వహించే ఆ సదస్సులో పాల్గొనడం పాకిస్తాన్కు సౌకర్యంగా ఉండదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బైడెన్ ఇప్పటివరకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో మాట్లాడలేదు. కానీ తాజా ఆహ్వానం ఇరుదేశాల మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నంలా కనిపించింది'' అని పాకిస్తాన్ ఆంగ్ల వార్తాపత్రిక ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది.
''పాకిస్తాన్ నిర్ణయం వెనుక చైనా హస్తం ఉందా? లేదా? అన్న సంగతి ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ ఈ విషయం గురించి చైనాను పాక్ సంప్రదించినట్లుగా అధికార వర్గాలు ధ్రువీకరించాయి. సదస్సులో పాల్గొనేందుకు పాకిస్తాన్ నిరాకరించడం చూస్తే, అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. ప్రజాస్వామ్యం, మానవహక్కులు ఆధారంగా అమెరికా తమపై ఆంక్షలు కూడా విధిస్తుందేమో అని పాకిస్తాన్ భయపడుతోంది'' అని ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ రాసుకొచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ నిర్ణయం సరైనదేనా?తప్పా?
పాకిస్తాన్ నిర్ణయంపై దౌత్యవేత్తలు, పాత్రికేయులు స్పందించారు. ''డెమోక్రసీ సమ్మిట్కు పాకిస్తాన్ గైర్హాజరు కావడం సమతుల్యమైన, జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయంలాగే అనిపిస్తోంది'' అని భారత్లో పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ట్వీట్ చేశారు.
దీన్ని రీట్వీట్ చేసిన పాకిస్తాన్ జర్నలిస్ట్ కమ్రాన్ యూసుఫ్ ''అనాలోచితం. మనల్ని మనమే ఒక మూలకు నెట్టుకుంటున్నట్లుగా ఉంది'' అని వ్యాఖ్యానించారు.
కమ్రాన్ యూసుఫ్ ట్వీట్కు బాసిత్ బదులిచ్చారు. ''పాకిస్తాన్-అమెరికా మధ్య సంబంధాలు ఎప్పుడో ఒక మూలకు పడ్డాయి. అంతర్జాతీయ సంబంధాలు నెరపడం అనేది ఒక ప్రక్రియ, అంతేగానీ ఒక కార్యక్రమం కాదు. మనకు మనమే మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టుకోలేం. యథార్థ విషయాలపై దృష్టి కేంద్రీకరించాల్సిన సమయం ఇది. మేమేం చేస్తున్నామో మాకు తెలుసు'' అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
దీని గురించి అబ్దుల్ బాసిత్ యూట్యూబ్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. సదస్సుకు హాజరుకాకూడదనే పాకిస్తాన్ నిర్ణయాన్ని ఆయన ఆ వీడియోలో సమర్థించారు.
''డెమోక్రసీ సమ్మిట్ను చూస్తే, అది చైనా వ్యతిరేక ప్రచార కార్యక్రమంలా అనిపిస్తోంది. సదస్సుకు ఆహ్వానించిన వారి పరంగా చూసినా, పిలుపు అందని వారి వైపు నుంచి గమనించినా అది అలాగే కనిపిస్తోంది'' అని అన్నారు.
''చైనా, రష్యాను ఆహ్వానించలేదు. కానీ బంగ్లాదేశ్, టర్కీలను ఆహ్వానించి ఉండాల్సింది. ప్రజాస్వామ్యం అంటే పాశ్చాత్య ప్రజాస్వామ్యం కాదు. ఇక్కడ ఆసక్తి కలిగించే అంశమేంటంటే సదస్సుకు తైవాన్ను కూడా పిలిచారు. 'వన్ చైనా పాలసీ'కి అంగీకరించిన తర్వాత కూడా ఇక్కడ తైవాన్ను అమెరికా ఆహ్వానించింది. తైవాన్ ఉండి, చైనా లేని ఆ సమావేశానికి పాకిస్తాన్ వెళ్లాలని ఎలా ఆశిస్తాం? చైనా, పాకిస్తాన్ మధ్య సంబంధాలను చెడగొట్టాలనే ఉద్దేశంతోనే అమెరికా మమ్మల్ని ఆహ్వానించినట్లు అనిపిస్తోంది. అందుకే మేం తీసుకున్న నిర్ణయం సమంజసమైనది'' అని ఆయన వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
''సదస్సుకు హాజరు కాకపోతే అమెరికాతో పాక్ సంబంధాలు చెడిపోతాయని అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలేమీ లేవు. ఒక కార్యక్రమానికి హాజరైనంత మాత్రానా, ఒక రోజులో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడవు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమెరికా ఈ సదస్సును నిర్వహిస్తోంది. దీనికన్నా ముందు వాతావరణ సదస్సు జరిగింది. దానికి పాకిస్తాన్ను ఆహ్వానించలేదు. కానీ డెమోక్రసీ సమ్మిట్ ద్వారా మాకు వల విసరాలని అమెరికా ప్రయత్నించింది. కానీ మేం సరైన నిర్ణయం తీసుకున్నాం. ఈ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉండబోదని మేం ఇప్పుడు నమ్ముతున్నాం'' అని ఆయన చెప్పారు.
ఈ సదస్సుకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న తర్వాత, గురువారం 'ఇస్లామాబాద్ సమావేశం-2021'లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు. ''అమెరికా-చైనాల మధ్య జరుగుతోన్న ప్రచ్ఛన్న యుద్ధంలో పాకిస్తాన్, ఎవరి పక్షం కూడా తీసుకోవాలని అనుకోవట్లేదు. కానీ ఆ రెండు దేశాల మధ్య శాంతి ఏర్పడాలని కోరుకుంటోంది'' అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- చెడ్డీ గ్యాంగ్: గుజరాత్ నుంచి వచ్చారు.. పగలు రెక్కీ, అర్థరాత్రి దోపిడీ
- మధులిక రావత్: సైనిక ఉద్యోగుల భార్యల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షురాలు
- ‘నా కళ్లతో నేను ఒక్క వ్యక్తినే చూశా.. ఆయన కాలిపోతున్నారు’ - బిపిన్ రావత్ హెలీకాప్టర్ ప్రమాదం ప్రత్యక్ష సాక్షి
- బీబీసీ 100 మంది మహిళలు 2021 - మంజులా ప్రదీప్: దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి
- 12ఏళ్ల మిస్టరీ వీడినట్లేనా? బిట్ కాయిన్ను కనిపెట్టిన సతోషీ నకమోటో ఈయనేనా?
- అనకాపల్లి బెల్లం మార్కెట్లో వ్యాపారం ఎందుకు తగ్గుతోంది?
- తిరుపతి: 2015లో కుండపోత వర్షాలు పడినా రాని వరదలు ఇప్పుడెందుకొచ్చాయి?
- పల్నాడు: ఈ పేరు ఎలా వచ్చింది, పల్నాడు ఉత్సవాల వెనుక కథ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












