నగదు, ఆవులు, బీర్ ప్రోత్సాహకాలతో కోవిడ్ టీకా వేసుకునే వారి సంఖ్యను పెంచవచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫెర్నాండో డ్యూయర్ట్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
ఈ ఏడాది మేలో థాయిలాండ్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలయింది. కానీ, మయిచెమ్ జిల్లాలో వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎక్కువ మంది ముందుకు రావడం లేదని అధికారులు గుర్తించారు.
రెండు రోజుల్లోనే, టీకా వేసుకోడానికి వచ్చేవారి సంఖ్య వందల్లో నుంచి వేలల్లోకి పెరిగిందని అధికారులు చెప్పారు. ఇదెలా జరిగింది?
ఒక ఆవు పుణ్యమా అని ఇది సాధ్యమైంది. అవును!
ఒక ఆవును బహుమతిగా గెలుచుకోవచ్చనే ఆశ, వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చే వారి సంఖ్యను పెంచింది.
2021 సంవత్సరం పొడవునా వ్యాక్సిన్ వేయించుకున్న స్థానికులకు వారానికొకసారి తీసే లాటరీలో ఒక ఆవును బహుమతిగా ఇస్తారు.
థాయ్లాండ్ తీసుకున్న ఈ నిర్ణయం మిగిలిన దేశాల కంటే విభిన్నంగా ఉంది.
ఇదే తరహాలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించడానికి వివిధ దేశాల్లో రకరకాల ప్రోత్సాహకాలు ఇస్తున్నారు.
అమెరికాలో కూడా టీకా వేయించుకునేలా ప్రోత్సహించడానికి, ఒక మిలియన్ డాలర్ల బహుమతి నుంచి బీర్, పేస్ట్రీలు, ఆఖరికి గంజాయి కూడా ఉచితంగా ఇస్తున్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి.
చైనాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో భాగంగా టీకా వేయించుకున్న వారికి ఉచితంగా గుడ్లు ఇవ్వడం, వస్తువులు కొనుగోలులో డిస్కౌంట్లు ఇవ్వడం లాంటివి చేర్చారు.
వ్యాక్సిన్ వేసుకునే వారికి 30 అమెరికా డాలర్లు ఇస్తామని గత నెలలో సెర్బియా ప్రభుత్వం ప్రకటించింది.
భారతదేశంలో టీకా వేసుకుంటూ తీసుకున్న సెల్ఫీలను ఒక పోటీకి పంపిస్తే, విజేతలకు 70 అమెరికా డాలర్ల బహుమతి లభిస్తుంది.
వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు వచ్చిన వారికి డాక్టర్లు, ఫార్మసిస్టులు బహుమతులు ఇవ్వడానికి ఆస్ట్రేలియా ఆరోగ్య నియంత్రణ సంస్థ థెరాప్యూటిక్ గూడ్స్ ఏజెన్సీ అనుమతించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆశ చూపే విధానం
ఇలాంటి పథకాల ద్వారా వ్యాక్సిన్ వేసుకునే వారి సంఖ్యను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.
కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోడానికి ప్రపంచ వ్యాప్తంగా వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.
అయితే, వ్యాక్సిన్ సరఫరా పెద్దగా సమస్య కాని దేశాల్లో కూడా అందరికీ వ్యాక్సిన్ వేయడం ఇప్పుడు చాలా కష్టంగా ఉంది.
బ్రిటన్లో మే 20 నాటికే 70 శాతానికి పైగా వయోజనులు తొలి డోసు వ్యాక్సిన్ తీసుకోవడం పూర్తయింది.
కానీ, టీకా వేసుకోడానికి ముందుకొచ్చే వారి సంఖ్య మాత్రం జనాభాలో సగం కంటే తక్కువగానే ఉంది.
అమెరికాలో 12 ఏళ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులే అయినప్పటికీ , ఇప్పటివరకు 13 రాష్ట్రాల్లోని వయోజనుల్లో 70 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసి) గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి.
జులై 4 నాటికి అమెరికాలోని పెద్దల్లో 70 శాతం మందికి వ్యాక్సిన్ వేయడం పూర్తి చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఇతర రోగాలకు టీకా వేసుకోవడం గురించి జరిగిన అధ్యయనాల్లో కూడా ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు వ్యాక్సిన్ తీసుకునే వారి సంఖ్యను పెంచుతాయనే చెబుతున్నాయి.
నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్పీవీ) షాట్ తీసుకునే వారి సంఖ్య పెరిగిందని 2015లో కింగ్స్ కాలేజీ లండన్ అధ్యయనం పేర్కొంది.
నైజీరియాలోని గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు టెటనస్ వ్యాక్సిన్ తీసుకోవడానికి కూడా ఇలాంటి ప్రోత్సాహకాలే పని చేశాయని 2019లో చేసిన అధ్యయనంలో హార్వర్డ్ యూనివర్సిటీ గమనించింది.
ఉదాసీనత, సంకోచం
అయితే, ఈ అధ్యయనాలకు భిన్నమైన నేపథ్యంలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
"వ్యాక్సిన్ గురించి సంకోచం ఇప్పటికే ఉంది. కానీ, ఈ సంకోచం ఇటీవల కాలంలో బయటపడినట్లు గతంలో ఎప్పుడూ రాలేదు" అని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఎపిడెమియాలజిస్ట్, డాక్టర్ ఫ్లేవియో టాక్స్వెర్డ్ చెప్పారు.
"ఇంటర్నెట్లో కూడా వ్యాక్సిన్ వ్యతిరేక ప్రచారాలు ఎక్కువయ్యాయి. అవి, మిగతా కుట్ర సిద్ధాంతాలతో కలిసిపోయాయి" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యాక్సిన్ తీసుకోవడానికి బహుమతులు ఇవ్వడం పరిష్కారం కాదు" అని బిహేవియరల్ సైంటిస్ట్ డాక్టర్ మితేష్ పటేల్ అన్నారు.
డాక్టర్ పటేల్ నడ్జ్ సిద్ధాంతాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఈ సిద్ధాంతం ప్రజల ప్రవర్తనను ప్రభావితం చేసి, పాజిటివ్గా ఒక నిర్ణయం తీసుకునేలా, వారి ఆలోచనలను బలోపేతం చేస్తుంది.
"వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పినప్పటికీ, అది వేసుకోని వారిని వ్యాక్సిన్ తీసుకోవడానికి సంకోచించే వారు, వ్యాక్సిన్ పట్ల ఉదాసీన వైఖరితో ఉన్నవారిగా రెండు వర్గాలుగా విభజించవచ్చు" అని ఆయన చెప్పారు.
"వ్యాక్సిన్ పట్ల ఉదాసీనత చూపే వారు నిజానికి టీకా వేసుకోడానికి వ్యతిరేకం కాదు. కానీ, వారు ఒక అపాయింట్మెంట్ తీసుకోవడానికి బయటకు వెళ్ళరు" అని డాక్టర్ పటేల్ అన్నారు.
"ఇక వ్యాక్సిన్ గురించి సంకోచించే వారు అది తీసుకోకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి అలాంటి వారిని లక్ష్యంగా చేసుకోవాలి" అన్నారు.
"ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు, టీకా సురక్షితమే అని చెప్పడం లాంటివి కూడా చేస్తే ఉపయోగం ఉంటుంది. ఇది మిశ్రమ విధానం" అని మితేష్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కుట్రలకు వ్యతిరేకంగా విధానాలు
కేవలం ప్రోత్సాహకాలు లాంటివే ఇవ్వడం వల్ల, వ్యాక్సిన్ల పట్ల అనుమానాలను పెంచే అవకాశం ఉందని డాక్టర్ టాక్స్ వెర్డ్ హెచ్చరించారు.
"కొందరు టీకా వల్ల ముప్పు ఉందని అనుకుంటారు. వ్యాక్సిన్ అంత మంచిదైతే, నాకు వేసుకోడానికి బహుమతులు ఎందుకు ఇస్తున్నారు?" అని అడుగుతారు.
వ్యాక్సిన్ తీసుకోవడానికి సంకోచించే వారిని ఒప్పించడం సమగ్రమైన విధాన నిర్ణయాల ద్వారానే సాధ్యం అవుతుందని దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీ, ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఇసాబెల్ బ్రోకాస్ అన్నారు.
"వ్యాక్సిన్ వేసుకున్న వారు రెండు మాస్కులు వేసుకోవాల్సిన అవసరం లేదు లాంటి నిర్ణయాలు పనిచేస్తాయి" అని అన్నారు.
వ్యాక్సిన్ తీసుకున్నవారికి ప్రత్యేకంగా ప్రయాణ నిబంధనలను సడలించడం లాంటి ప్రోత్సాహకాలు ఇవ్వవచ్చని బ్రిస్టల్ యూనివర్సిటీ లో మెడికల్ ఆంత్రొపాలజిస్ట్ డాక్టర్ బెన్ కాస్టన్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
"ఇప్పటికే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి మరోసారి కోవిడ్ పరీక్ష అవసరం లేకుండా దేశంలోకి అనుమతిస్తున్న ఫ్రాన్స్ లాంటి దేశాలను చూస్తున్నాం" అని అన్నారు.
పని మీద, సెలవులు గడపడానికి, లేదా విదేశాల్లోని స్నేహితులు, కుటుంబాన్ని కలవడానికి వెళ్లాలనుకునే వారికి ఇలాంటి ప్రోత్సాహకాలు ఉపయోగపడతాయి.
చివరకు, ఈ ప్రోత్సాహకాలు ప్రభావవంతంగా పని చేస్తున్నాయా లేదా అనేది టీకా వేసుకునే వారి సంఖ్య రూపంలో కనిపిస్తుంది. ఇది ఇప్పటికే నిరూపితమైంది.
ఇవి కూడా చదవండి:
- నకిలీ వ్యాక్సీన్లు: కరోనా టీకాలకూ తప్పని నకిలీల బెడద.. సోషల్ మీడియాలో అమ్మకం..
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- కోవిడ్-19: 'మమ్మల్ని తీసుకువెళ్లి యుద్ధభూమిలో పడేశారు' - జూనియర్ డాక్టర్లు
- మ్యూకోర్మైకోసిస్: భారత్లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








